సగం కాలిన పాపడాల ప్యాకెట్ ఇచ్చిన క్లూ.. వీడిన మూగ వ్యక్తి మర్డర్ మిస్టరీ.. కానీ మరో ట్విస్ట్!

స్నేహితులే ఓ వ్యక్తిని నమ్మించి హత్య చేశాడు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే.. నేరస్థులు, బాధితుడు మూగవారే. పాపడాల ప్యాకెట్ ఇచ్చిన క్లూతో ఈ కేసును పోలీసులు ఛేదించారు.

Published on: Jul 9, 2026, 13:35:47 IST
By , Anantapur
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మానవత్వానికే మచ్చ తెచ్చేలా, నమ్మిన స్నేహితులే ఒక వ్యక్తిని డబ్బు కోసం చంపేశారు. ఈ ఘోరమైన ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. శాస్త్రీయ ఆధారాలు, సాంకేతిక పరిజ్ఞానం, అంతర్రాష్ట్ర పోలీసుల సమన్వయంతో అనంతపురం జిల్లా డి.హిరేహాళ్ మండలం పులకుర్తి గ్రామంలో జరిగిన ఈ కిరాతక హత్య కేసును జిల్లా పోలీసులు ఛేదించారు.

అనంతపురం క్రైమ్ న్యూస్
అనంతపురం క్రైమ్ న్యూస్

జూన్ 23న పులకుర్తి సమీపంలోని వ్యవసాయ పొలాల్లో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం పూర్తిగా కాలిపోయిన స్థితిలో కనిపించింది. అసలు ఎలాంటి సాక్ష్యాలు కూడా ఈ కేసులో పోలీసులకు కనిపించలేదు. ఈ కేసును సవాల్‌గా తీసుకున్న అనంతపురం ఎస్పీ పి.జగదీష్ ఆదేశాల మేరకు రాయదుర్గం రూరల్ ఇన్‌స్పెక్టర్ వెంకటరమణ నేతృత్వంలో ప్రత్యేక బృందం రంగంలోకి దిగింది.

ఘటనా స్థలంలో ఫోరెన్సిక్ నిపుణుల బృందం ఆధారాలు సేకరించేందుకు వెళ్లింది. కానీ అక్కడ దొరికింది మాత్రం కేవలం ఒక సగం కాలిన పాపడాల ప్యాకెట్. ఇదే ఈ కేసులో కీలక మలుపుగా మారింది. ఆ ప్యాకెట్ కోడ్‌ ఆధారంగా చెన్నైలోని తయారీదారుడిని పట్టుకున్నారు. అక్కడి నుండి బళ్లారిలోని పంపిణీ నెట్‌వర్క్‌ను పోలీసులు ట్రాక్ చేశారు. వాటిని ఎక్కడకెక్కడకు పంపేవారో ఆరా తీశారు. చివరకు ఆ బాధితుడు బళ్లారికి చెందిన గురూరాజ్ రావు అని గుర్తించారు. గురూరాజ్ మాటలు రాని, వినికిడి లోపం ఉన్న వ్యక్తి. అతడు పాపడాలు అమ్ముకుంటూ, గుడిలో పూజారిగా బతుకును సాగిస్తున్నాడు.

గురూరాజ్ కనిపించడం లేదని పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత కూడా అతడి ఏటీఎం కార్డు ద్వారా వివిధ ప్రాంతాల్లో నగదు విత్‌డ్రా అయినట్లు కనిపెట్టారు. ఆయా ఏటీఎంల సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా బళ్లారికి చెందిన బసవరాజు, కొట్రేష్ అనే ఇద్దరు వ్యక్తులు నిందితులుగా తేలారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఈ ఇద్దరు నిందితులు కూడా మూగ, చెవుడు వారే.

మృతుడి వద్ద వ్యాపారం చేసిన సొమ్ము ఉందనే ఆశతో నమ్మిన స్నేహితుడినే చంపేశారు. గురూరాజ్‌కు మద్యం తాగించి, కళ్లల్లో కారం కొట్టి, తాడుతో గొంతు నులిమి హత్య చేశారు. ఆ తర్వాత శవాన్ని గుర్తుపట్టకుండా పెట్రోల్ పోసి నిప్పంటించారు. బుధవారం రోజున ఓబుళాపురం క్రాస్ వద్ద నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సైన్ లాంగ్వేజ్ (సంజ్ఞల) నిపుణుల సహాయంతో విచారించారు. నిందితులు నేరాన్ని అంగీకరించారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More