విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలోని కొవ్వూరు రైల్వే స్టేషన్ వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో రైళ్ల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. ఈ ప్రమాదం కారణంగా ఇవాళ నడిచే పలు కీలక ఎక్స్ప్రెస్ రైళ్ల బయలుదేరే సమయాలను సవరించినట్లు (రీషెడ్యూల్) దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో పేర్కొంది. పట్టాలపై పునరుద్ధరణ పనులు శరవేగంగా జరుగుతున్నందున…. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ ట్రైన్స్ రీషెడ్యూల్…
- కాకినాడ టౌన్ – మైసూర్ ఎక్స్ప్రెస్ (రైలు నంబరు 17289) : 11.09.2026న బయలుదేరాల్సిన ఈ రైలు 300 నిమిషాలు (5 గంటలు) ఆలస్యంగా నడవనుంది. ఇది మధ్యాహ్నం 14:00 గంటలకు కాకినాడ టౌన్ నుంచి బయలుదేరుతుంది.
- విశాఖపట్నం - సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ (రైలు నంబరు 20708) : 120 నిమిషాలు (2 గంటలు) ఆలస్యంగా… అంటే ఇవాళ సాయంత్రం 16:30 గంటలకు విశాఖపట్నం నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది.
- కాకినాడ పోర్ట్ – లింగంపల్లి గౌతమి ఎక్స్ప్రెస్ (రైలు నంబరు 12737) : 120 నిమిషాలు (2 గంటలు) రీషెడ్యూల్ చేశారు. ఈ రైలు రాత్రి 21:15 గంటలకు కాకినాడ పోర్ట్ నుంచి బయలుదేరుతుంది.
- విశాఖపట్నం – చర్లపల్లి ఎక్స్ప్రెస్ (రైలు నంబరు 18527): 120 నిమిషాలు (2 గంటలు) ఆలస్యంగా, రాత్రి 19:30 గంటలకు విశాఖపట్నం నుంచి ప్రయాణం కానుంది.

పట్టాలు తప్పిన గూడ్స్ రైలు బొగీలను తొలగించి, ట్రాక్ను పునరుద్ధరించేందుకు రైల్వే ఇంజనీర్లు, సిబ్బంది ఘటనా స్థలంలో తీవ్రంగా శ్రమిస్తున్నారు. రైళ్ల సమయాల్లో మార్పులు జరిగినందున ప్రయాణికులు గమనించి… తమ ప్రయాణ ప్రణాళికలను మార్చుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
కొవ్వూరు వద్ద ఏం జరిగిందంటే..?
తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు రైల్వేస్టేషన్ సమీపంలో నాలుగో లైన్పై గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. శుక్రవారం ఉదయం ఎరువుల లోడుతో విజయవాడ వైపు వెళ్తున్న గూడ్స్ రైలు 8 బోగీలు పట్టాలు తప్పాయి. దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా విజయవాడ వైపు వెళ్లే రైళ్లన్నీ ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని రైళ్లను రీషెడ్యూల్ చేశారు.