APCPDCL Ganesh Pandal Electricity Permission : వినాయక చవితి ఉత్సవాల నిర్వహణపై ఏపీసీపీడీసీఎల్ కీలక ప్రకటన విడుదల చేసింది. ఈ పండుగ సీజన్లో ఏర్పాటు చేసే గణేష్ మండపాల్లో విద్యుత్ భద్రతకే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని ఏపీసీపీడీసీఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) పి. పుల్లారెడ్డి స్పష్టం చేశారు. భక్తిశ్రద్ధలతో పాటు భద్రతా ప్రమాణాలు పాటిస్తూ ఉత్సవాలను సురక్షితంగా జరుపుకోవాలని ఆయన నిర్వాహకులకు పిలుపునిచ్చారు.

మండపాల్లో లైటింగ్, ఇతర విద్యుత్ అలంకరణల కోసం అనధికారికంగా విద్యుత్ వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉత్సవాల సందర్భంగా మండపాలకు తాత్కాలిక విద్యుత్ సరఫరా అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని తెలిపారు.
తాత్కాలిక విద్యుత్ కనెక్షన్ ఛార్జీలు:
ఈ నెల 26వ తేదీ వరకు గణేష్ మండపాలకు తాత్కాలిక విద్యుత్ సరఫరా కనెక్షన్లు ఇస్తారు. దీనికి సంబంధించి నిర్దేశించిన రుసుముల వివరాలు ఇలా ఉన్నాయి…
- 500 వాట్ల లోడ్ వరకు: రూ.1,000
- 1000 వాట్ల లోడ్ వరకు: రూ.2,250
- దరఖాస్తు రుసుము: రూ.100
కనెక్షన్ కావాల్సిన నిర్వాహకులు స్వర్ణ గ్రామ లేదా వార్డు సచివాలయాలు, మీ-సేవా కేంద్రాలు లేదా అధికారిక వెబ్సైట్ (apcpdcl.in) ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సీఎండీ వెల్లడించారు. అనుమతి లేకుండా నేరుగా వైర్లకు కొక్కేలు వేసి అక్రమంగా విద్యుత్ వాడితే చట్టపరమైన కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
రూల్స్ ఇవే….
- విద్యుత్ స్తంభాలు, ఓవర్ హెడ్ హైటెన్షన్ లైన్లకు తగినంత దూరంలో మాత్రమే మండపాలను నిర్మించాలి. మండపాల పైభాగం నుంచి విద్యుత్ వైర్లు వెళ్లకుండా చూసుకోవడం అత్యంత ముఖ్యం.
- వైరింగ్ పనులను తప్పనిసరిగా సర్టిఫైడ్ ఎలక్ట్రీషియన్లతోనే చేయించాలి. ఐఎస్ఐ మార్కు కలిగిన నాణ్యమైన వైర్లు, స్విచ్లు, ప్లగ్లు మాత్రమే వాడాలి.
- వర్షాకాలం అయినందున విద్యుత్ వైర్లు, స్విచ్ బోర్డులు తడవకుండా షెడ్లు ఏర్పాటు చేయాలి. తడిసిన బోర్డులను లేదా విద్యుత్ పరికరాలను చేతులతో తాకకూడదు.
- మండపాల వద్ద లైటింగ్, మైక్ సెట్లు ఏర్పాటు చేసేటప్పుడు ప్రజలకు, భక్తులకు అలాగే అంబులెన్స్ వంటి అత్యవసర వాహనాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలి.
ఏదైనా ప్రాంతంలో విద్యుత్ వైర్లు తెగిపడినా లేదా వేలాడుతూ ప్రమాదకరంగా కనిపించినా వెంటనే దూరంగా జరిగి, విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించాలి. సేవలు, ఫిర్యాదుల కోసం 1912 టోల్ ఫ్రీ నెంబర్కు సంప్రదించాలని సీఎండీ పి. పుల్లారెడ్డి సూచించారు.
{{/usCountry}}ఏదైనా ప్రాంతంలో విద్యుత్ వైర్లు తెగిపడినా లేదా వేలాడుతూ ప్రమాదకరంగా కనిపించినా వెంటనే దూరంగా జరిగి, విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించాలి. సేవలు, ఫిర్యాదుల కోసం 1912 టోల్ ఫ్రీ నెంబర్కు సంప్రదించాలని సీఎండీ పి. పుల్లారెడ్డి సూచించారు.
{{/usCountry}}