Andhrapradesh : విద్యార్థుల కోసం ప్రత్యేక డిజిటల్ హెల్త్ పోర్టల్ - దేశంలోనే తొలిసారి..! ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు
విద్యార్థుల కోసం ప్రత్యేక డిజిటల్ హెల్త్ పోర్టల్ ను ఏపీ సర్కార్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆరోగ్య సంరక్షణ, శారీరక మార్పులు, మానసిక వికాసం, హెచ్ఐవీ వంటి అంశాలపై పోర్టల్ లో సమాచారం ఉంటుంది. apshwp.ap.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
విద్యార్థుల ఆరోగ్య సంరక్షణ చర్యల్లో భాగంగా కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోనే తొలిసారిగా 13-19 ఏళ్ల మధ్య ఉన్న కౌమార విద్యార్థుల కోసం ప్రత్యేకంగా 'ఆంధ్రప్రదేశ్ స్కూలు హెల్వెల్నెస్ ప్రోగ్రాం' కింద డిజిటల్ పోర్టల్ ను రూపొందించింది. విద్యార్థులకు ఆరోగ్య సంరక్షణ ప్రాధాన్యం, వ్యసనాల దుష్ప్రభావాలు మానసిక ఉల్లాసం, మంచి పద్ధతుల తెలుసుకునేలా అత్యాధునిక సాంకేతి పరిజ్ఞానంతో ఈ కొత్త పోర్టల్ ను సిద్ధం చేసింది.

బాల బాలికలు ముఖ్యంగా వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్య సంరక్షణ, మత్తు పదార్ధాల వినియోగానికి దూరంగా ఉండడం, లింగ సమానత్వం వంటి అంశాలపై సమాచారం ఇందులో ఉంటుంది. హెచ్ఐవీ, రోడ్డు ప్రమాదాల బారినపడకుండా ఉండడo ఇంటర్నెటు, సామాజిక మాధ్యమాల సురక్షిత వినియోగం వంటి అంశాలపై స్వీయ విధానం (సెల్ఫ్ లెర్నింగ్)లో నేర్చుకునేలా 'ఏపీఎస్ హెచ్ డబ్ల్యూపీ' కొత్త పోర్టల్ ను అందుబాటులోనికి తీసుకువచ్చారు.
ఈ పోర్టల్ ప్రాధాన్యం గురించి విద్యార్థులకు వివరించేలా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, జూనియర్ ఇంటర్ కళాశాలల్లో పనిచేస్తే ఉపాధ్యాయులు, లెక్చరర్లలో ఎంపిక చేసిన వారికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మాస్టర్ ట్రైనర్లకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఇచ్చిన శిక్షణకు కొనసాగింపుగా ప్రతి జిల్లాలో 150 మంది ఉపాధ్యాయులు, లెకర్చర్లకు చొప్పున శిక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
సాధారణంగా విద్యార్థులు టీచర్ల ద్వారా లేదా టీవీలు, మీడియా, సామాజిక మాధ్యమాల వేదికగా వారికి అవసరమైన సమాచారంపై అవగాహన పొందుతున్నారు. ఈ క్రమంలో రకరకాల కారణాలవల్ల విశ్వసనీయత లేని సమాచారంతో తప్పుదోవపడుతున్నారు. ఈ ధోరణికి చెక్ పెట్టాలన్న ఉద్దేశంతో విద్యార్థుల కోసం ప్రత్యేకంగా నిర్దిష్ట విశ్వసనీయ, శాస్త్రీయ సమాచారాన్ని పోర్టలు ద్వారా అందుబాటులోనికి తెచ్చామని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ వెల్లడించారు.
ఆకర్షణీయమైన ఫీచర్లు:
- ఈ పోర్టల్ లో విద్యార్థులందరికీ ఉపయోగపడే విధంగా 11 ప్రధాన అంశాల సమాచారాన్ని అందుబాటులో ఉంచారు.
- ఆరోగ్య సంరక్షణ ప్రాధాన్యం, మానసిక ఆరోగ్యం, వ్యక్తిగత సంబంధాలు ఎలా ఉండాలి…? నైతిక విలువలు-ప్రాధాన్యం, పౌష్టికాహారం ప్రాముఖ్యత, వ్యక్తిగత పరిశుభ్రత, ఇతర అంశాల గురించి 15 నిమిషాలలోపు ఉండేలా వీడియోలను తెలుగు, ఆంగ్ల భాషల్లో పోర్టలులో ఉంచారు. విద్యార్థులు పరస్పరం మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో అలా వివిధ అంశాలపై వీడియో పాఠాలను రూపొందించారు.
- ఉదాహరణకు బాలికల రుతుక్రమం, వ్యక్తిగత పరిశుభ్రత, మత్తు పదార్థాల వాడకంతో వచ్చే ఆరోగ్య క్షీణత గురించి వీడియో పాఠాల్లో పేర్కొన్నారు. అలాగే... మితిమీరిపోతున్న సోషల్ మీడియా ప్రభావంవల్ల ఎటువంటి కష్టాలు, నష్టాలు ఎదురవుతాయో తెలిపే విధంగా వీడియో పారాలు పోర్టలులో ఉన్నాయి.
- ఆటల రూపంలో ఈ-లెర్నింగ్, క్విజ్ పోటీల్లో పాల్గొనడం, ఆన్లైన్ పరీక్షలు రాసిన వారికి వైద్య ఆరోగ్య శాఖ ద్వారా సర్టిఫికెట్ల జారీ జరుగుతుంది.
- విద్యార్థులు రిజిస్ట్రేషన్ విధానంలో పోర్టలులోని సమాచారాన్ని తెలుసుకునే సౌకర్యాన్ని వైద్య ఆరోగ్య శాఖ కల్పించింది. తాజా సమాచారం ప్రకారం..36,297 మoది విద్యార్థులు పోర్టలు ద్వారా కొత్త విషయాలు తెలుసుకున్నారు. వీరిలో 75% మంది బాలికలు ఉండడం గమనార్హం.
- పోర్టల్ నుంచి ప్రతి ఈ-మాడ్యుల్ నుంచి ప్రశ్న-జవాబు రూపంలో క్విజ్, ఇందులో పాల్గొన్న వారిలో 80% మార్కులు వచ్చిన వారికి ప్రతిభ ఆధారిత సర్టిఫికెట్లు ఆటోమేటిగ్గా జారీ అవుతున్నాయి.
- ఈ పోర్టల్ లోనే చైల్డ్ హెల్ప్ లైన్, టెలీ మానస్ హెల్ప్ లైన్, ఇతర హెల్ప్ లైన్ల సమాచారం కూడా ఉంది.
రిజిస్ట్రేషన్ ఇలా….
- ముందుగా https://apshwp.ap.gov.in/en వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోం పేజీలోని రిజిస్ట్రర్ లింక్ పై క్లిక్ చేయాలి.
- విద్యార్థి పేరు, ఫోన్ నెంబర్ తో పాటు ఇతర వివరాలను ఎంట్రీ చేయాలి.
- ఆ తర్వాత నెక్ట్స్ ఆప్షన్ పై క్లిక్ చేసి జెండర్, జిల్లా వివరాలను నమోదు చేయాలి.
- సబ్మిట్ చేస్తే మీ రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

