10 లక్షల కొత్త పీఎన్జీ కనెక్షన్లు టార్గెట్.. కీలక నిర్ణయాలకు ఏపీ కేబినెట్ ఆమోదం!

AP Cabinet Decisions : ఏపీ కేబినెట్ పలు కీలక సంస్కరణలకు ఆమోదం తెలిపింది. అమరావతికి చట్టబద్ధత కల్పించేలా ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం తీర్మానం చేసింది.

Published on: Mar 26, 2026, 15:32:25 IST
By , Amaravati
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సీఎం చంద్రబాబు అధ్యక్షతన భేటీ అయిన మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం.. అమరావతిని రాష్ట్ర రాజధానిగా చట్టబద్ధం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014లోని సెక్షన్ 5కు సవరణ చేయాలని తీర్మానించింది. చట్టంలో కొత్త రాజధాని ప్రస్తావనకు బదులుగా అమరావతి పేరును చేర్చాలని మంత్రివర్గం ప్రతిపాదించింది. అలాగే, నీరుకొండలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, ఏపీలో 60 మీటర్ల ఎత్తు వరకు విద్యా భవనాల నిర్మాణానికి ఆమోదం తెలిపింది.

ఏపీ కేబినెట్ నిర్ణయాలు
ఏపీ కేబినెట్ నిర్ణయాలు

ఇతర కీలక నిర్ణయాలతో పాటు, రాష్ట్రవ్యాప్తంగా 96 జూనియర్, సీనియర్ సివిల్ జడ్జి కోర్టుల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అలాగే వడ్డెర కమ్యూనిటీ సంఘాలకు ఖనిజ లీజుల ప్రాధాన్యతా కేటాయింపుపై చర్చించింది. ఖనిజ లీజు కేటాయింపులకు సంబంధించిన ప్రీమియం, సీనియరేజ్ ఫీజులలో 50 శాతం రాయితీని కూడా కేబినెట్ ఆమోదించింది.

కుప్పంలోని బాలికల పాఠశాలలో పీఈటీ, నర్సు, రికార్డ్ అసిస్టెంట్ పోస్టులను మంజూరు చేయడానికి కూడా ఆమోదం లభించింది. 2025–28 ఆర్థిక సంవత్సరానికి గాను బకాయి ఉన్న ఆస్తి పన్నుపై వడ్డీని మాఫీ చేయాలని, జలవనరుల శాఖ పరిధిలోని నీటిపారుదల ప్రాజెక్టులలో ఆధునీకరణ, మరమ్మతు పనులకు పరిపాలనా అనుమతి ఇవ్వాలని, అలాగే వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై మంత్రివర్గం నిర్ణయాలు తీసుకుంది.

సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అనంతరం రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్.. కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు.

గుంటూరు, నెల్లూరు, కాకినాడ, విశాఖపట్నం నగరాల్లో ఎల్పీజీ వినియోగదారులను పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) వైపు మళ్లించే చర్యలు ప్రారంభం. 'పీఎన్జీ ద్వారా నిరంతర గ్యాస్ సరఫరా-అపార్ట్‌మెంట్లు, పారిశ్రామిక యూనిట్లకు కేంద్ర ప్రోత్సాహకాలు. ప్రధాన దేవాలయాల్లో కూడా పీఎన్జీ సదుపాయం కల్పించాలని ఆదేశాలు ఇస్తాం. దీపం సబ్సిడీ పథకం పీఎన్జీ వినియోగదారులకు విస్తరణ దిశగా చర్యలు. రెండు నెలలకు ఒకసారి సబ్సిడీ-రూ.2400 డీబీటీ ప్రయోజనం. పైప్‌లైన్ కనెక్షన్లకు 24 గంటల్లో అనుమతులు, అవసరమైతే ఆటోమేటిక్ సిస్టమ్. 10 లక్షల కొత్త పీఎన్జీ కనెక్షన్లు లక్ష్యంగా పెట్టుకున్నాం. నెలరోజుల్లో 1 లక్ష కనెక్షన్లు అందించే కార్యాచరణ కొనసాగుతోంది. అంగన్‌వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టౌల పంపిణీ చేస్తాం.' అని నాదెండ్ల మనోహర్ చెప్పారు.

దీపం సబ్సిడీ పథకాన్ని పీఎన్జీ సబ్ స్క్రైబర్స్‌కు కూడా వర్తించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి నాదెండ్ల చెప్పారు. దీపం పథకంలో నాలుగు నెలలకు ఒకసారి ఫ్రీ సిలెండర్ ఇస్తున్నామన్నారు. పీఎన్‌జీలో రెండు నెలలకు ఒకసారి ఆ పేమెంట్‌ను షేర్ చేస్తామని మంత్రి వెల్లడించారు.

'సోషల్ మీడియా భయాందోళనలు సృష్టిస్తోంది. ఏపీలో ఎక్కడా పెట్రోల్, గ్యాస్, డీజిల్ విషయంలో కొరత లేదు. ప్రతిరోజు 2 లక్షల 70 వేల మందికి గ్యాస్ సిలెండర్‌లు అందిస్తున్నాం. కేంద్రం ఇచ్చిన ప్రోత్సాహంతో ఇండక్షన్ స్టవ్‌లు అంగన్‌వాడీ కేంద్రాల్లో అందజేస్తున్నాం. దేశంలోనే మొదటిసారి ఏపీ ప్రభుత్వం ఈ విధానాన్ని పాలసీగా తీసుకుని అమలు చేస్తోంది.' అని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More