తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తోందని టీటీడీ ఛైర్మన్ బీఆర్.నాయుడు తెలిపారు. తిరుమల అన్నమయ్య భవన్లో బుధవారం ఛైర్మన్ అధ్యక్షతన టీటీడీ పాలక మండలి సమావేశం జరిగింది. అనంతరం సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలను టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్రతో కలిసి ఛైర్మన్ మీడియాకు వెల్లడించారు.

సెప్టెంబర్ 15న రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారని టీటీడీ పేర్కొంది. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు తెలిపారు.
టీటీడీ నిర్ణయాలు
తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 15 నుంచి 23వ తేదీ వరకు నిర్వహించనున్నాం. అక్టోబర్ 12 నుంచి 20వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.
ఈ నెల 14వ తేదీ సాయంత్రం 7 గంటలకు అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. సెప్టెంబర్ 15న సాయంత్రం 5.30 నుంచి రాత్రి 7 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణం నిర్వహిస్తాం.
అదే రోజు రాత్రి 9 గంటలకు శ్రీ స్వామివారి పెద్దశేష వాహన సేవలో ముఖ్యమంత్రి పాల్గొంటారు.
రిలయన్స్ సంస్థ టీటీడీకి విరాళంగా అందించిన 25 ఎలక్ట్రిక్ బస్సులను సెప్టెంబర్ 16న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. అదే కార్యక్రమంలో 2027 సంవత్సరానికి సంబంధించిన టీటీడీ క్యాలెండర్లు, డైరీలను ముఖ్యమంత్రి ఆవిష్కరిస్తారు.
భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రతిరోజూ 10 లక్షల లడ్డూలను అందుబాటులో ఉంచుతున్నాం. బ్రహ్మోత్సవాల్లో దేశవ్యాప్తంగా 25 రాష్ట్రాలతో పాటు సింగపూర్, జర్మనీ దేశాల నుంచి కళాకారులు పాల్గొననున్నారు.
భక్తుల భద్రతకు 3,000 మంది పోలీసులతో పాటు 2,500 మంది టీటీడీ నిఘా, భద్రతా సిబ్బందిని అందుబాటులో ఉంచుతున్నాం. తిరుమలలో పారిశుద్ధ్య నిర్వహణను మరింత మెరుగుపరిచేందుకు 3,000 నుంచి 3,300 మంది సిబ్బందిని నియమిస్తున్నాం.
{{/usCountry}}భక్తుల భద్రతకు 3,000 మంది పోలీసులతో పాటు 2,500 మంది టీటీడీ నిఘా, భద్రతా సిబ్బందిని అందుబాటులో ఉంచుతున్నాం. తిరుమలలో పారిశుద్ధ్య నిర్వహణను మరింత మెరుగుపరిచేందుకు 3,000 నుంచి 3,300 మంది సిబ్బందిని నియమిస్తున్నాం.
{{/usCountry}}ఈ ఏడాది గరుడసేవకు గతేడాదితో పోలిస్తే 15 నుంచి 20 శాతం మంది భక్తులు అదనంగా వచ్చే అవకాశం ఉంది. అందుకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం.
గరుడసేవ రోజున గతేడాది 6.13 లక్షల మందికి అన్నప్రసాదం అందించగా, ఈసారి 9.30 లక్షల మందికి అన్నప్రసాదం అందించేలా ఏర్పాట్లు చేస్తున్నాం. ఇది గతేడాదితో పోలిస్తే 52 శాతం అదనం. లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున జిల్లా యంత్రాంగంతో సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం.
దర్శనం, వసతి, అన్నప్రసాదం, రవాణా, భద్రత, వైద్యం, పారిశుద్ధ్యం, విద్యుత్, పుష్పాలంకరణలు తదితర అన్ని విభాగాల్లో పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. ప్రతి భక్తుడికి సౌకర్యవంతమైన దర్శనం, సురక్షితమైన వాతావరణం, మెరుగైన వసతులు కల్పించడమే టీటీడీ ప్రధాన లక్ష్యంగా పనిచేస్తోంది.
భక్తులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా టీటీడీ, పోలీస్, జిల్లా యంత్రాంగం సమన్వయంతో పటిష్టమైన, సమగ్ర ఏర్పాట్లు చేపట్టింది. శ్రీవారి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విజయవంతంగా నిర్వహించేందుకు టీటీడీ సిద్ధంగా ఉంది.
భక్తులు, ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ, తిరుమలలో ప్రమాదవశాత్తు మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు అందించే బీమాను రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచేందుకు నిర్ణయం తీసుకున్నాం.
శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు తిరుమలలో సహజ మరణం సంభవించిన సందర్భంలో లైఫ్ ఇన్సూరెన్స్ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించాం. ఈ విధానాన్ని దేశంలోనే తొలిసారిగా ఆలయాల పరిపాలనలో టీటీడీ ప్రవేశ పెట్టింది. ఈ పథకం ద్వారా మరణించిన భక్తుని కుటుంబానికి రూ.2 లక్షలు చెల్లిస్తారు.
పదవీ విరమణ పొందిన CPS/NPS పెన్షనర్లు, వారి కుటుంబాలకు OPS/పెన్షనర్లు తరహాలో EHF సౌకర్యం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది టీటీడీ.
తిరుమలలోని అన్నప్రసాద కేంద్రం, క్యాంటీన్లు, హోటళ్ల నుంచి వచ్చే ఆహార వ్యర్థాలను విభాగాలుగా విభజించి వాటర్ హైడ్రాలసిస్ ప్రక్రియ ద్వారా బయోగ్యాస్ తయారు చేసి టీటీడీ అన్నప్రసాద కేంద్రానికి సరఫరా చేసేందుకు IOCL సంస్థ ముందుకు వచ్చింది. ఇందుకోసం బయోగ్యాస్ ప్లాంట్ నిర్వహణను రూ.2.80 కోట్లతో M/s GPS Renewablesకు అప్పగించేందుకు ఆమోదం తెలిపాం.
శ్రీవారి పోటులో లడ్డూల తయారీని మరింత వేగవంతం చేసేందుకు 400 మంది అదనపు అవుట్సోర్సింగ్ వర్కర్ల పోస్టుల కోసం ప్రభుత్వ అనుమతికి ప్రతిపాదనలు పంపుతున్నాం. టీటీడీలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 48 మంది ఉద్యోగుల వేతనాలను పెంచేందుకు నిర్ణయం తీసుకున్నాం.
తిరుమలలో పారిశుద్ధ్య నిర్వహణను మరింత మెరుగుపరిచేందుకు అదనపు సిబ్బందికి తిరుమలకు రవాణా ఛార్జీలు చెల్లించేందుకు నిర్ణయించాం. ఇందుకోసం 3 సంవత్సరాలకు రూ.1.60 కోట్లు మంజూరు చేశాం. నారాయణవనంలోని శ్రీ పద్మావతి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో అమ్మవారి పద్మపీఠానికి బంగారు తాపడం ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపాం.
చెన్నైలోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ ధ్వజస్తంభం, బలిపీఠానికి బంగారు తాపడం చేసేందుకు రూ.17.05 కోట్లకు ఆమోదం తెలిపాం. తిరుపతిలో తెలుగు, సంస్కృత అకాడమీకి కేటాయించిన టీటీడీ భవనం లైసెన్సు గడువును మరో మూడేళ్లపాటు, అంటే 02-11-2026 నుంచి 01-11-2029 వరకు పొడిగించేందుకు ఆమోదం తెలిపాం.
ఈ సమావేశంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, బోర్డు సభ్యులు, జేఈవోలు డా.ఎ.శరత్, ప్రభల గోపినాథ్, సివిఎస్వో కే వి మురళీకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.