ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రాబోయే రెండు రోజుల పాటు వాతావరణంలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. రాష్ట్రంలో ఇవాళ, రేపు (సెప్టెంబర్ 4, 5) మేఘావృతమైన వాతావరణం నెలకొనడంతో పాటు అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) వివరాల ప్రకారం… వర్షం కురిసే సమయంలో గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. అకస్మాత్తుగా వీచే గాలులు, పిడుగుల ధాటికి చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలే ప్రమాదం ఉన్నందున వర్షం పడే సమయంలో ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలి.
పిడుగులు పడే ముప్పు ఉన్నందున వ్యవసాయ పనుల్లో ఉండే రైతులు, కూలీలు, పశువుల కాపరులు తీవ్ర అప్రమత్తత పాటించాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. వర్షం వచ్చే సూచనలు కనిపించగానే పొలాల్లోని చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద లేదా బహిరంగ ప్రదేశాల్లో నిలబడకూడదని స్పష్టం చేసింది. సురక్షితమైన భవనాలు లేదా పాకల్లో ఆశ్రయం పొందాలని హెచ్చరించింది.
కొన్ని ప్రాంతాల్లో పెరగనున్న ఎండలు
ఒకవైపు తేలికపాటి వర్ష సూచన ఉన్నప్పటికీ… ఏపీలోని మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం ఎండల తీవ్రత కొనసాగే అవకాశం ఉంది. రాబోయే రెండు రోజుల్లో వివిధ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉంది. ఉక్కపోత, వేడిగాలుల పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
తెలంగాణ వెదర్ రిపోర్ట్ :
మరోవైపు తెలంగాణలో కూడా రాబోయే రోజుల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్ నగరంలో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉండి…. సాయంత్రం లేదా రాత్రి వేళల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. నగరంలో గరిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యే అవకాశం ఉంది.