రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే (SCR) ముఖ్యమైన అలర్ట్ ఇచ్చింది. తిరుపతి, కాట్పాడి సెక్షన్ల మధ్య ట్రాక్ ఆధునికీకరణ, సాంకేతిక నిర్వహణ పనుల్లో భాగంగా పీక్యూఆర్ఎస్ (PQRS) బ్లాకులను విధిస్తున్నారు. ఈ నేపథ్యంలో జూన్ 19, 2026 నుంచి జూలై 13, 2026 వరకు ప్రతి శుక్రవారం, సోమవారం ఈ సెక్షన్లో ప్రత్యేక రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగనుంది. ఇందులో భాగంగా చర్లపల్లి నుండి తిరువణ్ణామలై(అరుణాచలం) వెళ్లే ప్రత్యేక రైలును వేరే రూట్లోకి మళ్లిస్తున్నట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు.
ఈ తేదీల్లో దారి మళ్లింపు…

దక్షిణ మధ్య రైల్వే ప్రకటనలోని వివరాల ప్రకారం…. చర్లపల్లి - తిరువణ్ణామలై(ట్రైన్ నంబర్ 07001) ప్రత్యేక రైలును దారి మళ్లిస్తారు. నిర్ణీత తేదీల్లో గతంలో నిర్ణయించిన మార్గానికి బదులుగా రేణిగుంట, మేల్పాక్కం క్యాబిన్, కాట్పాడి మీదుగా ప్రయాణిస్తుంది.జూన్ 18, జూన్ 25, జూలై 02, జూలై 09, 2026 తేదీల్లో ఈ నిర్ణయం అమల్లో ఉంటుంది.
పైన పేర్కొన్న నాలుగు తేదీల్లో ప్రయాణించే ఈ ప్రత్యేక రైలు (07001) తిరుపతి, పాకాల, చిత్తూరు రైల్వే స్టేషన్లలో ఆగదు. ఈ మూడు ప్రధాన స్టేషన్లను స్కిప్ చేస్తూ రైలు నేరుగా మళ్లించిన మార్గంలో వెళుతుంది.
"సాంకేతిక పనుల దృష్ట్యా ప్రయాణికులకు కలిగే అసౌకర్యానికి విచారం వ్యక్తం చేస్తున్నాం" అని రైల్వే అధికారులు పేర్కొన్నారు. ముఖ్యంగా ఆధ్యాత్మిక నగరమైన తిరుపతికి అలాగే చిత్తూరు ప్రాంతాలకు వెళ్లాలనుకునే భక్తులు, ప్రయాణికులు ఈ మార్పులను గమనించి…. తదనుగుణంగా తమ ప్రయాణ ప్రణాళికలను మార్చుకోవాలని లేదా ప్రత్యామ్నాయ రవాణా మార్గాలను చూసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే సూచించింది.