ఏపీలో టెక్ పాలన గ్రేట్.. సంజీవని ప్రాజెక్టు వెరీ నైస్ : బిల్ గేట్స్
ఆంధ్రప్రదేశ్లో టెక్నాలజీతో అందిస్తున్న పాలన గ్రేట్ అని బిల్ గేట్స్ అన్నారు. ఆర్జీజీఎస్ను పరిశీలించిన గేట్స్.. ప్రజెంటేషన్లను తిలకించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెక్నాలజీతో అందిస్తున్న పాలన అద్భుతంగా ఉందని గేట్స్ ఫౌండేషన్ ఛైర్మన్ బిల్ గేట్స్ వ్యాఖ్యానించారు. సోమవారం అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఉన్న రియల్ టైమ్ గవర్నెన్స్ కేంద్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి సందర్శించిన బిల్ గేట్స్ అక్కడ డిస్ ప్లే వాల్స్పై ప్రదర్శించిన ప్రజంటేషన్లను తిలకించారు. ఆర్టీజీఎస్ నుంచి పాలనలో టెక్నాలజీ వినియోగాన్ని పరిశీలించారు.

గేట్స్కు వివరించిన చంద్రబాబు
రియల్ టైమ్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవల్ని వేగంగా అందిస్తున్న తీరు, ఫలితాలను గేట్స్కు ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. ముందుగా రాష్ట్రంలోని డేటా లేక్ వ్యవస్థ ద్వారా అన్ని ప్రభుత్వ విభాగాలనూ అనుసంధానించామని తద్వారా వేగంగా నిర్ణయాలు తీసుకోగలుగుతున్నామని తెలిపారు. డేటాలేక్, అవేర్ 2.0, వాట్సప్ గవర్నెన్స్, సంజీవని డిజిటల్ హెల్త్ రికార్డులు, అమరావతి రాజధాని అంశాలపై అధికారులు బిల్ గేట్స్కు డిస్ ప్లే వాల్స్ ద్వారా ప్రజెంటేషన్ ఇచ్చారు. అవేర్ 2.0 ద్వారా రియల్ టైమ్లో సమాచారాన్ని సేకరించి దానిని ప్రజలకు వేగంగా అందిస్తున్నట్టు తెలియచేశారు.
42 రకాల సమాచారాన్ని ప్రజలకు, రైతులకు అందించటం ద్వారా తక్షణం స్పందించేందుకు ఆస్కారం కలుగుతోందని ముఖ్యమంత్రి తెలిపారు. అలాగే వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌరసేవల్ని కూడా సులభతరం చేశామని...ప్రజల చేతుల్లోకి 921 సేవలను తీసుకెళ్లామని సీఎం వివరించారు. వీటిని ఆసక్తిగా పరిశీలించిన బిల్ గేట్స్ పౌరసేవలను సులభతరం చేయటం బాగుందని కితాబిచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, పాలసీల అమలుపై ప్రజాభిప్రాయాన్ని కూడా సేకరిస్తున్న తీరును తెలుసుకున్నారు.
రాష్ట్రంలో జీఎస్డీపీ పెరుగుదలను కూడా కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్ల ద్వారా ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నామని బిల్ గేట్స్కు ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. ఏపీలోని ప్రాపర్టీ రికార్డుల భద్రతకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారని ముఖ్యమంత్రిని గేట్స్ అడిగారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి బ్లాక్ చైన్ టెక్నాలజీతో ల్యాండ్ రికార్డులను భద్రపరుస్తున్నామని వివరించారు. భూ రికార్డులపై క్యూఆర్ కోడ్ లాంటి భద్రతా ఫీచర్లను ఏర్పాటు చేసి పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. ప్రభుత్వ డాక్యుమెంట్లను ప్రజలకు అందుబాటులో ఉంచేలా ఏపీ ఏఐ సెర్చ్ బార్ను అందుబాటులోకి తెచ్చామని అధికారులు గేట్స్కు ప్రజంటేషన్ ఇచ్చారు. దీనిని పరిశీలించిన బిల్ గేట్స్ పన్నుల వసూళ్ల ప్రక్రియ అద్భుతంగా ఉందని వ్యాఖ్యానించారు. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత దేశంలో పన్నుల వసూళ్ల ప్రక్రియ బాగా సులభతరమైందని, వసూళ్లు కూడా పెరిగాయని ముఖ్యమంత్రి వివరించారు.
సంజీవని ప్రాజెక్టు వెరీ నైస్
గేట్స్ ఫౌండేషన్ సహకారంతో కుప్పం, చిత్తూరు జిల్లాలో నడుస్తున్న సంజీవని ప్రాజెక్టు అమలును గేట్స్ అత్యంత ఆసక్తిగా పరిశీలించారు. బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్ లాంటి వైద్య పరీక్షల అనంతరం ఏం చర్యలు చేపడుతున్నారని అడిగి తెలుసుకున్నారు. ఎవరైనా ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొంటే వారికి ఎలాంటి సేవలు అందుతున్నాయని గేట్స్ ఆరా తీశారు. కుప్పంలో అమలు చేస్తున్న సంజీవని డిజిటల్ హెల్త్ రికార్డుల ప్రాజెక్టు చక్కగా ఉందని కితాబు ఇస్తూ... దట్స్ వెరీ నైస్ అంటూ గేట్స్ వ్యాఖ్యానించారు. ప్రజల డిజిటల్ హెల్త్ రికార్డులను అనుసరించి వారి లైఫ్ స్టైల్ మార్పు, ఆహారం తీసుకునే అంశాల్లో సలహాలు ఇస్తున్నామని ముఖ్యమంత్రి వివరించారు.
ఏఐ వినియోగం ద్వారా ప్రాథమికంగా వారి సందేహాలను తీర్చేలా వైద్య సేవలను అందించేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. దీనిపై స్పందించిన బిల్ గేట్స్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వినియోగించి వైద్య సేవలు అందించే విధానం చాలా బాగుందని ప్రశంసించారు. భారత్ బయోడిజైన్ ద్వారా భవిష్యత్తులో వైద్య సేవలు అందించే విధానాన్ని గేట్స్ అడిగి తెలుసుకున్నారు. అల్ట్రా సౌండ్ పరీక్షలు, స్కానింగ్ పరీక్షల కోసం గర్భిణులు ఎక్కువ వ్యయం చేయాల్సి వస్తోందని.. డయాగ్నోస్టిక్స్ సేవలు తక్కువ వ్యయానికే అందితే వారికి వెసులుబాటు ఉంటుందని గేట్స్ వ్యాఖ్యానించారు. అనంతరం ప్రజా రాజధాని అమరావతి నిర్మాణాలపై ఇచ్చిన ప్రజంటేషన్ను కూడా బిల్ గేట్స్ ఆసక్తిగా పరిశీలించారు. రాజధాని నిర్మాణంలో 30 శాతం మేర నీటి వనరులు, పచ్చదనం కోసం కేటాయించిన ప్రణాళిక బాగుందని అన్నారు. రాజధాని నిర్మాణం జరుగుతున్న తీరును గేట్స్కు సీఎం చంద్రబాబు వివరించారు. దీనిపై స్పందించిన బిల్ గేట్స్ గ్రేట్ వర్క్ అంటూ వ్యాఖ్యానించారు.
గేట్స్కు యువ అధికారుల ప్రజెంటేషన్
అంతకుముందు ఆర్టీజీఎస్ కేంద్రంలోకి వచ్చిన బిల్ గేట్స్కు వీడియో డిస్ ప్లే వాల్పై యువ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ప్రజంటేషన్లు ఇచ్చారు. ఆర్టీజీఎస్ ప్రత్యేక అధికారులు ధాత్రిరెడ్డి, మలికా గార్గ్, ప్రఖర్ జైన్, సౌరబ్ గౌర్, సురేశ్ కుమార్ ప్రజంటేషన్ల ద్వారా డేటా లేక్, అవేర్ 2.0, వాట్సప్ గవర్నెన్సు, పీపుల్స్ పర్పెప్షన్, ఏజెంట్ స్పేస్ ఏఐ సెర్చ్ బార్, సంజీవని, అమరావతి ప్రాజెక్టుల గురించి వివరించారు. ఆర్టీజీఎస్ కేంద్రంలో జరిగిన ప్రజంటేషన్ల కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, సీఎస్ కె.విజయానంద్ సహా తదితర అధికారులు పాల్గొన్నారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper












