AP TG Weather : తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం - భానుడి భగభగలు, మరోవైపు ఈదురుగాలులతో కూడిన వర్షాలు!

AP Telangana Weather Reports : తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఓవైపు భానుడి భగభగలు ఉండగా…. మరోవైపు కొన్నిచోట్ల వర్షాలు పడుతున్నాయి. మరో మూడు నాలుగు రోజులు ఇదే మాదిరి పరిస్థితులు ఉండే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది.

Published on: May 25, 2026, 09:24:06 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

AP Telangana Weather Reports : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం దాటితే చాలు… భానుడి భగభగలతో జనం అల్లాడిపోతున్నారు. మధ్యాహ్నం సమయంలో బయటికి వెళ్లే పరిస్థితులు ఉండటం లేదు. గడిచిన వారం రోజులుగా ఉష్ణోగ్రతలు మరింత పెరగగా… మరో మూడు నాలుగు రోజులు కూడా ఇదే మాదిరి పరిస్థితులు ఉండే అవకాశం ఉంది.

ఐఎండీ వెదర్ రిపోర్ట్
ఐఎండీ వెదర్ రిపోర్ట్

ఓవైపు ఎండల తీవ్రత కొనసాగుతుండగా…. మరోవైపు వర్షాలు కూడా పడుతున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. దీంతో పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ అయ్యాయి.

ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ బులెటిన్ ప్రకారం…. ఇవాళ(మే 25) రాష్ట్రవ్యాప్తంగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా కోస్తాంధ్ర, రాయలసీమ పరిసర ప్రాంతాల్లో ఎండల తీవ్రత అత్యంత ప్రమాదకర స్థాయికి చేరనుంది.

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 29 మండలాల్లో తీవ్ర వడగాల్పులు (Severe Heat Wave) వీచే ప్రమాదం ఉంది. మరో 166 మండలాల్లో వడగాల్పులు (Heat Wave) జనాలను ఉక్కిరిబిక్కిరి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇవాళ్టి అంచనాలు :

  • 45°C నుంచి 47°C వరకు (తీవ్ర ఎండల ప్రభావం): ఈ ప్రాంతాల్లో ఎండల తీవ్రత అత్యధికంగా ఉంటుంది. ప్రజలు పగటిపూట బయటకు రావడం ప్రాణాంతకంగా మారవచ్చు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలతో పాటు ఏలూరు, ఎన్టీఆర్ (విజయవాడ), కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలు మరియు పోలవరం పరిసర ప్రాంతాలు.
  • 43°C నుంచి 45°C వరకు: విజయనగరం, పార్వతీపురం మన్యం, కాకినాడ, నెల్లూరు మరియు మార్కాపురం పరిసర ప్రాంతాలు.
  • 40°C నుంచి 43°C వరకు: శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలతో పాటు రాయలసీమ వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలు.

ద్రోణి ప్రభావంతో ఏపీలోని కొన్ని ప్రాంతాలకు ఎండల నుంచి తాత్కాలిక ఉపశమనం లభించనుంది. ప్రకాశం, మార్కాపురం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, పోలవరం పరిసర ప్రాంతాలు మరియు మిగిలిన రాయలసీమ జిల్లాల్లోనూ పిడుగులతో కూడిన తేలికపాటి వానలు పడొచ్చని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.

తెలంగాణ వెదర్ రిపోర్ట్ :

తెలంగాణ రాష్ట్రంలోనూ వాతావరణం శరవేగంగా మారుతోంది. ఒకవైపు ఎండ తీవ్రత, వడగాల్పులు జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే.. మరోవైపు అకస్మాత్తుగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పలకరిస్తున్నాయి. రాబోయే ఐదు రోజుల పాటు రాష్ట్రంలో ఇదే విధమైన మిశ్రమ వాతావరణం కొనసాగుతుందని హైదరాబాద్ బేగంపేటలోని వాతావరణ కేంద్రం ప్రత్యేక బులెటిన్‌లో వెల్లడించింది.

  • రాబోయే మూడు రోజుల పాటు గరిష్ట ఉష్ణోగ్రతల్లో ఎలాంటి పెద్ద మార్పులు ఉండవని, ఆ తర్వాత నాలుగు రోజుల్లో ఉష్ణోగ్రతలు సుమారు 2 నుండి 3 డిగ్రీల మేర క్రమంగా తగ్గుముఖం పడతాయని అంచనా వేసింది.
  • మే 25, 26 తేదీల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తీవ్రమైన వడగాల్పులు (Heat Waves) వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
  • వడగాల్పుల ప్రభావం చూపే జిల్లాలు: జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉంది.
  • మే 26 తర్వాత కూడా భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది.
  • పగటి ఎండలే కాకుండా రాత్రి వేళల్లోనూ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతూ 'వేడి రాత్రులు' జనాలను ఇబ్బంది పెట్టనున్నాయి. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో రాత్రి పూట కూడా వేడి వాతావరణం ఉంటుందని అధికారులు తెలిపారు.

ఎండలు దంచికొడుతున్నప్పటికీ.. రాష్ట్రంలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ముఖ్యంగా మే 25 నుంచి మే 30 వరకు ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

  • మే 25 - 26 : వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడవచ్చు.
  • మే 26 - 27 : హైదరాబాద్, మేడ్చల్-మల్కాజ్‌గిరి, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, జనగాం, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి సహా ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ మరియు మహబూబ్ నగర్ జిల్లాల్లోని దాదాపు అన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయి.
  • మే 27 - 28: ఉత్తర తెలంగాణ వైపు వర్షాలు విస్తరిస్తాయి. నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మెదక్, కామారెడ్డి జిల్లాలతో పాటు పైన పేర్కొన్న దక్షిణ, మధ్య తెలంగాణ జిల్లాల్లో వానలు పడే అవకాశం ఉంది.
  • మే 28 - 30: రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, బలమైన గాలులు వీచే అవకాశం ఉంది.
  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More