...
...
Next Story

ISKCON Tirupati : ఇస్కాన్ తిరుపతి శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకల పోస్టర్ విడుదల

తిరుపతిలోని ఇస్కాన్‌లో శ్రీ కృష్ణ జన్మాష్టమి 2026 వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు పోస్టర్‌ను ఆవిష్కరించారు.

Published on: Aug 22, 2026, 21:23:17 IST
Advertisement

తిరుపతిలోని ఇస్కాన్ (ISKCON) ఆలయంలో ఈ ఏడాది శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలకు సంబంధించిన పోస్టర్‌ను ఇస్కాన్ ఆలయ ప్రాంగణంలోని గౌరాంగ భవన్ కాన్ఫరెన్స్ హాల్‌లో ఆలయ ఛైర్మన్ రేవతి రమణ ప్రభు ఘనంగా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ వైస్ ఛైర్మన్ రూపేష్ చైతన్య ప్రభుతో పాటు ఇతర ప్రతినిధులు, భక్తులు విశేషంగా పాల్గొన్నారు.

ఇస్కాన్ తిరుపతి
ఇస్కాన్ తిరుపతి

సెప్టెంబర్ 4వ తేదీన జరిగే ప్రధాన శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో ఆగస్టు 23 నుండి వైవిధ్యమైన ఆధ్యాత్మిక, సాంస్కృతిక, భక్తి కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.

ఆధ్యాత్మిక ఉత్సవాల పూర్తి వివరాలు

శ్రీకృష్ణ చైతన్య అమృతాన్ని భక్తులకు అందించేందుకు భాగంలో శ్రీ శ్రీ రాధా గోవిందజీ ఉంజల్ సేవ (డోలోత్సవం) ఆగస్టు 23 నుంచి 28వ తేదీ వరకు ప్రతిరోజూ సాయంత్రం 7:00 గంటల నుండి రాత్రి 8:30 గంటల వరకు ఆలయంలో వైభవంగా జరగనుంది. భక్తులు ఈ డోలోత్సవంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావచ్చు.

శ్రీకృష్ణుని నిత్య అగ్రజన్ముడు, మొదటి సేవకుడైన బలరామ భగవానుడి ఆవిర్భావ దినోత్సవాన్ని ఆగస్టు 28న ఆలయంలో ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నారు.

జన్మాష్టమి వేడుకల ముందస్తు సన్నాహాల్లో భాగంగా సెప్టెంబర్ 3న గోపూజ మహోత్సవం, అధివాస మహోత్సవాలు నిర్వహిస్తారు. శ్రీకృష్ణుని జీవితంలో, ఆయన బోధనల్లో ఆవుల సంరక్షణకు, గోసేవకు ప్రత్యేక స్థానం ఉందని ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు గుర్తుచేశారు.

సెప్టెంబర్ 4న లోకరక్షకుడైన శ్రీకృష్ణుని దివ్య ఆవిర్భావ దినోత్సవమైన 'శ్రీకృష్ణ జన్మాష్టమి'ని వేడుకగా నిర్వహించనున్నారు. ఈ పవిత్ర పర్వదినాల్లో భక్తులందరూ విశేష సంఖ్యలో పాల్గొని, భగవంతుని సేవలో తరించి దివ్యానుభూతిని పొందాలని ఇస్కాన్ ప్రతినిధులు కోరారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe