...
...
Next Story

వైజాగ్ గూగుల్ డేటా సెంటర్: 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో ఏపీలో ఏఐ కారిడార్

వైజాగ్ వేదికగా గూగుల్ సంస్థ 15 బిలియన్ డాలర్ల అపారమైన వ్యయంతో 1 గిగావాట్ సామర్థ్యంతో నిర్మిస్తున్న డేటా సెంటర్ ప్రాజెక్టు ఏపీలో టెక్ విప్లవానికి నాంది పలకనుంది. అదానీ, ఎయిర్‌టెల్‌ భాగస్వామ్యంతో శరవేగంగా పనులు జరుపుకుంటున్న ఈ ప్రాజెక్టు మొదటి విడత 2028 నాటికి అందుబాటులోకి రానుంది.

Published on: Aug 27, 2026, 17:45:34 IST
Advertisement

ఒకప్పుడు ప్రశాంతమైన సముద్ర తీరాలు, మత్స్యకార గ్రామాలు, షిప్‌యార్డులకు మాత్రమే పేరుగాంచిన విశాఖపట్నం ఇప్పుడు ప్రపంచ టెక్నాలజీ రంగంలో రికార్డులు సృష్టించేందుకు సిద్ధమవుతోంది. అమెరికా వెలుపల గూగుల్ సంస్థ నిర్మిస్తున్న అతిపెద్ద డేటా సెంటర్ ప్రాజెక్టుకు విశాఖ వేదికగా మారింది. రూ.1.25 లక్షల కోట్లకు పైగా (15 బిలియన్ డాలర్లు) పెట్టుబడితో, 1 గిగావాట్ (GW) సామర్థ్యంతో ఏర్పాటు చేస్తున్న ఈ బృహత్తర ప్రాజెక్టు ఆంధ్రా టెక్ భవిష్యత్తును పూర్తిగా మార్చేయనుంది.

అమెరికాలో ఉన్న గూగుల్ డేటా సెంటర్
అమెరికాలో ఉన్న గూగుల్ డేటా సెంటర్

2024 చివర్లో గూగుల్ ఇంజనీర్ల బృందం విశాఖను సందర్శించి అధ్యయనం చేయగా, సరిగ్గా ఏడాది వ్యవధిలోనే 2025 అక్టోబర్ 14న గూగుల్ ఈ ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించింది. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, భారతీ ఎయిర్‌టెల్‌ భాగస్వామ్యంతో నిర్మిస్తున్న ఈ కేంద్రం పనులు 2026 ఏప్రిల్ నాటికే వేగంగా ప్రారంభమయ్యాయి.

అనుమతుల వేగం: సింగిల్ విండో సిస్టమ్‌తో దూకుడు

భారతదేశంలో వ్యాపార నిర్వహణ ఎంత సులభతరమైందో (Ease of Doing Business) ఈ ప్రాజెక్ట్ వేగమే నిదర్శనమని గూగుల్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (ఆసియా-పసిఫిక్) ప్రిన్సిపల్ అలెగ్జాండర్ స్మిత్ పేర్కొన్నారు.

"కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించిన సింగిల్ విండో క్లియరెన్స్ విధానం వల్ల భూమి, విద్యుత్, ఇతర చట్టపరమైన అనుమతులు అతి తక్కువ సమయంలో లభించాయి. సింగపూర్ వంటి అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చినా ఇంత వేగంగా అనుమతులు రావడం ఒక రికార్డు" అని అలెగ్జాండర్ స్మిత్ స్పష్టం చేశారు.

అయితే, 2026 ఆగస్టు 24న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపివేసేందుకు నిరాకరించినప్పటికీ, ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అధికారిక పత్రాలను తమ ముందు ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కోర్టు పరిశీలన ప్రక్రియ పూర్తయ్యే తీరును బట్టి నిర్మాణ వేగం ఆధారపడి ఉంటుంది.

విశాఖ 'ఇండియాస్ న్యూ బెంగళూరు' కాబోతుందా?

"ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) యుగంలో గూగుల్ లాంటి సంస్థకు ఉన్న వ్యూహాత్మక ప్రాధాన్యత అపారమైనది. గూగుల్ ఇక్కడ అడుగుపెట్టడంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ భాగస్వాములే కాకుండా, ఐటీ ఆధారిత సేవలందించే దిగ్గజ కంపెనీలు కూడా విశాఖ బాట పడతాయి. విశాఖపట్నం త్వరలోనే దేశంలోనే సరికొత్త బెంగళూరుగా అవతరిస్తుంది" అని ప్రముఖ ఏఐ కన్సల్టెన్సీ సంస్థ కన్వర్జెన్స్ క్యాటలిస్ట్ పార్ట్‌నర్ జయంత్ కొల్లా అభిప్రాయపడ్డారు.

ఇప్పటికే రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్, గ్రీన్ కో మద్దతు ఉన్న ఏఎం ఇంటెలిజెన్స్ వంటి దిగ్గజాలు విశాఖ పరిసరాల్లో తమ సదుపాయాలను ప్రకటిస్తుండగా, అనేక అనుబంధ చిన్న తరహా సరఫరాదారులు (Vendors) కూడా ఇక్కడే తమ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నారు.

సముద్రగర్భ కేబుల్ వ్యవస్థ, స్థానిక అభివృద్ధి

విశాఖపట్నం భౌగోళికంగా అత్యంత సురక్షితమైన ప్రాంతం కావడమే కాకుండా, నెట్‌వర్క్ వేగాన్ని (Latency) పెంచే మూడో 'సబ్‌సీ కేబుల్ లాండింగ్ సైట్' (Subsea cable landing site) గా మారే అన్ని అనుకూలతలు ఉన్నాయని గూగుల్ ప్రతినిధులు తెలిపారు.

స్థానికులకు ప్రయోజనాలు

భూగర్భ జలాల పరిరక్షణ: ఈ డేటా సెంటర్‌లో ఎయిర్-కూలింగ్ (Air-cooled) టెక్నాలజీని వాడుతున్నారు. దీనివల్ల నిరంతరం మంచి నీటిని వినియోగించాల్సిన అవసరం ఉండదు.

విద్యుత్ వ్యవస్థ బలోపేతం: పవర్ సబ్‌స్టేషన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, కేబుల్స్ మౌలిక వసతులను గూగుల్ అభివృద్ధి చేస్తోంది. ఇది పవర్-సర్ప్లస్ సదుపాయం కావడం వల్ల మిగులు విద్యుత్‌ను స్థానిక గ్రిడ్‌కు అందిస్తుంది.

మత్స్యకారులకు టెక్నాలజీ సహాయం: తీరప్రాంత మత్స్యకారులు మెరుగైన వేట సాధించి, ఎక్కువ రాబడి పొందేలా జీపీఎస్ (GPS) టెక్నాలజీ వాడకంపై ప్రత్యేక శిక్షణ అవగాహన కార్యక్రమాలను గూగుల్ చేపడుతోంది.

ప్రాజెక్టు టైమ్‌లైన్

ప్రస్తుతం విశాఖలో భూమిని సిద్ధం చేసే (Earthwork Construction) పనులు జరుగుతున్నాయి. గూగుల్ ప్రణాళికల ప్రకారం:

మొదటి విడత (Phase 1): 2028 మధ్య నాటికి (రాబోయే రెండేళ్లలో) అందుబాటులోకి వస్తుంది.

పూర్తి స్థాయి 1GW సదుపాయం: 2032 నాటికి (రాబోయే 5-6 ఏళ్లలో) పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe