క్రమంగా బలహీనపడుతున్న 'మొంథా' తీవ్ర తుఫాన్ - ఇవాళ కూడా భారీ వర్షాలు, విద్యాసంస్థలకు సెలవులు పొడిగింపు

'మొంథా' తీవ్ర తుపాన్ క్రమంగా బలహీనపడుతోంది. రానున్న 6 గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలహీన పడే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఇవాళ కూడా ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే సూచనలున్నాయని తెలిపింది. 

Published on: Oct 29, 2025, 09:25:39 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మొంథా తీవ్ర తుఫాన్ దాటికి ఏపీ వణికిపోతోంది. గడిచిన మూడు నాలుగు రోజులుగా తీరంలో అలలు తీవ్రస్థాయిలో ఎగిసిపడుతున్నాయి. తీవ్ర తుఫాన్ ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా… విద్యా సంస్థలు కూడా మూసివేశారు. మంగళవారం రాత్రి మొంథా తీవ్ర తుఫాన్ తీరాన్ని తాకగా… క్రమంగా బలహీనపడుతోంది. ప్రస్తుతానికి తీవ్ర తుఫాన్…. తుపానుగా బలహీనపడిందని వాతావరణశాఖ పేర్కొంది.

క్రమంగా బలహీనపడుతున్న 'మొంథా'
క్రమంగా బలహీనపడుతున్న 'మొంథా'

రానున్న 6 గంటల్లో తుఫాన్…. తీవ్ర వాయుగుండంగా బలహీన పడే అవకాశం ఐఎండీ అంచనా వేసింది. దీని ప్రభావంతో ఇవాళ రాష్ట్రంలో విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడే సూచనలున్నాయి. కోస్తాంధ్రలో ఈదురుగాలులు వీస్తుండగా… ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొన్న వివరాల ప్రకారం… ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం అవకాశం ఉంది.

ఇక ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ భారీవర్షాలు పడొచ్చు. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ప్రకాశం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీవర్షాలు సూచనలున్నాయి. నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీవర్షాలు పడొచ్చు.

సెలవులు పొడిగింపు…!

ఏపీలో విద్యాసంస్థలకు ఈ నెల 31 వరకు సెలవులు పొడగించారు. మొంథా తుఫాన్ ప్రభావం, భారీ వర్షాలతో సెలవులు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముందుగా తీసుకున్న నిర్ణయం ప్రకారం.. ఈనెల 30 వరకు మాత్రమే మూసివేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఈనెల 31వ తేదీ వరకు మూసివేయాలని సర్కార్ నిర్ణయించింది.

మరోవైపు మొంథా తుఫాన్ కారణంగా వేటకు వెళ్లకుండా ఉపాధి కోల్పోయిన మత్స్యకార కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వ సాయం చేయనుంది. ఒక్కో మత్స్యకార కుటుంబానికి 50 కేజీల చొప్పున బియ్యం ఇవ్వాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. గత 5 రోజులుగా సముద్రంలో వేటకు వెళ్లక జీవనోపాధి కోల్పోయిన కుటుంబాలను ఆదుకోవాలని సూచించారు.

తుఫాను ప్రభావం ఉన్న గ్రామ-వార్డు సచివాలయాల సిబ్బందితో ఆర్టీజీఎస్ నుంచి సీఎం చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లోనూ తుఫాన్‌ ప్రభావం కనిపిస్తోందన్నారు. భీకర గాలులతో పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి... వాటిని ఎప్పటికప్పుడు తొలిగిస్తున్నామని చెప్పారు. బాధితులకు తక్షణ సాయం అందేలా గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది చూడాలని ఆదేశించారు. విద్యుత్ సరఫరా నిలిచిపోయిన చోట, వెంటనే పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More