...
...
Next Story

Tirumala Garuda Seva : తిరుమల బ్రహ్మోత్సవాల్లో కన్నులపండువగా గరుడసేవ - గోవింద నామస్మరణతో మార్మోగిన తిరుగిరులు

Tirumala Brahmotsavam Garuda Seva : తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన శనివారం రాత్రి అత్యంత వైభవంగా గరుడసేవ జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు గరుడ వాహనంపై భక్తులకు అభయమిచ్చారు.

Published on: Sep 19, 2026, 22:07:46 IST
Advertisement

Tirumala Brahmotsavam Garuda Seva : కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అత్యంత ఆధ్యాత్మిక ఉత్సాహంతో, కన్నులపండువగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో ఐదో రోజైన శనివారం రాత్రి అత్యంత విశిష్టమైన, పవిత్రమైన గరుడసేవ వైభవంగా జరిగింది. రంగురంగుల విద్యుత్ దీపాలు, విదేశీ సుగంధ పుష్పాలతో విశేషంగా అలంకరించిన గరుడ వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేతుడై శ్రీ మలయప్పస్వామివారు తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తకోటికి దివ్యానుభూతిని అందించారు.

కన్నులపండువగా గరుడసేవ
కన్నులపండువగా గరుడసేవ

ముందుగా గజరాజులు గంభీరంగా నడుస్తుండగా, భక్త బృందాల భజనలు, మహిళల కోలాటాలు, జీయ్యంగార్ల దివ్యప్రబంధ ఘోష, మంగళవాయిద్యాల మంత్రముగ్ధ రవళుల నడుమ స్వామివారి ఊరేగింపు పరమ భక్తిభావంతో సాగింది. మాడ వీధుల్లో వేచి ఉన్న అపార భక్తజనం అడుగడుగునా కర్పూర హారతులు సమర్పిస్తూ “గోవిందా… గోవిందా…” అంటూ చేసిన నామస్మరణతో తిరుమల గిరులు ప్రతిధ్వనించాయి. మలయప్ప స్వామివారి దివ్య మంగళ రూపాన్ని కళ్లారా తిలకించి భక్తులు మైమరిచిపోయారు.

గరుడసేవకు విశిష్ట ఆధ్యాత్మిక ప్రాశస్త్యం….

సనాతన ధర్మంలో…. ముఖ్యంగా 108 వైష్ణవ దివ్యదేశాల్లో గరుడసేవకు అత్యంత ప్రాధాన్యత ఉంది. వేద స్వరూపుడైన గరుత్మంతుడు జ్ఞానానికి, వైరాగ్యానికి ప్రతీక. వేదాల సారాన్ని తన రెక్కలుగా చేసుకుని స్వామివారిని మోసే గరుడ వాహనంపై శ్రీమలయప్పస్వామిని దర్శించుకోవడం వల్ల సమస్త పాపాలు తొలగిపోతాయని, భక్తులకు జ్ఞానవైరాగ్యాలు ప్రాప్తిస్తాయని అర్చకులు, పండితులు విశ్వసిస్తారు. అందుకే బ్రహ్మోత్సవాలన్నింటిలోనూ గరుడ సేవ అత్యంత ముఖ్యమైన ఘట్టంగా నిలుస్తుంది.

ఈ అత్యంత వైభవంగా జరిగిన గరుడసేవ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వేంకటేశ్వర్, జేఈవోలు డాక్టర్ ఎ. శరత్, ప్రభల గోపీనాథ్, జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, సీవీఎస్వో కె.వి. మురళీకృష్ణ, ఎస్వీబీసీ ఛైర్మన్ శ్రీధర్ వర్మ మరియు ఇతర పాలకమండలి సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks