ఆంధ్రప్రదేశ్‌లోని పాఠశాలల్లో డిజిటల్ మెంటల్ హెల్త్ ప్లాట్‌ఫారమ్ ప్రారంభం

విద్యార్థుల మానసిక ఆరోగ్యానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ఇందులో భాగంగా ఏపీలో 'డింపిల్' డిజిటల్ ప్లాట్‌ఫారమ్ ప్రారంభించింది.

Published on: Aug 2, 2026, 14:12:05 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భాగస్వామ్యంతో ఆస్ట్రేలియాకు చెందిన రీబౌండ్ గ్రూప్ గ్లోబల్ లిమిటెడ్, ఆస్ట్రేలియా ప్రభుత్వ సహకారంతో ఎంపిక చేసిన పాఠశాలల్లో డిజిటల్ మెంటల్ హెల్త్ ప్లాట్‌ఫారమ్(DIMPLE) పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. విజయవాడలోని పటమట జీడీఈటీ హైస్కూల్‌లో ఈ కార్యక్రమం లాంఛనంగా ప్రారంభమైంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ఈ సందర్భంగా ఉన్నత విద్యాశాఖ కమిషనర్ నారాయణ భరత్ గుప్తా మాట్లాడుతూ.. విద్యా రంగంలో వినూత్న సంస్కరణలను ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ విద్య, ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధిని ఒకే గొడుగు కిందకు తెచ్చి మానవ వనరుల అభివృద్ధి(హెచ్‌ఆర్‌డీ) శాఖను ఏర్పాటు చేశామని, దీనివల్ల విద్యా రంగంలో సమన్వయంతో కూడిన మార్పులు సాధ్యమవుతున్నాయని తెలిపారు.

రాష్ట్రంలో డిజిటల్ ఏకీకరణ, ఉపాధ్యాయుల నియామకం, వృత్తిపరమైన శిక్షణ, అభ్యాస విధానాల ఆధునీకరణ ద్వారా విద్యను బలోపేతం చేసేందుకు 'లీప్' (LEAP - Learning Excellence in Andhra Pradesh) కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై సుప్రీంకోర్టు చేసిన సూచనలకు అనుగుణంగానే 'డింపిల్' పైలట్ ప్రాజెక్ట్ చేపట్టినట్లు, దీని ఫలితాలను సమీక్షించిన తర్వాతే విస్తరణపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

ఆస్ట్రేలియా మంత్రి జూలియన్ హిల్ మాట్లాడుతూ.. విద్యార్థుల శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ఆంధ్రప్రదేశ్ కీలకమైన ముందడుగు వేసిందని ప్రశంసించారు. అకడమిక్ విజయాలతో పాటు శారీరక, మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. టెక్నాలజీ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ, సోషల్ మీడియా యువతలో ఒత్తిడిని పెంచుతోందని, ఈ నేపథ్యంలో మానసిక ఉల్లాసాన్ని పెంపొందించే డిజిటల్ సాధనాలు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.

రీబౌండ్ గ్రూప్ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టాడ్ కింగ్ మాట్లాడుతూ.. ఏళ్ల తరబడి పరిశోధనలు చేసిన తర్వాతే 'డింపిల్' ప్లాట్‌ఫారమ్‌ను రూపొందించినట్లు తెలిపారు. ఈ అప్లికేషన్ ద్వారా విద్యార్థులు తమకు అవసరమైన మానసిక ఆరోగ్య వనరులను గోప్యంగా పొందవచ్చని, అవసరమైనప్పుడు నిపుణులైన కౌన్సెలర్లను రహస్యంగా సంప్రదించవచ్చని వివరించారు. ఆంధ్రప్రదేశ్ చేపట్టిన ఈ చొరవ భారత్‌తో పాటు దక్షిణ ఆసియా ప్రాంతంలో విద్యార్థుల మానసిక ఆరోగ్యానికి ఒక రోల్ మోడల్‌గా నిలుస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More