శ్రీశైలం నల్లమల అడవుల్లో 4 లేన్ల ఎలివేటెడ్ కారిడార్‌పై కీలక అప్డేట్!

తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు కేంద్రం శుభవార్త చెప్పింది. ఏపీ, తెలంగాణనుఅనుసంధానిస్తూ.. నల్లమల మీదుగా కొత్త నాలుగు వరుసల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్రం సూత్రప్రాయ ఆమోదం తెలిపింది.

Published on: Jun 18, 2026, 10:29:29 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శించుకునే భక్తులకు, తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం ఒక భారీ ఊరటనిచ్చే ప్రకటన చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను అనుసంధానిస్తూ నల్లమల అడవుల మీదుగా సరికొత్త నాలుగు వరుసల (4 Lane) ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్ర రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆధ్యాత్మిక పర్యాటక రంగానికి బూస్ట్ ఇచ్చేలా ఈ ప్రాజెక్టును ప్రతిపాదించారు.

శ్రీశైలం వెళ్లే దారి
శ్రీశైలం వెళ్లే దారి

నేషనల్ హైవే 765 పరిధిలో నిర్మించనున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అంచనా వ్యయం దాదాపు రూ.12,000 కోట్లు. ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురం జిల్లా డోర్నాల నుండి తెలంగాణలోని బ్రాహ్మణపల్లి వరకు మొత్తం 86.74 కిలోమీటర్ల పొడవునా ఈ ఎలివేటెడ్ కారిడార్ (ఫ్లైఓవర్ తరహా వంతెన రహదారి) నిర్మించనున్నారు.

ఆంధ్రప్రదేశ్ పరిధి: పెద్దరావీడు నుండి శ్రీశైలం వరకు – 41.39 కిలోమీటర్లు

తెలంగాణ పరిధి: బ్రాహ్మణపల్లి నుండి శ్రీశైలం వరకు – 45.35 కిలోమీటర్లు

నల్లమల అభయారణ్యం గుండా వెళ్లే ప్రస్తుత ఘాట్ రోడ్డు కారణంగా వన్యప్రాణులకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. రాత్రి వేళల్లో రాకపోకలపై ఆంక్షలు కూడా అమల్లో ఉన్నాయి. ఈ నూతన ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం వల్ల ప్రయోజనాలు కలుగుతాయని అధికారులు వెల్లడించారు.

అడవికి పైనుండి ఈ కారిడార్ వెళ్తుంది కాబట్టి, సున్నితమైన అటవీ ప్రాంతాలలో మానవ జోక్యం, వాహనాల కాలుష్యం తగ్గి వన్యప్రాణులకు రక్షణ దొరుకుతుంది. పండగలు, సెలవు దినాల్లో శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఏర్పడే భారీ ట్రాఫిక్ జామ్‌లకు ఇది శాశ్వత పరిష్కారం చూపుతుంది. ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది.

మార్కాపురంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ.. ఈ హైవే ప్రాజెక్టు పర్యావరణ పరిరక్షణను, ప్రాంతీయ అభివృద్ధిని సమతుల్యం చేసే ఒక మైలురాయి వంటిదని కొనియాడారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి డీపీఆర్, క్షేత్రస్థాయి ప్రణాళికల రూపకల్పన వేగంగా జరుగుతోందని ఆయన తెలిపారు.

ఈ నాలుగు వరుసల ఎలివేటెడ్ కారిడార్ అందుబాటులోకి వస్తే శ్రీశైలం క్షేత్రానికి చేరుకోవడం సులభతరం అవ్వడమే కాకుండా, పరిసర ప్రాంతాలలో ఆర్థిక వృద్ధి, పర్యాటక రంగం మరింత బలోపేతం కానున్నాయి.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More