ఏపీలో SIR ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల.. పేరు మిస్ అయితే మళ్లి నమోదుకు అవకాశం

ఆంధ్రప్రదేశ్‌లో సర్ ముసాయిదా ఓటరు జాబితా విడుదలైంది. సుమారు 45 లక్షల ఓట్లను తొలగించారు. నిజమైన ఓటర్లు మళ్లీ నమోదు చేసుకునేందుకు అవకాశం ఉంది.

Published on: Jul 31, 2026, 16:26:53 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియను పూర్తి చేసిన భారత ఎన్నికల సంఘం ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసింది. ఈ సవరణలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 45 లక్షల మంది ఓట్లను జాబితా నుంచి తొలగించినట్లు అధికారులు వెల్లడించారు.

ఏపీలో సర్ ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల
ఏపీలో సర్ ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల

తొలగించిన ఓట్లలో శాశ్వతంగా నివాసాలు మార్చినవారు లేదా అందుబాటులో లేనివారు 22.30 లక్షల మంది ఉన్నారు. అలాగే మృతి చెందిన 15.22 లక్షల మంది పేర్లను, ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓట్లు కలిగి ఉన్న 7.37 లక్షల మంది పేర్లను జాబితా నుంచి తొలగించారు.

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (CEO) వివేక్ యాదవ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో 3.71 కోట్ల మంది ఓటర్ల (89.22 శాతం) నుంచి ఎన్యుమరేషన్ ఫారాలను సేకరించారు.

బూత్ స్థాయి అధికారులు (BLOలు) సంప్రదించినప్పుడు అందుబాటులో లేనివారు, ఇతర రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాలకు వలస వెళ్లినవారు, ఉనికిలో లేనివారు, జూలై 24 నాటికి ఫారాలు సమర్పించని వారు లేదా వివిధ కారణాల వల్ల నమోదు చేసుకోవడానికి ఇష్టపడని మిగిలిన ఓటర్ల (44.89 లక్షల మంది) పేర్లను తొలిగించాల్సి వచ్చింది. రాష్ట్రంలో జూన్ 15 నుండి జూలై 24 వరకు SIR ప్రక్రియ అత్యంత పకడ్బందీగా కొనసాగింది.

జూలై 24 నాటికి ఉన్న 4,16,27,694 మంది ఓటర్లలో, మొత్తం 3,71,38,182 మంది ఓటర్లు తమ ఎన్యుమరేషన్ ఫారాలను సమర్పించారని, ఈ ప్రక్రియలో ప్రజల భాగస్వామ్యం అద్భుతంగా ఉందని సీఈఓ తెలిపారు.

ఓటరు జాబితాలో పేర్ల చేర్పునకు మరో అవకాశం

అర్హత ఉండి తొలగించిన నిజమైన ఓటర్లు ఎవరైనా ఉంటే, వారు జూలై 31 నుండి ఆగస్టు 30 వరకు జరిగే అభ్యంతరాలు, దాఖలాల కాలంలో ఫారం-6తో పాటు నిర్దేశిత డిక్లరేషన్ ఫారమ్‌ను సమర్పించి మళ్లీ ఓటరు జాబితాలో పేరును జోడించుకోవచ్చని సీఈఓ స్పష్టం చేశారు. ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓట్లు ఉన్నవారి పేర్లను కేవలం ఒక్కచోట మాత్రమే ఉంచుతామని తెలిపారు.

రాష్ట్రంలోని మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారుల ఆధ్వర్యంలో జూలై 31 ముసాయిదా ఓటర్ల జాబితా విడుదలయింది.

షెడ్యూల్ వివరాలు

దాఖలాలు, అభ్యంతరాల స్వీకరణ జూలై 31 నుండి ఆగస్టు 30 వరకు ఉంటుంది. దరఖాస్తుల పరిశీలన, పరిష్కారం జూలై 31 నుండి సెప్టెంబర్ 28 వరకు నిర్వహిస్తారు. తుది ఓటర్ల జాబితా విడుదల అక్టోబర్ 3న ప్రకటిస్తారు.

రాష్ట్రంలోని 28 జిల్లాల కలెక్టర్లు, 175 మంది EROలు, 1,079 మంది AEROలు, 4,650 మంది BLO సూపర్‌వైజర్లు, 46,397 పోలింగ్ కేంద్రాల్లో నియమించిన 46,397 మంది BLOల సమన్వయంతో ఈ ఎన్యుమరేషన్ ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది. రాజకీయ పార్టీలు కూడా ఈ ప్రక్రియలో చురుగ్గా పాల్గొని మొత్తం 1,27,868 మంది బీఎల్ఏలను నియమించాయి. SIR ప్రారంభ సమయంలో ఏపీలో 68,868 BLAలు మాత్రమే ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్య పెరగడం విశేషం.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More