AP Weather Updates : బంగాళాఖాతంలో వాతావరణ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వాయువ్య బంగాళాఖాతం పరిధిలోని పశ్చిమ బెంగాల్ - ఉత్తర ఒడిశా తీరాల సమీపంలో కొత్తగా అల్పపీడనం ఏర్పడిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది. రాబోయే రెండు రోజుల్లో ఈ అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని అంచనా వేసింది.

ఈ అల్పపీడనం ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై చాలా తక్కువగానే ఉండే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు లేకపోయినా…. కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వాతావరణం మారి వర్షాలు పడే వీలుంది.
ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు
ఈ అల్పపీడన ప్రభావంతో ఇవాళ (జూలై 26, 2026) రాష్ట్రంలోని పలు ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడతాయని అంచనా.
ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడే ముప్పు ఉన్నందున ఆయా ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని…. వర్షం పడే సమయంలో పాత భవనాలు, చెట్ల కింద నిలబడకూడదని అధికారులు విజ్ఞప్తి చేశారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశువుల కాపరులు పిడుగుల బారిన పడకుండా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.