ఆలయ ఆచార వ్యవహారాల్లో అధికారులు వేలు పెట్టొద్దు.. దేవాదాయ శాఖ మంత్రి క్లారిటీ

ఆలయాల్లో సామాన్య భక్తులకు మొదట ప్రాధాన్యత ఇవ్వాలని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. భక్తులు భద్రత విషయంలో, సౌకర్యవంతమైన దర్శనం అందించడంలో రాజిపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

Published on: Feb 10, 2026 6:43 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రానున్న మహా శివరాత్రి పర్వదినాన్ని దృష్టిలో పెట్టుకుని శ్రీశైలం సహా వివిధ శైవ క్షేత్రాల్లో భక్తుల రద్దీ, వసతులు, ఏర్పాట్లపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న శైవ క్షేత్రాలతో పాటు శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవస్థానం, శ్రీకాళహస్తి, కోటప్పకొండ వంటి ప్రధాన ఆలయాల్లో భక్తుల రద్దీ, సౌకర్యాలపై మంత్రి ఆనం మాట్లాడారు. దేవాదాయ శాఖ అధికారులు, జిల్లా యంత్రాంగం తీసుకోవాల్సిన చర్యలు, కల్పించాల్సిన సౌకర్యాలపై సూచనలు చేశారు.

అధికారులకు మంత్రి ఆనం కీలక ఆదేశాలు
అధికారులకు మంత్రి ఆనం కీలక ఆదేశాలు

మహా శివరాత్రి నాటికి అన్ని శైవ క్షేత్రాల్లో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉన్నందున పటిష్ట చర్యలు తీసుకోవాలని మంత్రి ఆనం అధికారులను ఆదేశించారు. దేవాదాయ శాఖ, పోలీస్ శాఖ, జిల్లా కలెక్టర్లు పూర్తి సమన్వయంతో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఏర్పాట్లు, వసతులపై నిరంతర పర్యవేక్షణ చేయాలని సూచించారు.

'భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముఖ్యంగా దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు త్వరితగతిన దర్శనం పూర్తయ్యేలా చూడాలి. వసతి సదుపాయాలు సకాలంలో లభించేలా కార్యచరణ అమలు చేయాలి. దీక్షలు, మాలధారణలతో ఎంతో కష్టపడి ఆలయాలకు వచ్చే భక్తులను అగౌరవపరిచేలా లేదా ఇబ్బందులకు గురిచేసేలా ఎవరూ వ్యవహరించకూడదు.' అని మంత్రి ఆనం అన్నారు.

రోజురోజుకూ ఆలయాల్లో పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని, మహా శివరాత్రి వంటి కీలక సందర్భాల్లో అన్ని విభాగాలు పూర్తి సమన్వయంతో పనిచేయాలని మంత్రి ఆనం పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల నిర్వహణలో దేవాదాయ శాఖ బాధ్యత మరింత ఎక్కువగా ఉంటుందని తెలిపారు. భక్తులకు గౌరవ మర్యాదల విషయంలో, సౌకర్యవంతమైన దర్శనం ఏర్పాట విషయంలో రాజిపడే ప్రసక్తి లేదని మంత్రి ఆనం స్పష్టం చేశారు.

అలాగే ఆలయ ఆచార వ్యవహారాల్లో అధికారులు జోక్యం చేసుకోరాదని మంత్రి ఆనం క్లారిటీ ఇచ్చారు. పారిశుధ్య పనులు నిరంతరం చేపట్టి ఆలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, భక్తులకు అవసరమైన పాలు, బిస్కెట్లు, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.

భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, రద్దీ నియంత్రణకు స్పష్టమైన ప్రణాళికలు అమలు చేయాలని చెప్పారు. ప్రసాదం పంపిణీ ఎక్కడా ఆలస్యం కాకుండా సక్రమంగా జరగాలని ఆదేశించారు. పారిశుధ్య పనులు ఎప్పటికప్పుడు చేపట్టి ఆలయాల్లో పరిశుభ్ర వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. మహా శివరాత్రి ఏర్పాట్లలో టెంపుల్ ఆఫీసర్లు, ఫెస్టివల్ ఆఫీసర్లు వీఐపీలతో పాటు సామాన్య భక్తులకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలని, వారికి కేటాయించిన సమయాల్లో దర్శన ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆనం సూచించారు.