ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అప్డేట్.. అక్టోబర్‌లో రోడ్డెక్కనున్న 350 ఎలక్ట్రిక్ బస్సులు

APSRTC Electric Buses : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) మంజూరైన 750 ఈ-బస్సులలో 350 బస్సులను అక్టోబర్‌లో అందుబాటులోకి తీసుకురానుంది. మిగిలిన బస్సులను ఈ ఏడాది చివరి నాటికి ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు.

Published on: Sep 1, 2026, 07:03:24 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రజారోగ్యం, పర్యావరణ పరిరక్షణ, ఆర్టీసీ ఆధునికీకరణ లక్ష్యంగా భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన 750 ఎలక్ట్రిక్ బస్సులలో మొదటి విడతగా 350 ఈ-బస్సులను ఈ ఏడాది అక్టోబరు నాటికి రోడ్డెక్కించేందుకు ఏపీఎస్ఆర్టీసీ వేగంగా అడుగులు వేస్తోంది. మిగిలిన బస్సులను డిసెంబరు ఆఖరు నాటికి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది.

పీఎం ఈ బస్సు సేవా స్కీమ్
పీఎం ఈ బస్సు సేవా స్కీమ్

పర్యావరణ పరిరక్షణకు ఏపీ ప్రభుత్వం పెద్దపీటప్రజా రవాణా వ్యవస్థను పూర్తిగా ఆధునీకరించడం, వాయు కాలుష్యాన్ని నియంత్రించడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ-బస్సుల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించారని ఏపీఎస్ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు తెలిపారు. భవిష్యత్తులో డిపోల వారీగా పాత డీజిల్ బస్సుల స్థానంలో పర్యావరణహిత ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందని పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మక పీఎం ఈ-బస్ సేవా పథకం (PM e-Bus Sewa Scheme) కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి దశలో 750 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించారు. అయితే ప్రయాణికుల రద్దీకి తగినట్లుగా సేవలందించేందుకు రాష్ట్రానికి అదనంగా మరో 300 ఈ-బస్సులను కేటాయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు.

ఈ-బస్సులకు నిరంతర ఛార్జింగ్ సదుపాయం కల్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ డిపోలలో ప్రత్యేక ఎలక్ట్రికల్ సబ్‌స్టేషన్లు, ఛార్జింగ్ పాయింట్ల ఏర్పాటు పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. పనులు శరవేగంగా పూర్తి చేసి, మొదటి విడతలో 350 బస్సులను అక్టోబరు కల్లా విజయవంతంగా ప్రారంభించగలమని ఛైర్మన్ ధీమా వ్యక్తం చేశారు. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు, అమరావతి, కడప, రాజమండ్రి వంటి ప్రధాన నగరాలు, చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రాధాన్యత క్రమంలో వీటిని అందుబాటులోకి తేనున్నారు.

రాష్ట్రంలో అమలు చేస్తున్న స్త్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకం మహిళా సాధికారతకు, వారి ఆర్థిక బలానికి ఎంతగానో తోడ్పడుతోందని కొనకళ్ల నారాయణరావు వెల్లడించారు. ఈ పథకం ద్వారా మహిళలు, వికలాంగులు ఎంతో సౌకర్యవంతంగా తమ గమ్యస్థానాలకు ఉచితంగా చేరుకుంటున్నారు.మహిళల ప్రయాణ సౌకర్యం, భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వం ఇప్పటివరకు ఉచిత ప్రయాణ సబ్సిడీ రూపంలో రూ.3,000 కోట్లకు పైగా ఆర్థిక భారాన్ని భరించింది. ఈ-బస్సుల రాకతో బస్సుల్లో రద్దీ నియంత్రణలోకి రావడంతో పాటు ప్రయాణికులకు సరికొత్త అనుభూతి లభించనుంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More