తెలంగాణలో ఎండల తీవ్రత : వడదెబ్బకు 16 మంది మృత్యువాత - హీట్ వేవ్పై సర్కార్ అలర్ట్..!
Telangana Heat Wave Alert : వడగాల్పుల కారణంగా రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో ఇప్పటివరకు 16 మంది మృత్యువాత పడ్డారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం…. వడగాల్పులపై తీవ్ర అప్రమత్తత ప్రకటించింది.
Telangana Heat Wave Alert : తెలంగాణ వ్యాప్తంగా ఎండల తీవ్రత అసాధారణ స్థాయికి చేరుకుంది. ఆకాశం నుంచి నిప్పుల వర్షం కురుస్తున్నట్లుగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో రాష్ట్రంలో ఉక్కపోత, తీవ్ర వడగాల్పులు (హీట్ వేవ్) ప్రజలను అతలాకుతలం చేస్తున్నాయి.

ఈ భయంకరమైన వడగాల్పుల కారణంగా రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో ఇప్పటివరకు 16 మంది మృత్యువాత పడ్డారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వడగాల్పులపై తీవ్ర అప్రమత్తత ప్రకటించింది. ప్రజల ప్రాణ రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది.
రాష్ట్రంలో నెలకొన్న ఈ తీవ్రస్థాయి ఉష్ణోగ్రతలు, హీట్ వేవ్ పరిస్థితులపై శనివారం నాడు సచివాలయంలో రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించారు.
రాష్ట్రవ్యాప్తంగా హీట్ వేవ్ పరిస్థితులపై జిల్లాల కలెక్టర్లు పంపిన అధికారిక నివేదికలను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ సమావేశంలో నిశితంగా పరిశీలించారు. వడదెబ్బ కారణంగా ఏడు జిల్లాల్లో 16 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
- జయశంకర్ భూపాలపల్లి జిల్లా: అత్యధికంగా నలుగురు (4) మృతి చెందారు.
- వరంగల్ అర్బన్ జిల్లా: ముగ్గురు (3) చనిపోయారు.
- కరీంనగర్ జిల్లా: ముగ్గురు (3) ప్రాణాలు కోల్పోయారు.
- నిజామాబాద్ జిల్లా: ముగ్గురు (3) మరణించారు.
- జోగులాంబ గద్వాల్ జిల్లా: ఒకరు (1) మృతి చెందారు.
- రంగారెడ్డి జిల్లా: ఒకరు .
- సూర్యాపేట జిల్లా: ఒకరు
రూ. 4 లక్షల పరిహారం - మంత్రి పొంగులేటి ఆదేశాలు
వడదెబ్బ మృతుల వివరాలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు వడదెబ్బతో మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ. 4 లక్షల చొప్పున ఆర్థిక నష్టపరిహారం అందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించిన సహాయక ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి బాధితులకు తక్షణమే అందించాలని స్పష్టం చేశారు.
ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన తీవ్రస్థాయి ఎల్నినో (El Nino) ప్రభావం వల్లనే రాష్ట్రంలో వడగాల్పుల తీవ్రత ఈ స్థాయిలో పెరిగిందని వాతావరణ నిపుణులు వివరిస్తున్నారు. రాబోయే మూడు రోజుల్లో ఎండల తీవ్రత, వడగాల్పుల ప్రభావం మరింత పెరగనుందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు అదనపు అప్రమత్తతతో వ్యవహరించాలని… ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తక్షణ రక్షణ చర్యలు చేపట్టాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సూచించారు.
10 జిల్లాలకు హెచ్చరికలు:
వాతావరణ శాఖ తాజా బులెటిన్ ప్రకారం ఈనెల 26వ తేదీ వరకు కింది జిల్లాల్లో తీవ్రమైన ఉష్ణోగ్రతలు, వడగాల్పులు కొనసాగే అవకాశం ఉంది:
- కరీంనగర్
- పెద్దపల్లి
- జయశంకర్ భూపాలపల్లి
- ములుగు
- ఖమ్మం
- నల్గొండ
- సూర్యాపేట
- మహబూబ్నగర్
- హైదరాబాద్
- రంగారెడ్డి
పది జిల్లాల కలెక్టర్లు వ్యక్తిగతంగా హీట్ వేవ్ పరిస్థితులను పర్యవేక్షించాలని, మండలాధికారుల నుంచి గ్రామ సిబ్బంది వరకు అందరినీ అలర్ట్ చేయాలని మంత్రి ఆదేశించారు.
తీవ్రమైన ఎండల నేపథ్యంలో ప్రభుత్వం మరికొన్ని చర్యలు తీసుకుంటోంది. బస్ స్టాండ్లు, మార్కెట్లు, ప్రధాన రహదారులు, లేబర్ అడ్డాలు, ప్రజల రాకపోకలు ఎక్కువగా ఉండే చోట్ల చల్లని తాగునీరు, మజ్జిగ మరియు ఓఆర్ఎస్ (ORS) ప్యాకెట్లను అందుబాటులో ఉంచుతున్నారు. ఎండదెబ్బ లక్షణాలు (హీట్ స్ట్రోక్) కనిపించిన వెంటనే బాధితులకు తక్షణ చికిత్స అందించేలా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రులలో ప్రత్యేక బెడ్లు, మందులను సిద్ధం చేశారు.
మనుషులతో పాటు జీవరాశుల సంరక్షణ కూడా మన బాధ్యతేనని, గ్రామాలు, పట్టణాల్లో నీటి తొట్టెలు, మట్టి కుండల ద్వారా పక్షులు, జంతువులకు తాగునీటి సదుపాయం ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు.
తీవ్రమైన ఎండల నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని… ప్రభుత్వ సూచనలను తప్పనిసరిగా పాటించాలని మంత్రి కోరారు. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీలు, చిన్నారులు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసర పరిస్థితులు ఉంటే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు. ఉపాధి హామీ కూలీలు, వ్యవసాయ కూలీలు, నిర్మాణ రంగ కార్మికులు, రోడ్లపై పనిచేసే వారు మధ్యాహ్న సమయాల్లో పనులకు దూరంగా ఉంటూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

