తిరుమల : వైకుంఠ ద్వార దర్శనాలకు విస్తృత ఏర్పాట్లు – జనవరి 7 వరకు SSD టోకెన్లు రద్దు
వైకుంఠ ద్వార దర్శనాల కోసం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. ఎక్కడా కూడా ఇబ్బందులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇక భక్తుల రద్దీ దృష్ట్యా డిసెంబర్ 28 నుంచి జనవరి 7వ తేదీ వరకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ లో భక్తులకు ఇచ్చే SSD టోకెన్ల జారీని రద్దు చేసింది.
తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 30 నుంచ జనవరి 8వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించనున్నారు. ఇందుకోసం విచ్చేసే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇవాళ తిరుమలలోని శిలా తోరణం వద్ద టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఏర్పాట్లను పరరిశీలించారు. దర్శన క్యూలైన్లలను అధికారులతో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. క్యూలైన్లలో ఏర్పాటు చేసిన తాగునీటి కొళాయిలు, అన్న ప్రసాదం పంపిణీ, మరుగుదొడ్ల సౌకర్యాలను పరిశీలించి భక్తులతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు.
అనంతరం అదనపు ఈవో మీడియాతో మాట్లాడుతూ…. వైకుంఠ ద్వార దర్శనాలు పురస్కరించుకుని చాలా వరకు ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశామని చెప్పారు. భక్తుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని క్యూలైన్లలో పలు మార్పులు చేపట్టామని తెలిపారు. క్యూలైన్లలో భక్తులు కూర్చునేవిధంగా ఏర్పాట్లు చేయడంతో పాటు, తాగునీటి సౌకర్యం, క్యూలైన్లకు అనుసంధానంగా అదనపు మరుగుదొడ్లు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు చెప్పారు.
మొబైల్ వాటర్ డ్రమ్స్, మొబైల్ ఫుడ్ వ్యాన్లు…
చలికాలం కావడంతో క్యూలైన్లలోని అన్న ప్రసాదాల పంపిణీ కేంద్రాల్లో అన్న ప్రసాదాలు చల్లబడకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకునే ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. అదేవిధంగా భక్తులకు తాగునీరు అందించేందుకు అదనంగా మొబైల్ వాటర్ డ్రమ్స్, మూడు మొబైల్ ఫుడ్ వ్యాన్లు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.
భక్తుల కోసం టీటీడీ అందుబాటులో ఉంచిన సదుపాయాలను వినియోగించుకునేందుకు వివిధ భాషల్లో సూచిక బోర్డులను కూడా క్యూలైన్లలో మరియు ముఖ్యమైన ప్రాంతాల్లో ఏర్పాటు చేశామన్నారు. భక్తులందరూ టీటీడీ క్యూలైన్లలో కల్పిస్తున్న సౌకర్యాలను వినియోగించుకుని సంయమనంతో స్వామివారిని దర్శంచుకోవాలని తెలియజేశారు.
SSD టోకెన్లు రద్దు - టీటీడీ ప్రకటన
తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాల నేపథ్యంలో టీటీడీ కీలక ప్రకటన చేసింది. భక్తుల రద్దీ దృష్ట్యా డిసెంబర్ 28 నుండి జనవరి 7వ తేది వరకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ లో భక్తులకు ఇచ్చే SSD టోకెన్ల జారీని రద్దు చేయడం జరిగింది.
భక్తులకు మార్గదర్శకాలు….
- 30.12.2025 నుండి 08.01.2026 వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు.
- తొలి మూడు రోజులు అనగా, డిసెంబర్ 30, 31 మరియు జనవరి 01వ తేదీల్లో ఈ-డిప్ ద్వారా టోకెన్లు పొందిన భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం ఉంటుంది.
- టోకెన్ పొందిన భక్తులు తమకు కేటాయించిన తేదీలలో నిర్దేశించిన సమయానికి (Time Slot) మాత్రమే తిరుమలలోని దర్శన ప్రవేశ మార్గాలకు చేరుకోవాల్సి ఉంటుంది.
- టీటీడీ ప్రజా సంబంధాల విభాగం, SVBC, సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పపడు అందించే భక్తుల రద్దీ సమాచారం ఆధారంగా టోకన్లు లేని భక్తులకు దర్శనాలుంటాయి.
- జనవరి 02వ తేదీ నండి 08వ తేదీ వరకు సర్వ దర్శనం క్యూ లైన్ ద్వారా వైకుంఠ ద్వార దర్శనం పొందడానికి తమ ప్రణాళికను రూపొందించుకోవాలని టీటీడీ ఓ ప్రకటన ద్వారా కోరింది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

