AP Gurukul Admissions 2026 : మే 26, 27 తేదీల్లో ఏపీ గురుకులాల్లో కౌన్సెలింగ్.. సమయం, తీసుకెళ్లాల్సిన పత్రాలు!

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశాలకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. సీట్లు ఖాళీగా ఉన్న కొన్ని ప్రాంతాల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు.

Published on: May 25, 2026, 19:56:41 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకుల విద్యాలయాలలో ఐదో తరగతి అడ్మిషన్ల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు, తల్లిదండ్రులకు కీలక అప్‌డేట్ వచ్చేసింది. ఉమ్మడి విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల పరిధిలోని గురుకుల పాఠశాలల్లో మిగిలిపోయిన 5వ తరగతి సీట్ల భర్తీకి మే 26, 27 తేదీల్లో ప్రత్యేక కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లాల సమన్వయ అధికారిణి ఎం.మాణిక్యం ఒక ప్రకటనలో వివరాలను వెల్లడించారు.

గురుకులాల్లో ప్రవేశాలు
గురుకులాల్లో ప్రవేశాలు

ఈ ఏడాది మార్చి నెలలో నిర్వహించిన ఏపీ గురుకుల ప్రవేశ పరీక్ష (APBRAGCET 2026) ఫలితాల ఆధారంగా ఇప్పటికే తొలి విడత అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయింది. మొదటి విడతలో సీట్లు పొంది జాయిన్ అవ్వని వారి వల్ల, అలాగే వివిధ కారణాల వల్ల ఖాళీగా ఉన్న మిగిలిన సీట్లను భర్తీ చేసేందుకు ఈ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. అర్హత సాధించిన విద్యార్థులకు మెరిట్‌ ప్రాతిపదికన, జిల్లాలో వారు కోరుకున్న గురుకుల పాఠశాలలో ప్రవేశం పొందేందుకు ఈ విడతలో అవకాశం కల్పిస్తారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకుల పాఠశాల, నెల్లిమర్ల (విజయనగరం జిల్లా)లో కౌన్సెలింగ్ ఉంటుంది.

కౌన్సెలింగ్ షెడ్యూల్

మే 26 మంగళవారం కేవలం బాలికలకు మాత్రమే కౌన్సెలింగ్ ఉంటుంది. (సమయం: ఉదయం 9:00 గంటల నుంచి మధ్యాహ్నం 3:00 గంటల వరకు).

మే 27 బుధవారం కేవలం బాలురకు మాత్రమే కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. (సమయం: ఉదయం 9:00 గంటల నుంచి మధ్యాహ్నం 3:00 గంటల వరకు).

కౌన్సెలింగ్‌కు తీసుకెళ్లాల్సిన పత్రాలు

కౌన్సెలింగ్ కేంద్రానికి వచ్చే విద్యార్థులు తమ వెంట ఈ క్రింది సర్టిఫికేట్లను తప్పనిసరిగా (అసలు పత్రాలు + జిరాక్స్ కాపీలతో) తీసుకురావాలి.

  • APBRAGCET 2026 ర్యాంక్ కార్డ్ (Rank Card)
  • విద్యార్థి ఆధార్ కార్డ్ (Aadhaar Card)
  • రేషన్ కార్డ్ / ఆహార భద్రత కార్డు (ఫీజ్ మినహాయింపు/ఆదాయ ధృవీకరణ కోసం)
  • కులాధృవీకరణ పత్రం (వర్తించే వారికి)
  • 3వ, 4వ తరగతుల స్టడీ సర్టిఫికేట్లు / టి.సి (TC)
  • పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు (3-4)

గురుకుల పాఠశాలల్లో ఉచిత వసతి, నాణ్యమైన ఇంగ్లీష్ మీడియం విద్యతో పాటు ఉచిత భోజన సౌకర్యం కల్పిస్తారు. కాబట్టి అర్హులైన విద్యార్థులు ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ ప్రవేశాలకు సంబంధించి తల్లిదండ్రులకు ఎలాంటి సందేహాలు ఉన్నా, వారు తమ సమీపంలోని అంబేడ్కర్‌ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ను నేరుగా కలిసి వివరాలు తెలుసుకోవచ్చు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More