...
...
Next Story

Tirumala Brahmotsavam 2026 : తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు - నేడే అంకురార్పణ

Tirumala Brahmotsavam 2026 : తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 15 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈనేపథ్యంలో ఇవాళ రాత్రి యాగశాలలో అత్యంత వైభవంగా అంకురార్పణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు.

Published on: Sep 14, 2026, 06:02:42 IST
Advertisement

Tirumala Brahmotsavam 2026 : కలియుగ వైకుంఠమైన తిరుమల గిరులు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు సిద్ధమయ్యాయి. ఈ ఏడాది సెప్టెంబర్ 15వ తేదీ నుంచి తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఈ మహోత్సవాలకు శ్రీకారం చుడుతూ… వైఖానస ఆగమ సాంప్రదాయం ప్రకారం ఇవాళ (సెప్టెంబర్ 14) రాత్రి 7 గంటల నుంచి 8 గంటల మధ్యలో అంకురార్పణ ఘట్టాన్ని అత్యంత శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు.

తిరుమల
తిరుమల

ఆగమశాస్త్ర నియమాల ప్రకారం తిరుమల ఆలయంలోని యాగశాలలో ఈ క్రతువును జరుపుతారు. ఏదైనా వైదిక ఉత్సవం లేదా యజ్ఞం సఫలంగా జరగడానికి ముందు అంకురార్పణ చేయడం అనివార్యమైన ఆచారం. ఈ భూమండలమంతా పాడిపంటలతో, పశుపక్ష్యాదులతో సుభిక్షంగా, సస్యశ్యామలంగా వర్ధిల్లాలని స్వామివారిని వేడుకుంటూ నవధాన్యాలను మొలకెత్తించడమే ఈ అంకురార్పణ వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం.

సేనాధిపతి ఉత్సవం …

శ్రీవారి సర్వసైన్యాధ్యక్షుడైన శ్రీ విష్వక్సేనుల వారి ఉత్సవం ఈ వేడుకల్లో మొదటి ఘట్టం. ఉత్సవాల ప్రారంభానికి సూచికగా విష్వక్సేనుల వారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో వైభవంగా ఊరేగిస్తారు. జగద్రక్షకుడైన శ్రీనివాసుడి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించేందుకు, పర్యవేక్షణ బాధ్యతలను స్వీకరించేందుకే విష్వక్సేనులవారు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిస్తారని అర్చకులు వెల్లడిస్తారు.

అంకురార్పణ క్రతువులో భాగంగా మేదిని పూజకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. నవధాన్యాలు సమృద్ధిగా మొలకెత్తడానికి అవసరమైన పుట్టమన్నును సేకరించేందుకు ముందుగా భూదేవిని ప్రసన్నం చేసుకుంటారు. ఈ సందర్భంగా అర్చకులు వేద మంత్రోచ్ఛారణలతో భూసూక్తాన్ని పఠిస్తూ భూమికి పూజలు నిర్వహిస్తారు.

అంకురార్పణ….

వైఖానస ఆగమంలోని ప్రధాన ఘట్టాల్లో అంకురార్పణం లేదా బీజవాపనం అత్యంత కీలకమైనది. అర్చకులు పాలికలుగా పిలిచే మట్టికుండల్లో సేకరించిన పుట్టమన్నును నింపుతారు. వీటిలో నవగ్రహాలకు ప్రతీకగా నవధాన్యాలను నాటుతారు. ఈ విత్తనాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా బాగా మొలకెత్తాలని కాంక్షిస్తూ ఓషధీసూక్తాలను పఠిస్తారు.

ఈ పాలికల్లో ఉంచిన నవధాన్యాలను బ్రహ్మోత్సవాలు జరిగే తొమ్మిది రోజుల పాటు అత్యంత భక్తిశ్రద్ధలతో పెంచుతారు. ఉత్సవాల చివరి రోజున ఈ మొలకలను సేకరించి స్వామివారికి అక్షతారోపణ చేస్తారు. పాలికల్లో విత్తనాలు ఎంత సమృద్ధిగా, పచ్చగా చిగురిస్తే బ్రహ్మోత్సవాలు అంత ఘనంగా, విజయవంతంగా సాగుతాయని భక్తుల దృఢమైన విశ్వాసం.

  • 14-09-2026 : శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
  • 15-09-2026 : ధ్వజారోహణం
  • 19-09-2026 : అత్యంత ప్రతిష్టాత్మకమైన గరుడ వాహన సేవ
  • 22-09-2026 : రథోత్సవం
  • 23-09-2026 : చక్రస్నానం

బ్రహ్మోత్సవాల సమయంలో ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు, మళ్లీ సాయంత్రం 7 గంటల నుండి 9 గంటల వరకు వాహన సేవలు వేడుకగా సాగుతాయి.

బ్రహ్మోత్సవాలలోనే అత్యంత ముఖ్యమైన గరుడ సేవను వీక్షించేందుకు లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఘాట్ రోడ్లలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా రవాణా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందులో భాగంగా 18-09-2026 రాత్రి 9 గంటల నుండి 20-09-2026 ఉదయం 6 గంటల వరకు తిరుమల ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాల రాకపోకలను పూర్తిగా నిరాకరించారు. భక్తుల వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక రోడ్ మ్యాప్‌లు, పార్కింగ్ స్థలాలను సిద్ధం చేయాలని రవాణా విభాగాన్ని ఆదేశించారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks