వేసవి ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్ - శ్రీకాకుళం రోడ్ మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించింది.ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటన విడుదల చేసింది.
వేసవి ప్రత్యేక రైళ్లు….

ఏప్రిల్ నుంచి జూన్ 28వ తేదీ వరకు ఈ వేసవి ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయి. ఏపీ, తెలంగాణలోని పలు రైల్వే స్టేషన్లలో ఈ ట్రైన్స్ ఆగుతాయి. ఈ రైళ్లలో ఏసీ 2 టైర్, ఏసీ 3 టైర్, స్లీపర్ మరియు జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లు ఉంటాయి.
దక్షిణ మధ్య రైల్వే ప్రకటనలోని వివరాల ప్రకారం…. సికింద్రాబాద్ నుంచి శ్రీకాకుళం రోడ్ వెళ్లే రైలు ( ట్రైన్ నెంబర్ 07425) ఏప్రిల్ 5వ తేదీ నుండి ప్రతి ఆదివారం రాత్రి 11:15 గంటలకు బయలుదేరుతుంది. ఇది మరుసటి రోజు సాయంత్రం 5:30 గంటలకు శ్రీకాకుళం రోడ్డుకు చేరుకుంటుంది. ఏప్రిల్ 5,12,18,26, మే 3,10, 17,24,31, జూన్ 7,14, 21,28 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. మొత్తం 13 ట్రిప్పుల పాటు ఈ సేవలు కొనసాగుతాయి.
ఇక తిరుగు ప్రయాణంలో శ్రీకాకుళం రోడ్ నుంచి సికింద్రాబాద్ వచ్చే రైలు ( ట్రైన్ నెంబర్ 07426) ప్రతి సోమవారం రాత్రి 7:30 గంటలకు బయలుదేరుతుంది. మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకుంటుంది.మొత్తం 13 సర్వీసులు అందుబాటులో ఉంటాయి.
ఆగే స్టేషన్లు ఇవే….
ఈ ప్రత్యేక రైళ్లు చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, తుని, ఎలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ, కొత్తవలస, విజయనగరం మరియు చీపురుపల్లి రైల్వే స్టేషన్లలో ఆగుతాయి. ఈ ప్రత్యేక రైళ్ల సేవలను ప్రయాణికులు వినియోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటన ద్వారా కోరింది.