తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి బస్టాండ్ వరకూ స్కైవాక్.. కీలక విషయాలు వెల్లడించిన సీఎం
తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి బస్టాండ్ వరకూ స్కైవాక్ ప్లాన్ చేస్తున్నట్టుగా ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. తిరుమలలో కీలక విషయాలను తెలిపారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో సుధర్మ సమావేశ మందిరంలో మీడియా ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, అనగాని సత్య ప్రసాద్, టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర, జిల్లా కలెక్టర్ డాక్టర్ వేంకటేశ్వర్, టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, టీటీడీ జేఈవోలు డా ఎ. శరత్, గోపీనాథ్, ఎస్పీ సుబ్బరాయుడు, సీవీఎస్వో కే.వి మురళీకృష్ణ ఇతర ప్రజా ప్రతినిధులు, టీటీడీ బోర్డు సభ్యులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి బస్టాండ్ వరకూ లింక్ చేసేలా స్కైవాక్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఉందని సీఎం చంద్రబాబు చెప్పారు. త్వరలోనే కేంద్ర సహకారంతో ఈ ప్రాజెక్టు చేపడతామన్నారు. తిరుపతి లో ఇటీవల సేకరించిన 50 ఎకరాల్లో మల్టీస్టోరీ పార్కింగ్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నామన్నారు. ఉద్యోగులకు ఇంటి జాగాలకు సంబందించి, మౌలిక సదుపాయాలు కల్పనకు రూ.230 కోట్లు వ్యయం అవుతుందన్నారు.
త్వరలోనే తిరుపతిని వివిధ హైవేలకు కనెక్టు చేసేలా కార్యాచరణ చేపడతామని చంద్రబాబు చెప్పారు. తిరుపతి కేంద్రంగా పెద్ద ఎత్తున ఎకనామిక్ యాక్టివిటీ జరగాలని సీఎం ఆకాంక్షించారు. శ్రీవారిని దర్శించుకోడానికి వచ్చే వారితో తిరుమల తిరుపతి సర్వీస్ హబ్గా మారుతుందన్నారు. తిరుమలతో పాటు తిరుపతిలోనూ శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవం కనపడాలన్నారు. ఆధ్యాత్మికంగా ప్రజల్ని కలిపేందుకు ఈ ఉత్సవాలు అత్యంత కీలకమని చెప్పారు..
'తిరుమలలో జరిగే కల్యాణాలకు అత్యంత విశిష్టత ఉంటుంది. వెడ్డింగ్ డెస్టినేషన్గా తిరుపతిని మార్చాలన్నది మా ఆలోచన. తిరుపతి, తిరుమల అంతా నెట్జీరో కాన్సెప్ట్ విధానంలోనే కార్యకలాపాలు నిర్వహించాలి. సౌర, పవన విద్యుత్ తో పాటు బ్యాటరీ స్టోరేజి ద్వారా విద్యుత్ ఉత్పత్తి జరగాలి. ప్రతీ టీటీడీ భవనంపైనా సౌరవిద్యుత్ ప్యానళ్లు ఏర్పాటు చేయాలని సూచిస్తున్నా. ప్రస్తుతం కోటి యూనిట్లు ఉత్పత్తి చేస్తుంటే 10 కోట్ల యూనిట్లు టీటీడీ వినియోగిస్తోంది.' అని చంద్రబాబు అన్నారు.
ఉత్పత్తి అయ్యే వ్యర్ధాలు సర్క్యులర్ ఎకానమీకి వెళ్లే విధంగా చర్యలు చేపట్టాలని చంద్రబాబు అన్నారు. పర్యావరణాన్ని కాపాడుకునేలా జీరో వేస్ట్ విధానం అమలు కావాలన్నారు. ఓ మోడల్ గా తిరుమల అభివృద్ధి కావాలని చెప్పారు. దేశంలోని అన్ని దేవాలయాల కంటే తిరుమల తిరుపతి అత్యంత పరిశుభ్రంగా చక్కటి నిర్వహణలో ఉందని కొనియాడారు.
'2300 ఏళ్ల నుంచి ఉన్న ఈ దేవాలయం ప్రపంచంలోనే అత్యుత్తమ దేవాలయంగా ఉండాలి. అత్యంత సేవాభావంతో నిర్వహిస్తున్నాం కాబట్టే దేశవ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా భక్తులు ఇక్కడికి వస్తున్నారు. టీటీడీలో ఎస్వీ అన్నదానం ట్రస్ట్కు దాదాపు రూ.3,165 కోట్లు కార్పస్ ఫండ్ ఉంది. భవిష్యత్తులో అన్నప్రసాదాలు మరింత మెరుగ్గా అందించేలా చర్యలు తీసుకోవాలి. ప్రాణదానం ట్రస్ట్ క్రింద రోగులకు మరింత నాణ్యమైన వైద్య సేవలు అందాలి. స్విమ్స్, బర్డ్, రుయా, సెంట్రల్ హాస్పెటల్, కార్డియాలజీ ఆసుపత్రులను అనుసంధానం చేసే దిశగా అధికారులకు సూచించాం. వీటితో పాటు మానవ సేవయే మాధవ సేవ అన్నట్లు శ్రీవారి వైద్య సేవలను విరివిగా అందించేలా పటిష్ట చర్యలు చేపట్టాం.' అని చంద్రబాబు చెప్పారు.
శ్రీవారి సేవలో కల్చరల్ ప్రోగ్రాంలు, కల్చరల్ వింగ్లను ఏర్పాటు చేయమన్నామని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. టీటీడీ విద్యాసంస్థల్లో ముఖ్యంగా పాలిటెక్నిక్ కళాశాలలో స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేసి ఉపాధికి శిక్షణ ఇస్తున్నట్టుగా చెప్పారు. వృక్ష గోవిందం కార్యక్రమంలో భాగంగా చెట్లు నాటే కార్యక్రమాన్ని రూపొందించామన్నామని తెలిపారు.
తిరుపతిని ఆధ్యాత్మిక హబ్ గా మార్చేలా ప్రణాళికలు చేస్తున్నట్టుగా సీఎం చంద్రబాబు ప్రకటించారు. దాదాపు 5 వేల ఆలయాలను నిర్మాణం, ఉన్న ఆలయాలకు అవసరమైన చోట పునర్ నిర్మాణం చేసేలా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించామన్నారు. శిష్ట రక్షణ- దుష్ట శిక్షణ అనేది స్వామివారే చూసుకుంటారన్నారు.
టీటీడీ ఆధ్వర్యంలో ఉన్న 65 ఆలయాలను ఏ, బీ, సీ కేటగిరీలుగా విభజించి అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయమన్నామని, అదేవిధంగా శ్రీవారి ఆస్తులు, ఆభరణాలు, బంగారం, నిధులు, భూములు.. ఇలా అన్ని వివరాలు ఆన్లైన్లో ఉంచేలా చర్యలకు ఆదేశించామన్నారు.
'మారిషస్, న్యూజిలాండ్ లాంటి దేశాల్లో శ్రీవారి ఆలయాలు నిర్మించాలని అడుగుతున్నారు. దీని గురించి కూడా ఆలోచన చేస్తున్నాం. దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ శ్రీవారి ఆలయాలు నిర్మించాలని కోరుతున్నారు వచ్చే ఏడాదికి సోమశిలకు, ఆపై కండలేరు బాలాజి సాగర్కు నీరు తీసుకొస్తాం. వచ్చే ఏడాదికి కల్యాణి డ్యామ్కు కూడా నీటిని తరలిస్తాం. ఓ మారు తీవ్ర వర్షాభావం కారణంగా దేవాలయం మూసివేయాలన్న ప్రతిపాదన వచ్చింది. కల్యాణి డ్యామ్ నుంచి పైపులైన్ను వంద రోజుల్లో వేసి తిరుమలకు నీరు తరలించాం.' అని చంద్రబాబు గుర్తుచేశారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


