CUET PG 2026 : సీయూఈటీ పీజీ దరఖాస్తు గడువు పొడిగించిన ఎన్టీఏ.. చివరి తేదీ ఇదే

సీయూఈటీ పీజీకి దరఖాస్తు చేసుకునే గడువును నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పొడిగించింది. సీయూఈటీ పీజీకి ఇంకా దరఖాస్తు చేసుకోని అభ్యర్థులకు రెండో అవకాశం దొరికినట్టైంది. వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ ఇటీవల నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

Published on: Jan 15, 2026, 22:14:52 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సీయూఈటీ పీజీ 2026-27కి దరఖాస్తు చేసుకునే గడువును నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పొడిగించింది. సీయూఈటీ పీజీకి ఇంకా దరఖాస్తు చేసుకోని అభ్యర్థులకు రెండో అవకాశం ఇచ్చారు. ఎన్టీఏ అధికారిక నోటిఫికేషన్ ప్రకారం, అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్‌ ప్రకారం ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ జనవరి 14వ తేదీ రాత్రి 11.50 గంటలతో ముగిసింది. జనవరి 20, 2026 వరకు దరఖాస్తు గడువును పొడిగించారు. అలాగే జనవరి 23 నుంచి 25 వరకు దిద్దుబాట్లు చేసుకునే అవకాశం అభ్యర్థులకు ఇచ్చింది.

సీయూఈటీ పీజీ దరఖాస్తు గడువు పొడిగింపు
సీయూఈటీ పీజీ దరఖాస్తు గడువు పొడిగింపు

CUET PG 2026 కోసం దరఖాస్తు చేయడానికి, అభ్యర్థులు మొదట అధికారిక పోర్టల్‌లో నమోదు చేయాలి. రిజిస్ట్రేషన్ తరువాత వారు లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌ను అందుకుంటారు. దీనిని ఉపయోగించి దరఖాస్తు ఫారమ్ పూరించవచ్చు.

గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసినవారు లేదా ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తు సమయంలో అభ్యర్థులు తమ వ్యక్తిగత, విద్యా సమాచారంతో పాటు స్కాన్ చేసిన ఫోటోగ్రాఫులు, సంతకాలు, అవసరమైన సర్టిఫికెట్లను (కేటగిరీ సర్టిఫికెట్లు వంటివి) అప్‌లోడ్ చేయాలి.

CUET PG 2026 మూడు షిఫ్టులలో నిర్వహిస్తారు. పరీక్షకు 90 నిమిషాల సమయం ఇస్తారు. సీయూఈటీ పీజీ పరీక్షను 157 సబ్జెక్టులకు నిర్వహిస్తారు. 292 నగరాలు, 16 అంతర్జాతీయ ప్రదేశాలలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) మోడ్‌లో పరీక్ష నిర్వహించనున్నారు.

దరఖాస్తు ఫీజు జనరల్ కేటగిరీ అభ్యర్థులు రెండు పేపర్లకు రూ.1400 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఒక్కో అదనపు పేపర్‌కు రూ.700 ఫీజు విడిగా చెల్లించాలి. ఓబీసీ-ఎన్సీఎల్, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు రెండు పేపర్లకు రూ.1200 ఫీజు చెల్లించాలి. ఒక్కో పేపర్ కు రూ.600 అదనపు ఫీజు విడిగా చెల్లించాల్సి ఉంటుంది.

ఎస్సీ, ఎస్టీ, థర్డ్ జెండర్లు రెండు పేపర్లకు రూ.1100 ఫీజు చెల్లించాలి. ఒక్కో పేపర్ కు రూ.600 అదనపు ఫీజు విడిగా చెల్లించాల్సి ఉంటుంది.

దివ్యాంగ కేటగిరీ అభ్యర్థులు రెండు పేపర్లకు రూ.1000 ఫీజు చెల్లించాలి. ఒక్కో పేపర్ కు రూ.600 అదనపు ఫీజు విడిగా చెల్లించాల్సి ఉంటుంది. దేశం వెలుపల నుంచి వచ్చే అభ్యర్థులు రెండు పేపర్లకు రూ.7000 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి అదనపు పేపర్‌కు రూ .౩5౦౦ రుసుము విడిగా చెల్లించాలి.

రాత పరీక్ష మెుత్తం 74 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలకు ఉంటుంది. ప్రతీ ప్రశ్నకు 4 మార్కులు కేటాయిస్తారు. వ్యవధి 90 నిమిషాలు, నెగటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More