తిరుమల కల్తీ నెయ్యి కేసులో త్వరలో ఛార్జిషీట్ దాఖలు చేయనున్న సిట్!
తిరుమల వెంకన్న స్వామి లడ్డూ ప్రసాదం తయారీకి వినియోగించిన నెయ్యి కల్తీ కేసులో సీబీఐ నేతృత్వంలోని సిట్ దర్యాప్తును వేగవంతం చేసింది. మరికొన్ని రోజుల్లో రెండో ఛార్జిషీట్ దాఖలు చేసే అవకాశం ఉంది.
తిరుమల లడ్డూ ప్రసాదంలో నెయ్యి కల్తీ జరిగిందనే ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్న సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందం జనవరి చివరి నాటికి రెండో ఛార్జిషీట్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఏడాదికి పైగా కొనసాగుతున్న దర్యాప్తు చివరి దశకు చేరుకుంది. ఆధారాల సేకరణ, వాంగ్మూలాల నమోదు, పత్రాల పరిశీలన వంటి కీలక ప్రక్రియలు చాలావరకు పూర్తయ్యాయి. ప్రస్తుతం సిట్ తుది చట్టపరమైన పరిశీలన, డాక్యుమెంటేషన్ పనిలో నిమగ్నమై ఉందని తెలుస్తోంది. రాబోయే రెండు వారాల్లో నెల్లూరు ఏసీబీ కోర్టులో అనుబంధ ఛార్జిషీట్ దాఖలు చేయనుంది.

సీబీఐ జాయింట్ డైరెక్టర్ వీరేష్ ప్రభు గత వారం తిరుపతిలోని ఎస్ఐటీ కార్యాలయాన్ని సందర్శించి ఎస్ఐటీ అధికారులతో సమావేశం నిర్వహించారు. దర్యాప్తు పురోగతిని, కేసు ఫైళ్లను పరిశీలించారు. ఈ సమావేశంలో గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ్ త్రిపాఠి, విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి, డీఐజీ మురళీ రాంబా, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సలహాదారు సత్యేన్ కుమార్ పాండా తదితరులు పాల్గొన్నారు.
ఈ కేసులో సిట్ ఇప్పటివరకు 36 మందిని నిందితులుగా పేర్కొంది. ఇందులో చాలా మందిని అరెస్టు చేయగా, మరికొందరిని నోటీసులు జారీ చేసి కస్టడీలో ప్రశ్నించారు. కల్తీ నెయ్యి సరఫరాకు అనుమతులు మంజూరు చేయడంలో కొంతమంది టీటీడీ అధికారులు, డెయిరీ నిపుణులు కుట్ర పన్నారని దర్యాప్తులో తేలింది. ఈ కేసులో ఏ-34గా ఉన్న విజయభాస్కర్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను ఇటీవల నెల్లూరు ఏసీబీ కోర్టు ప్రాసిక్యూషన్ సమర్పించిన వాదనలతో ఏకీభవించి కొట్టివేసింది.
కేసు కీలక దశలోకి అడుగుపెడుతున్న తరుణంలో కొంతమంది వ్యక్తుల అరెస్టును కూడా సిట్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చర్యల తర్వాత సమగ్ర ఛార్జ్ షీట్ దాఖలు చేస్తామని, ఆ తర్వాత దర్యాప్తుపై వివరణాత్మక నివేదికను సీల్డ్ కవర్లో సుప్రీంకోర్టుకు సమర్పిస్తామని అధికారులు చెబుతున్నారు.
లడ్డూ ప్రసాదం తయారీకి వినియోగించిన నెయ్యిలో కల్తీ జరిగిందని ఇప్పటికే అధికారులు గుర్తించారు. ఈ కేసును సిట్ దర్యాప్తును వేగవంతం చేసింది. ఆ సమయంలో టీటీడీ ఛైర్మన్గా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డితోపాటుగా కొందరు బోర్డు సభ్యులను సిట్ విచారణ చేసింది. టీటీడీకి కోట్ల రూపాయల నష్టం జరిగినట్టుగా ఇప్పటికే సిట్ కోర్టుకు తెలిపింది. మరికొన్ని అరెస్టు ఉంటే.. ఎవరిని చేస్తారనే విషయంపై ఆసక్తి నెలకొంది.

E-Paper












