Annadata Sukhibhava : అన్నదాత సుఖీభవ నిధుల విడుదలకు డేట్ ఫిక్స్.. ఒకేసారి రైతుల ఖాతాల్లోకి రూ.6వేలు!

PM Kisan-Annadata Sukhibhava Funds : అన్నదాత సుఖీభవ నిధుల విడుదలకు డేట్ ఫిక్స్ అయింది. ఒకేసారి రైతుల ఖాతాల్లోకి రూ.6వేలు జమకానున్నాయి.

Published on: Mar 11, 2026 7:09 AM IST
By , Amaravati
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్ రైతులకు కేంద్రం శుభవార్త చెప్పింది. ఉగాది కానుకగా అన్నదాత సుఖీభవ పథకం నిధులు రైతుల ఖాతాల్లో జమకానున్నాయి. పీఎం కిసాన్ యోజన 22వ విడుదల నిధులను మార్చి 13వ తేదీన ప్రధానమంత్రి నరేంద్రమోదీ విడుదల చేస్తారని కేంద్రం ప్రకటించింది. అయితే పీఎం కిసాన్ యోజన డబ్బులతో అన్నదాత సుఖీభవ పథకం నిధులను కూడా విడుదల చేస్తుంది ఏపీ ప్రభుత్వం.

అన్నదాత సుఖీభవ నిధులు
అన్నదాత సుఖీభవ నిధులు

దీంతో ఉగాదికంటే ముందుగానే మార్చి 13వ తేదీన అన్నదాతల ఖాతాల్లోకి సుమారు రూ.6000 జమ అవుతాయి. పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పేరుతో ప్రతీ సంవత్సరం ఆంధ్రప్రదేశ్‌లో అర్హులైన రైతులకు రూ.20వేల ప్రభుత్వం అందజేస్తోంది. ఇందులో అన్నదాత సుఖీభవ పథకం నుంచి రూ.14000, పీఎం కిసాన్ యోజన కింద రూ.6000 అందిస్తున్నారు.

మూడు విడుతల్లో భాగంగా ఈ నిధులు జమఅవుతాయి. ఇప్పుడు పీఎం కిసాన్ యోజన 22వ విడత నిధుల విడుదలకు కేంద్రం మార్చి 13 డేట్ ఫిక్స్ చేసింది. వాటితోపాటుగా అన్నదాత సుఖీభవ నిధులు కూడా రైతుల అకౌంట్లో పడతాయి. సంక్రాంతి సమయంలోనే ఈ డబ్బులు జమ అవుతాయని అనుకున్నప్పటికీ.. పలు కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది.

పీఎం కిసాన్ యోజన సాయం అందాలి అంటే.. రైతులు తప్పనిసరిగా ఈకేవైసీ కంప్లీట్ చేయాలి. ఈ విషయాన్ని కేంద్ర వ్యవసాయ శాఖ స్పష్టంగా చెప్పింది. పీఎం కిసాన్ లబ్ధి అందుకునేందుకు రైతులు ఈకేవైసీ తప్పనిసరిగా పూర్తి చేయాలి.

రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని సూపర్ సిక్స్‌లో భాగంగా అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకాన్ని అమలు చేస్తున్నామని తాజాగా ఓ ప్రకటనలో వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ పథకం ద్వారా ప్రతి రైతు కుటుంబానికి సంవత్సరానికి రూ.20,000 ఆర్థిక సహాయం అందిస్తున్నామని చెప్పారు. సంవత్సరానికి రూ.20,000 మూడు విడతలుగా అందిస్తున్నామని తెలిపారు. ఇందులో రాష్ట్రం నుంచి రూ.14,000, కేంద్రం నుంచి పీఎం కిసాన్ ద్వారా రూ.6,000 అందుతున్నాయని చెప్పారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకం అమలుకు రూ.6,300 కోట్లు కేటాయించామని, ఇప్పటికే రెండు విడతలుగా మొత్తం రూ.6,309.44 కోట్లు రైతు కుటుంబాలకు పంపిణీ చేశామని మంత్రి వివరించారు.

పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. వరి పంటకు ఇన్‌పుట్ సబ్సిడీని రూ.17,000 నుంచి రూ.25,000కు పెంచామని చెప్పారు. జూన్ 2024 నుంచి ఇప్పటివరకు సుమారు 2 లక్షల మంది రైతులకు రూ.310 కోట్లు ఇన్‌పుట్ సబ్సిడీగా అందించామని వెల్లడించారు. గత ప్రభుత్వ కాలంలో ఆత్మహత్యలు చేసుకున్న 81 మంది రైతుల కుటుంబాలకు చెల్లించకుండా మిగిలిపోయిన రూ.5.67 కోట్ల నష్టపరిహారాన్ని కూడా ప్రస్తుత ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. అదేవిధంగా మరో 214 మంది రైతుల కుటుంబాలకు రూ.14.98 కోట్ల నష్టపరిహారం చెల్లించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.

ఉద్యానవన పంటలు ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతులకు కూడా రూ.50 కోట్లు ఇన్‌పుట్ సబ్సిడీగా అందించామని అచ్చెన్నాయుడు చెప్పారు. అదేవిధంగా గతంలో సాంకేతిక కారణాలతో మిగిలిపోయిన 1.21 లక్షల మంది రైతులకు రూ.147.34 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ విడుదలకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని మంత్రి వెల్లడించారు. అరకు ప్రాంతంలోని కాఫీ తోటల్లో కాఫీ బెర్రీ బోరర్ వ్యాధి వ‌ల‌న‌ నష్టపోయిన 81 మంది రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీగా రూ.7,23,825 ప్రభుత్వం మంజూరు చేసిందని పేర్కొన్నారు.

రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పంటల బీమా పథకాన్ని ప్రభుత్వం సమగ్రంగా పునఃసమీక్షించిందని మంత్రి తెలిపారు. వ్యవసాయ, రెవెన్యూ, పౌర సరఫరాల మంత్రులతో క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసి పథకం అమలుపై విశ్లేషణ చేసి కీలక నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. ఖరీఫ్ 2024 సీజన్‌కు ఈ-క్రాప్ నమోదు ఆధారంగా ఉచిత పంటల బీమా అమలు చేశామని తెలిపారు. అనంతరం రైతు కూడా బాధ్యతాయుత భాగస్వామిగా ఉండేలా రబీ 2024–25 నుంచి స్వచ్ఛంద నమోదు విధానాన్ని ప్రవేశపెట్టామని చెప్పారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More