AP Govt Mana Mitra : మనమిత్రకి మంచి ఆదరణ - వెయ్యికిపైగా ప్రభుత్వ సేవలు, అరకోటికి పెరిగిన యూజర్లు
ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన ‘మనమిత్ర వాట్సాప్’కు మంచి ఆదరణ లభిస్తోంది. అత్యంత పారదర్శకంగా పౌరులు పొందుతున్నారు. యూజర్ల సంఖ్య అరకోటికి పెరిగింది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన మనమిత్ర, వాట్సాప్ గవర్నెన్స్ కు రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది. ప్రజలు ఇప్పుడిప్పుడే ఈ సదుపాయం ఉపయోగాలేంటో అర్థం చేసుకుంటున్నారు. వాట్సాప్ ఉపయోగించడానికి మొగ్గు చూపుతున్నారు. మనమిత్ర ఉపయోగించేవారి సంఖ్య ప్రస్తుతం అరకోటి దాటింది.

రాష్ట్రంలో ప్రజలెవ్వరూ కూడా తమ పనుల కోసం ప్రభుత్వ కార్యాలయాలు, అధికారుల చుట్టూ తిరగకుండా ప్రభుత్వాన్ని ప్రజల వద్దకే తీసుకెళ్లాలనేది ప్రభుత్వ ఉద్దేశ్యం.గత ఏడాది జనవరిలో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఏడాది కాలంలో వాట్సాప్ గవర్నెన్స్ యూజర్ల సంఖ్య రోజురోజుకీ గణణీయంగా పెరుగుతూ ప్రజాదరణ చూరగొంటోంది.
వెయ్యికిపైగా సేవలు…
మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పౌరులకు దాదాపు వెయ్యికిపైగా సేవలు కల్పించనుంది. ప్రస్తుతం 900కుపైగా సేవలు మనమిత్ర ద్వారా అందుతున్నాయి. ఈ నెలలో ఈ సేవలు వెయ్యికి దాటనున్నాయి.
ఆర్టీసీ బస్సు టికెట్ల రిజర్వేషన్లు మొదలు, మున్సిపాల్టీ, పంచాయతీల్లో ఆస్తిపన్ను, నీటి పన్నుల చెల్లింపులు, కరెంటు బిల్లుల చెల్లింపులు, రెవెన్యూ, పోలీసు, పింఛన్లు, రిజిస్ట్రేషన్ సేవలు మనమిత్రలో పొందవచ్చు.
తల్లికి వందనం, సర్టిఫికెట్లు, ఓబీసీ, ఇన్కమ్, ప్రభుత్వం నిర్వహించే అన్ని ప్రవేశ పరీక్షలకు సంబంధించి హాల్ టికెట్లు, ఫలితాలు కూడా ఇందులోనే డౌన్ లోడు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునే సదుపాయం ఇలా పలు రకాల సేవలను మనమిత్ర ద్వారా పౌరులకు అందిస్తోంది.
మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా రెవెన్యూ సేవలు మరింత సులభతరం చేశారు. ప్రజలు తమ ఆస్తులకు సంబంధించిన వివరాలన్నీ తమ సెల్ఫోన్ లోని వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా తెలుసుకోవచ్చు. 1-బీ అడంగళ్ కాపీని ఇందులోనే డౌన్ లోడు చేసుకోవచ్చు.
పట్టాదారుపాసుపుస్తకం ఈ-కాపీని కూడా ఇందులో డౌన్లోడ్ చేసుకోవచ్చు. తమ ఆస్థులకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.రిజిస్ట్రేషన్లకు సంబంధించి ఈసీ (ఎన్క్యుంబరెన్సు సర్టిఫికెట్)కూడా ఇందులోంచి డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు ఉంది.
- తిరుమల శ్రీవారి ఆలయంలో వేంకటేశ్వరస్వామికి చేసే ఆర్జిత సేవల టికెట్లు, దర్శనాల టికెట్ల బుకింగ్ మొదలు, కానుకలు కూడా ఈ-హుండీకి పంపొచ్చు.
- మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌరులందరూ సులభంగా సేవలు పొందడానికి వారి యాండ్రాయిడ్ మొబైల్ ఫోనులో 9552300009 నెంబరు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి.
- వాట్సాప్లో ఈ నెంబరుకు హాయ్ అని మెసేజే పంపితే చాలు, అందులో ప్రభుత్వం పౌరులకు అందిస్తున్న సేవలన్నీ కనిపిస్తాయి. పౌరులు తమకు ఎలాంటి సేవలు కావాలో అందులో తెలుసుకుని చాలా సులభంగా ఇట్టే క్షణాల్లో ఆ సేవలను పొందవచ్చు.
- మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ఇంగ్లీషు, తెలుగు భాషల్లోనూ పనిచేస్తుంది. అందువల్ల పౌరులు దీన్ని ఉపయోగించడం ఎంతో తేలిక. పైగా సేవలు కూడా ఎంతో సులభంగా పనిచేస్తాయి.
- వాట్సాప్లో టైపు చేయడం తెలీని వారు తమకు ఏం కావాలో వాయిస్ ద్వారా చెప్పడం ద్వారా కూడా ఆ సేవలు పొందవచ్చు. ఆ విధంగా పనిచేసేలా మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ను ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సు) ఆధారితంగా పనిచేస్తుంది.
- మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ను రాష్ట్రంలో వినియోగించేవారి సంఖ్య 50 లక్షలకు చేరుకుంది. వీరు పలుమార్లు ప్రభుత్వ సేవలను వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పొందారు. ఈ ప్రకారం ఈ యూజర్ల అందుకున్న సేవలు, చేసిన లావాదేవీలు 2.50 కోట్లకుపైగా ఉన్నాయి. వీరంతా కూడా ఎలాంటి అంతరాయాలు లేకుండా క్షణాల్లో సేవలను వాట్సాప్ గవర్నెన్సప్ ద్వారా పొందారు.

E-Paper












