...
...
Next Story

School Of Agriculture : ఏపీలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్.. రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన!

Indian School of Agriculture : వ్యవసాయాన్ని మరింత ప్రోత్సహించేలా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటు చేద్దామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. మరోవైపు అన్నదాత సుఖీభవ నిధులు మార్చి 13వ తేదీన జమ చేస్తామని వెల్లడించారు.

Published on: Mar 11, 2026, 13:08:16 IST
Advertisement

కలెక్టర్ల సమావేశంలో కలెక్టర్లకు వివిధ అంశాలపై లక్ష్యాలను నిర్దేశించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. వివిధ వర్గాలకు అందించే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల విషయమై ప్రజల్లో పెద్ద ఎత్తున ప్రచారం కల్పించేలా చూడాలని ఆదేశించారు. ప్రభుత్వ స్కీంల పట్ల ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు.

ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్‌పై ప్రభుత్వం ప్రకటన
ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్‌పై ప్రభుత్వం ప్రకటన

ఈ మేరకు అధికారులు-ప్రజాప్రతినిధులు కలిసి చేపట్టాల్సిన కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్సులో యాక్షన్ ప్లాన్ ప్రకటించారు. వ్యవసాయానికి ప్రొత్సహమిచ్చేలా ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ అనే వ్యవస్థను ఏర్పాటు చేస్తామంటూ సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఇండియన్ బిజినెస్ స్కూల్ తరహాలో వ్యవసాయం కోసం అత్యున్నత సంస్థ ఏర్పాటు చేద్దామని అధికారులకు చెప్పారు.

'ప్రతీ మూడు నెలలకూ పాలనా అంశాలపై సమీక్ష చేసుకుని ముందుకు వెళ్తున్నాం. ఉన్న పరిమిత వనరులతోనే సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనను బ్యాలెన్సు చేస్తున్నాం. గతంలో కార్యాలయాల్లో కూర్చుని ఫైల్స్ రాసే పరిస్థితి నుంచి వర్చువల్ పనివిధానాన్ని తీసుకువచ్చాం. గడచిన 20 నెలల్లో కీలకమైన పాలనా మార్పులు తీసుకువచ్చాం. ప్రభుత్వం తీసుకువచ్చే విధానాలు దీర్ఘకాలంలో ప్రభావం చూపిస్తాయి. వీటి అమలులో ఉదాసీనత వద్దు. 2047 స్వర్ణాంధ్ర విజన్ లో భాగంగా తీసుకువచ్చిన 10 సూత్రాలు అమలు చేస్తే సుపరిపాలన అందించేందుకు వీలవుతుంది.' అని చంద్రబాబు అన్నారు.

నిర్దేశిత లక్ష్యాలను క్షేత్రస్థాయిలో ప్రభావవంతంగా అమలు చేయాలన్నారు సీఎం. సూపర్ సిక్స్ సహా వివిధ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయాలని పేర్కొన్నారు. ఎక్కడా చిన్న పొరపాటు కూడా దొర్లకుండా పారదర్శకంగా అమలు చేయాలన్నారు. మార్చి 13 తేదీన అన్నదాత సుఖీభవ పథకాన్ని మూడో విడత అమలు చేస్తున్నామని వెల్లడించారు కేంద్రం ఇచ్చే నిధులతో పాటు రాష్ట్రం కూడా రైతుల ఖాతాల్లో మిగతా సొమ్ము వేస్తుందని చెప్పారు.

గత పాలనలో ట్రూ ఆప్ పేరిట విద్యుత్ చార్జీల భారం వేశారని చంద్రబాబు తెలిపారు. తొలిసారి ట్రూ డౌన్ చేశామన్నారు. 4600 కోట్ల రూపాయల భారాన్ని కూడా ప్రభుత్వమే భరిస్తోందని చెప్పారు. ఈ ఏడాది 39 పైసల మేర విద్యుత్ కొనుగోలు ధర తగ్గిస్తామని, కుసుమ్ కింద 3 లక్షల పంప్ సెట్లు ఇస్తున్నామన్నారు. సబ్ స్టేషన్ యూనిట్‌గా మైక్రో గ్రిడ్ ఏర్పాటుతో పాటు ప్రోజ్యూమర్ కాన్సెప్టును సమర్ధంగా అమలు చేయాలన్నారు. ఐటీ, ఏఐ, క్వాంటం ల్యాబ్స్ తరహాలో వ్యవసాయం కోసం ఓ బలమైన వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe