వేట్లపాలెం ఘటన : 22కి చేరిన మృతుల సంఖ్య - మరో ఐదుగురి పరిస్థితి సీరియస్...!
కాకినాడ జిల్లాలోని వేట్లపాలెం పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 22కి చేరింది. మరో ఐదుగురి పరిస్థితి విషమంగానే ఉందని జిల్లా అధికారులు తెలిపారు.
కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం పేలుడు ఘటనలో మృతుల సంఖ్య పెరిగుతోంది.ఆదివారం రాత్రి 9 గంటల తర్వాత మరోకరు ప్రాణం కోల్పోయారు. దీంతో ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 22కి చేరింది.

మరో ఐదుగురి పరిస్థితి సీరియస్….
క్రాకర్ యూనిట్ పేలుడులో మృతుల సంఖ్య 22కు చేరినట్లు జిల్లా అధికారి ఒకరు తెలిపారు. ఆదివారం రాత్రి 9 గంటలకు ఒకరు మృతి చెందారని… మృతుల సంఖ్య 22కు పెరిగిందని కాకినాడ జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి జే నరసింహా నాయక్ తెలిపారు. ప్రస్తుతం… నాలుగు నుంచి ఐదుగురి పరిస్థితి విషయంగానే ఉందని పేర్కొన్నారు. వీటిలో కొందరికి 90 శాతం వరకు కాలిన గాయాలతో ఉన్నాయని వివరించారు.
ప్రస్తుతం క్షతగాత్రులకు కాకినాడ జీజీహెచ్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో…. మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది.
మరోవైపు మృతుల కుటుంబాలకు రూ. 20 లక్షల చొప్పున పరిహారం ఇస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన చెక్కులను కూడా అధికారులు బాధిత కుటుంబాలకు అందించారు. సామర్లకోటకు చెందిన దర్శిపాటి నాని(38), ఏడిద సంపత్ కుమార్(25), జి.మేడపాడు గ్రామానికి చెందిన గంపల మంగ(43), గంపల నాగరాజు(45), గూడపర్తికి చెందిన మందపల్లి చిన్ని(44), గొడత మహేష్(41), గొడత వీరవెంకట రమణ(48), కడింపల్లి ధనరాజు(55), పెదబ్రహ్మదేవంకి చెందిన మకర రాఘవమ్మ(55) ల కుటుంబసభ్యులకు వీటిని అందించారు.
కాకినాడ జిల్లాలోని సామర్లకోట మండలంలోని వేట్లపాలెం బాణసంచా తయారీ పరిశ్రమలో శనివారం మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో పలువురు సజీవ దహనమయ్యారు. భారీ ఎత్తున మంటలు ఎగసిపడడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించింది.
సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన ఈ పేలుడు ఘటనలో 15 మందికిపైగా కార్మికులు సజీవ దహనమయ్యారు. ప్రమాద సమయంలో 35 మంది వరకు కార్మికులు పని చేశారు. పేలుడు ధాటికి మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. మరికొందరు చికిత్స పొందుతూ చనిపోయారు. ఇంకా కొందరి పరిస్థితి విషమంగా ఉంది.

E-Paper












