దివ్యాంగులకు 7 వరాలు ప్రకటించిన సీఎం.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం!

ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్టుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. అమరావతిలో దివ్యాంగ్ భవన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

Published on: Dec 03, 2025 9:24 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకుని.. విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దివ్యాంగుల కోసం ఏడు వరాలు ప్రకటించారు. వారు ఏ రంగంలోనూ వెనకబడి ఉండకూడదని చెప్పారు. అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా ఉంటుందని, ప్రోత్సాహం అందిస్తామని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. కొత్తగా ప్రకటించిన 7 వరాలు దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపుతాయని చెప్పారు.

సీఎం చంద్రబాబు(ఫైల్ ఫొటో)
సీఎం చంద్రబాబు(ఫైల్ ఫొటో)

దివ్యాంగులకు ప్రకటించిన ఏడు వరాల్లో ఏపీఎస్ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఉంది. దీని ద్వారా దివ్యాంగులు రాకపోకల ద్వారా అయ్యే ఖర్చు తగ్గనుంది. స్థానిక సంస్థలు, కార్పొరేషన్లు, పబ్లిక్ సెక్టార్ ఎంటర్ ప్రైజెస్‌లో కనీసం ఒక దివ్యాంగ ప్రతినిధిని నామినేట్ చేస్తామని సీఎం ఈ సందర్భంగా వెల్లడించారు. అంతేకాదు.. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు ఆర్థిక సబ్సిడీ అందించనట్టుగానే దివ్యాంగులకు మళ్లీ ప్రారంభిస్తామని చెప్పారు.

'ప్రభుత్వ హౌసింగ్ ప్రాజెక్టుల్లో దివ్యాంగులకు గ్రౌండ్ ఫ్లోర్ కేటాయిస్తాం. రాష్ట్రస్థాయిలో అమరావతిలో దివ్యాంగ్ భవన్ ఏర్పాటు చేస్తాం. బాపట్లలో ఉన్న ప్రభుత్వ పాఠశాల, జూనియర్ కాలేజీతోపాటు వినికిడి లోపం ఉన్న విద్యార్థుల కోసం ప్రత్యేక డిగ్రీ కాలేజీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం. రెసిడెన్షియల్ స్కూల్స్, కాలేజీలు, హాస్టల్స్‌లో చదివే దివ్యాంగ విద్యార్థులకు అక్కడే సామాజిక భద్రతా పెన్షన్ పంపిణీ చేస్తాం. శాప్ ద్వారా అన్ని క్రీడా కార్యక్రమాలు, టాలెండ్ డెవలప్‌మెంట్ స్కీములు దివ్యాంగులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటాం.' అని చంద్రబాబు ప్రకటించారు.

దివ్యాంగులకు కేవలం దయతో చూసే విధానం మారాలని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా చెప్పారు. సమాజంలో భాగస్వాములుగా, సమాన పౌరులుగా చూడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. వైకల్యం అనేది బలహీనత కాదన్నారు. అవకాశాలు కల్పిస్తే ఎక్కడైనా విజయం సాధిస్తారన్నారు. దివ్యాంగుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మరోసారి చంద్రబాబు స్పష్టం చేశారు.

News/Andhra Pradesh/దివ్యాంగులకు 7 వరాలు ప్రకటించిన సీఎం.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం!
News/Andhra Pradesh/దివ్యాంగులకు 7 వరాలు ప్రకటించిన సీఎం.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం!