...
...
Next Story

కోచ్ సాధిక్‌ మమ్మల్ని నాశనం చేశాడు.. టెర్రరిస్టులకు అమ్మేస్తా అన్నాడు : రియాన్ష్‌

ఏఈ నూకరాజు మనవడు రియాన్ష్ మీడియాతో మాట్లాడాడు. తన ఆవేదనను వెల్లడించాడు. ఇప్పటికీ తనకు భయంగానే ఉందని తెలిపాడు.

Updated on: Aug 25, 2026, 22:22:01 IST
Advertisement

రాజమహేంద్రవరంలో ఇటీవల చోటుచేసుకున్న ఏఈ నూకరాజు కుటుంబం విషాదాంతం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిన సంగతి తెలిసిందే. ఈ ఘోర క్రూరత్వంలో కుటుంబ సభ్యులందరినీ కోల్పోయి, ప్రాణాలతో బయటపడిన 10 ఏళ్ల చిన్నారి రియాన్ష్ కార్తికేయరెడ్డి ఆవేదన వర్ణనాతీతంగా మారింది. షూటింగ్ కోచ్ సాధిక్ ఖాన్ చేసిన అకృత్యాల వల్ల తాను నిమిషాల వ్యవధిలో అనాథగా మిగిలిపోయానని ఆ బాలుడు కన్నీరుమున్నీరయ్యాడు.

రియాన్ష్ కార్తికేయ
రియాన్ష్ కార్తికేయ

భయాందోళనలో ఉన్న చిన్నారి రియాన్ష్‌ను కాకినాడ పార్లమెంట్ సభ్యులు ఉదయ్ శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ వద్దకు తీసుకెళ్లారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాలుడితో పాటు ఎంపీ మీడియాకు ఈ దారుణమైన పరిస్థితులను వివరించారు.

మీడియాతో బాలుడు రియాన్ష్ మాట్లాడుతూ 'నాకు 3వ తరగతి నుంచే రైఫిల్ షూటింగ్ అంటే ఎంతో ఇష్టం. స్కూల్లో శిక్షణ తీసుకునే సమయంలో సాధిక్ ఖాన్ కోచ్‌గా వచ్చాడు. అక్కడే మా అమ్మతో అతనికి పరిచయం ఏర్పడింది. నాటి నుంచి మా అమ్మను చిత్రహింసలకు గురిచేసేవాడు. మా నాన్న జగదీష్ రెడ్డి తాగే ప్రొటీన్ షేక్‌లో రసాయనాలు కలిపి ఆయన్ను చంపేశాడు. ఈ అన్యాయాన్ని ఎవరికైనా చెబితే నన్ను టెర్రరిస్టులకు అమ్మేస్తానని భయపెట్టేవాడు. నా కుటుంబాన్ని నాశనం చేసి నన్ను ఒంటరిని చేశాడు. బయటకు వెళ్లాలంటేనే నాకు భయమేస్తోంది.' అని గుండెలు పిండేలా విషయాలను పంచుకున్నాడు రియాన్ష్.

నూకరాజు కుటుంబ ఆత్మహత్యకు, చిన్నారి తండ్రి మరణానికి పూర్తి బాధ్యుడు సాధిక్ ఖానేనని ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ స్పష్టం చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడతానని ఆయన వెల్లడించారు. జగదీష్ రెడ్డికి ప్రొటీన్ పౌడర్‌లో సైనైడ్ ఇచ్చి హత్య చేశాడని, నూకరాజు ఆస్తిపత్రాలు, బ్యాంక్ ఖాతాలను బలవంతంగా స్వాధీనం చేసుకున్నాడని ఎంపీ ఆరోపించారు. అంతేకాకుండా, సౌజన్యపై హిందూ ధర్మాన్ని వదిలి ఇస్లాం మతంలోకి మారాలని ఒత్తిడి తెచ్చినట్లు సూసైడ్ నోట్ ద్వారా తెలిసిందన్నారు.

ఈ కేసు అత్యంత ఘోరమైనది కాబట్టి దీనిని సీబీఐకి అప్పగించి లోతుగా విచారణ జరిపించాలని, నిందితుడు సాధిక్‌కు ఉరిశిక్ష విధించాలని ఎంపీ డిమాండ్ చేశారు. అలాగే సాధిక్ తరఫున ఏ న్యాయవాది వాదించవద్దని బార్ అసోసియేషన్‌ను కోరారు. సాధిక్ ఖాన్ వద్ద షూటింగ్ శిక్షణ పొంది వేధింపులకు గురైన ఇతర విద్యార్థులు ఉంటే ధైర్యంగా ముందుకు రావాలని, వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని ఎంపీ హామీ ఇచ్చారు.

నూకరాజు, ఆయన కుమార్తె సౌజన్య రాసిన సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు ఇప్పటికే నిందితుడు సాధిక్ ఖాన్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అనాథగా మారిన ఆ చిన్నారికి న్యాయం జరగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe