శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం అప్డేట్ ఇచ్చింది. శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో మార్చి 19న ఉగాది ఆస్థానాన్ని నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో మార్చి 17వ తేదీ మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది.

ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నేపథ్యంలో మార్చి 17వ తేదీన పలు సేవలు రద్దు కానున్నాయి.
బ్రేక్ దర్శనాలు రద్దు…
మార్చి 17వ తేదీన వీఐపీ బ్రేక్ దర్శనాలు, అష్టదళ పాదపద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది. 16వ తేది ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించబడవని పేర్కొంది.
మార్చి 19న ఉగాది ఆస్థానం సందర్భంగా ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా విఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేయడమైనది. ఈ కారణంగా మార్చి 18వ తేది విఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించబడవు.
మార్చి నెలలో తిరుమలలో నిర్వహించే విశేష పర్వదినాల వివరాలను కూడా టీటీడీ ప్రకటించింది. మార్చి 27న శ్రీరామనవమి ఆస్థానం ఉంటుందని వివరించింది.మార్చి 30న తిరుమల శ్రీవారి వసంతోత్సవాలు ప్రారంభమవుతాని పేర్కొంది.
- మార్చి 15న వైష్ణవ ఏకాదశి.
- మార్చి 19న శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం
- మార్చి 27న శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానం.
- మార్చి 28న శ్రీరామ పట్టాభిషేక ఆస్థానం.
- మార్చి 30న తిరుమల శ్రీవారి వసంతోత్సవాలు ప్రారంభం.