విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తులకు జై భవానీ అంటూ పలకరింపు.. కొత్త మార్పులు, నిబంధనలు!

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ ఆలయానికి వచ్చే భక్తుల అనుభవాన్ని మెరుగుపరిచే దిశగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఆలయ సిబ్బంది భక్తులను జై భవానీ అంటూ స్వాగతం పలుకుతారు.

Published on: Jul 31, 2026, 14:04:48 IST
By , Vijayawada
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకునే భక్తులకు మరింత మెరుగైన ఆధ్యాత్మిక అనుభవాన్ని అందించేందుకు ఆలయ అధికారులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా ఇకపై ఆలయ సిబ్బంది భక్తులను భక్తిపూర్వక నమస్కారంతో పాటు “జై భవానీ” అంటూ పలకరించాలని దేవస్థానం కార్యనిర్వహణాధికారి (ఈఓ) వి.కె.సీనా నాయక్ అధికారికంగా ప్రకటించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పలు మౌలిక వసతుల మెరుగుదలపై కూడా ఆయన దృష్టి సారించారు.

విజయవాడ దుర్మమ్మ గుడి
విజయవాడ దుర్మమ్మ గుడి

ఆలయ ప్రాంగణంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించిన ఈఓ సీనా నాయక్.. భక్తుల పట్ల సిబ్బంది ఎప్పుడూ అత్యంత మర్యాదగా, సహనంతో, గౌరవంగా ప్రవర్తించాలని స్పష్టం చేశారు. భద్రతా సిబ్బందితో పాటు ఇతర ఉద్యోగులు కూడా విచ్చేసే యాత్రికులను తప్పనిసరిగా "జై భవానీ" అని సంబోధించాలని ఆదేశించారు. ఈ సరికొత్త ఆచారం ఆలయ పవిత్ర వాతావరణాన్ని మరింత పటిష్టం చేస్తుందని, భక్తులకు గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిని ఇస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ తనిఖీల సమయంలో, ఆలయాకి మొబైల్ ఫోన్లు తీసుకువెళ్లడంపై ఉన్న నిషేధం క్షేత్రస్థాయిలో కఠినంగా అమలవుతున్నట్లు ఈఓ గుర్తించారు. దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన.. ఆలయ పవిత్రతను కాపాడేందుకు మొబైల్ ఫోన్ల నిషేధాన్ని వంద శాతం కచ్చితంగా అమలు చేయాలని భద్రతా సిబ్బందిని ఆదేశించారు. వివిధ పూజలు, సేవల్లో పాల్గొనే భక్తులకు కల్పిస్తున్న వసతులను ఈఓ నిశితంగా పరిశీలించారు. రద్దీ సమయాల్లో పూజా మండపాలకు చేరుకోవడానికి భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు ఆయన గ్రహించారు. దీనికి తక్షణ పరిష్కారంగా భక్తుల రాకపోకలను క్రమబద్ధీకరించడానికి తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

పూజల్లో పాల్గొనే భక్తులు ఇకపై ప్రధాన ఆలయం గుండా వెళ్లాల్సిన అవసరం లేదు. దీనికి బదులుగా లక్ష్మీ గణపతి ఆలయం నుండి సుబ్రహ్మణ్య స్వామి ఆలయం మీదుగా పూజా వేదికలకు నేరుగా వెళ్లేందుకు ప్రత్యేక క్యూలైన్‌ను ఏర్పాటు చేయనున్నారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సులభంగా ఆలయంలోకి ప్రవేశించడానికి, బయటకు వెళ్లడానికి వీలుగా కొత్త రాంప్‌ను నిర్మించాలని, నిష్క్రమణ మార్గాన్ని విస్తరించాలని సీనా నాయక్ అధికారులను ఆదేశించారు. ఈ మార్పుల ద్వారా రద్దీ భారీగా తగ్గి, అర్చనలు తదితర పూజా కార్యక్రమాల్లో పాల్గొనే భక్తులకు రాకపోకలు మరింత సులభమవుతాయని భావిస్తున్నారు.

భక్తుల రద్దీని నియంత్రించేందుకు తీసుకుంటున్న తాజా చర్యలు భవిష్యత్తులో ఇంద్రకీలాద్రిపై వచ్చే యాత్రికులకు ఎంతో ఊరటనిస్తాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ తనిఖీ కార్యక్రమంలో ఈఓ వెంట సహాయ కార్యనిర్వహణాధికారి రమేష్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రామ, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అశోక్ కుమార్, స్థానాచార్య శివప్రసాద్ శర్మ తదితర ఆలయ అధికారులు పాల్గొన్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More