జైలులో ప్రత్యేకంగా అంగన్వాడీ కేంద్రాలు.. అంతేకాదు ఏపీలో ఓపెన్ ఎయిర్ జైళ్లు
ఖైదీలకు క్షమాభిక్షపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని హోంమంత్రి అనిత అన్నారు. మరోవైపు సోషల్ మీడియాపై అసెంబ్లీలో చర్చ జరిగింది. ఇతర రాష్ట్రాలు, దేశాల్లో ఉన్న చట్టాలను పరిశీలిస్తున్నామని హోంమంత్రి అనిత చెప్పారు.
జైలులోని ఖైదీలకు క్షమాభిక్ష విషయంలో కూటమి ప్రభుత్వం సానుకూలంగా ఉందని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. జైళ్లు, సంస్కరణల చట్టం సవరణపై బిల్లును అసెంబ్లీలో హోంమంత్రి అనిత ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా హోం మంత్రి అనిత మాట్లాడుతూ.. ఖైదీల సంస్కరణల కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. కేంద్రం తెచ్చిన చట్టం మేరకు ఇక్కడ కూడా సంస్కరణలు అమలు చేస్తున్నామన్నారు. ఖైదీలు జైలులో ఉండి చదువుకునేలా అవకాశాలను మెరుగుపరుస్తున్నామని చెప్పారు.

ఖైదీల్లో పరివర్తన తీసుకురావటం కోసం చట్టంలో మార్పులు తీసుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. మహిళా ఖైదీల పిల్లల కోసం జైలులో ప్రత్యేకంగా అంగన్వాడీ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఖైదీల నేరచరిత్ర, ప్రవర్తన ఆధారంగా కేటగిరీలుగా విభజిస్తామని పేర్కొన్నారు. ఖైదీలు మారేందుకు, మానసిక పరివర్తన తెచ్చేలా ఓపెన్ ఎయిర్ జైళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఖైదీలు.. వ్యవసాయంతో పాటు ఇతర వృత్తులు నిర్వహించేలా చర్యలు చేపడతామన్నారు.
సోషల్ మీడియాపై చర్చ
సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాల నియంత్రణపై అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌతు శిరీష అడిగిన ప్రశ్నకు హోంమంత్రి అనిత సమాధానం ఇచ్చారు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాల కట్టడికి మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. ఇప్పటివరకు ఉపసంఘం రెండుసార్లు సమావేశమై వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు వెల్లడించారు. తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో అమలు చేస్తున్న చర్యలను సమీక్షించినట్లు చెప్పారు. మన రాష్ట్రంలో ఎలాంటి చర్యలు తీసుకుంటే సమర్థవంతంగా ఉంటాయన్న అంశంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు.
విద్వేషపూరిత, అసభ్య పోస్టుల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు సోషల్ మీడియా పోస్టులపై 1,384 కేసులు నమోదు చేసినట్లు మంత్రి వెల్లడించారు. ఇందులో 1,067 మందిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు వెల్లడించారు.
తప్పుడు ప్రచారాల కట్టడికి కొత్త చట్టం తీసుకురావడానికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించినట్లు మంత్రి అనిత పేర్కొన్నారు. అలాగే పాఠశాల విద్యార్థులు సోషల్ మీడియా వినియోగించకుండా చట్టం తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నట్లు హోంమంత్రి అనిత తెలిపారు.

E-Paper












