ఆంధ్రప్రదేశ్ : అభయారణ్యంలో శివలింగ క్షేత్రం - ఏడాదికి 2 రోజులే దర్శనానికి అనుమతి!
గుండ్ల బ్రహ్మేశ్వర స్వామి దర్శనానికి లైన్ క్లియర్ అయింది. రెండు రోజులు అటవీ మార్గంలో రాకపోకలకు అనుమతి లభించింది. నంద్యాల- మార్కాపురం జిల్లా సరిహద్దులో ఉండే ఈ ఆలయానికి దశాబ్దాల కాలం నుంచి ఎంతో పురాతనమైన ప్రాశస్యత నేపథ్యం ఉంది.
శ్రీ గుండ్ల బ్రహ్మేశ్వర స్వామి ఆలయం….. నంద్యాల- మార్కాపురం జిల్లా సరిహద్దులో ఉన్న నాగార్జునసాగర్- శ్రీశైలం పులుల అభయారణ్యంలో ఉంటుంది. ఈ అధ్యాత్మిక క్షేత్రానికి దశాబ్దాల కాలం నుంచి ఎంతో పురాతనమైన ప్రాశస్యత నేపథ్యం ఉంది. అశ్వత్థామ మహర్షి చేత ప్రతిష్టించబడిన స్వయంభూ శివలింగ క్షేత్రంగా గుండ్ల బ్రహ్మేశ్వర స్వామి క్షేత్రానికి ఎంతో విశిష్టమైన ప్రాధాన్యత, పురాతన నేపథ్యం ఉంది.

ఏడాదిలో 2 రోజులు మాత్రమే…
ఏడాదిలో కేవలం శివరాత్రి పర్వదినాల్లో అంటే రెండు రోజులు మాత్రమే భక్తులకు దర్శనం ఉంటుంది. అది కూడా అటవీశాఖ అనుమతి ఇస్తేనే వెళ్లాల్సి ఉంటుంది. ఈ ఏడాది పులుల లెక్కింపు కారణంగా అటవీశాఖ రాకపోకలకు అనుమతులు ఇవ్వలేదు. అయితే మంత్రి ఫరూక్ ప్రత్యేకంగా రాష్ట్ర అటవీశాఖ మంత్రి పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందిన ఆయన…. అధికారులకు ఆదేశాలిచ్చారు.
వెళ్లే మార్గాలు…
- దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో వెలసిన గుండ్ల బ్రహ్మేశ్వరం క్షేత్రానికి చేరుకునే మార్గాలు ఇవే.*
- నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం నారాయణపురం గ్రామం అక్కడి నుంచి ట్రాక్టర్ల సాయంతో కొండ మొక్క అనే ప్రదేశం వరకు స్థానికులు చేరవేస్తారు.అక్కడి నుంచి పది కిలోమీటర్లు నడిస్తే క్షేత్రం చేరుకోవచ్చు.*
- బండి ఆత్మకూరు మండలం నారాయణపురం నుంచి మొత్తం 22 కిలోమీటర్లు ఉంటుంది.*
- నంద్యాల- గిద్దలూరు మార్గంలో దిగువమెట్ట నుంచి జీపులు, ట్రాక్టర్లు కాలినడకన 20 కిలోమీటర్లు ప్రయాణిస్తే గుండ్ల పరమేశ్వరం చేరవచ్చు.*
- మార్కాపురం జిల్లా గిద్దలూరు తాలూకా అర్ధవీడు మండలం పాపినేని పల్లె గ్రామం నుంచి వాహనాల్లో కాలినడకన సుమారు 25 కిలోమీటర్ల ప్రయాణించి గుండ్ల బ్రహ్మేశ్వరం చేరవచ్చు.
పులుల లెక్కింపు ప్రక్రియ… రాకపోకలపై సందిగ్ధత
నాగార్జునసాగర్- శ్రీశైలం పులుల అభయారణ్యం (ఎన్. ఎస్. ఆర్. టి) లో గుండ్ల బ్రహ్మేశ్వరం ఆలయానికి మహా శివరాత్రి మినహా మిగతా రోజుల్లో మనుషులు, వాహనాల రాకపోకలకు అనుమతించరు. పులులతో పాటు ఇతర అరుదైన జంతు, పశుపక్షాదుల సంరక్షణకు ఆటంకం ఏర్పడకుండా అటవీశాఖ కట్టుదిట్టమైన చర్యలు అమలు చేయడం జరుగుతున్నది.
ఈ కారణంగానే ప్రతి సంవత్సరం కేవలం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రెండు రోజులపాటు భక్తుల రాకపోకలకు షరతులతో కూడిన అనుమతి ఇవ్వడం జరుగుతోంది. అయితే ఈ ఏడాది పులుల లెక్కింపు ప్రక్రియ కారణంగా కారణంగా గుండ్ల బ్రహ్మేశ్వరం కు భక్తులకు అనుమతి ఇవ్వడంపై సందిగ్ధత ఏర్పడింది.
పులుల లెక్కింపు ప్రక్రియ కారణంగా భక్తుల సందర్శనకు మొదట అటవీశాఖ అనుమతులు ఇవ్వలేదు. ఈ విషయంపై శివరాత్రికి క్రమం తప్పకుండా గుండ్ల బ్రహ్మేశ్వరానికి వెళ్లే భక్తులు పలువురు అమరావతికి వచ్చి మంత్రి ఫరూక్ దృష్టికి సమస్యను తెలిపారు.భక్తుల మనోభావాలకు అనుగుణంగా గుండ్ల బ్రహ్మహేశ్వర క్షేత్రానికి వెళ్లేందుకు రెండు రోజులపాటు అనుమతి ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కు రాతపూర్వక విజ్ఞప్తిని అందజేశారు.
మంత్రి ఫరూక్ విజ్ఞప్తిపై చర్యలు తీసుకోవాలని అటవీ శాఖ ఉన్నతాధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించడంతో ఈ ఏడాది నెలకొన్న సందిగ్ధత వీడింది.మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని 14,15వ తేదీల్లో జిబి యం కు వెళ్లేందుకు భక్తులకు అనుమతి ఇస్తూ అటవీశాఖ చీఫ్ కన్జర్వేటర్ డాక్టర్. పి.వి.చలపతిరావు ఉత్తర్వులు జారీ చేశారు. స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు మంత్రి ఫరూక్ కృతజ్ఞతలు తెలిపారు. అటవీశాఖ నిబంధనలకు అనుగుణంగా భక్తులు గుండ్ల బ్రహ్మేశ్వరం ఆలయాన్ని సందర్శించాలని విజ్ఞప్తి చేశారు.

E-Paper












