తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి.. కొవ్వు అయితే కనిపించడం లేదు : సిట్

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడినట్టుగా సీబీఐ సిట్ సంచలన విషయాలు వెల్లడించింది. అయితే కొవ్వు ఉన్నట్టుగా అయితే కనిపించలేదని స్పష్టం చేసింది.

Updated on: Jan 29, 2026, 08:36:31 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తిరుమల తిరుపతి దేవస్థానానికి(టీటీడీ) సరఫరా చేసిన నెయ్యిలో జంతువుల కొవ్వు లేదని తెలిసింది. నెల్లూరు ఏసీబీ కోర్టులో సిట్‌ అధికారులు శాస్త్రీయ పరీక్షల ఫలితాలను వివరిస్తూ.. సీబీఐ 600 పేజీల తుది ఛార్జిషీట్‌ దాఖలు చేశారు. అయితే కల్తీ నెయ్యి సరఫరా అయిన మాట వాస్తవమేనని సిట్ గుర్తించింది.

తిరుమల కల్తీ నెయ్యి కేసు
తిరుమల కల్తీ నెయ్యి కేసు

దర్యాప్తు సంస్థ ప్రకారం ఆలయ ట్రస్ట్‌కు సరఫరా చేసిన నెయ్యిలో జంతువుల కొవ్వు లేదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్–నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ICAR-NDRI) ఒక నివేదికను సమర్పించింది. గుజరాత్‌లోని నేషనల్ డైరీ డెవలప్‌మెంట్ బోర్డ్ (NDDB) నుండి నివేదిక అందిన తర్వాత మరింత ధృవీకరణ కోరినట్లు సీబీఐ తెలిపింది.

కల్తీ నెయ్యి వాస్తవమే

మెుత్తానికి టీటీడీ దేవస్థానానికి కల్తీ నెయ్యి సరఫరా జరిగిందని సిట్ గుర్తించింది. తిరుమల లడ్డూ ప్రసాదంలో దీనిని ఉపయోగించినట్టుగా వెల్లడించింది. భగవాన్‌పూర్‌లోని భోలేబాబా ఓరోగానిక్‌ డెయిరీ మిల్క్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌‌లో 2019 నుంచి 2024 వరకూ 68.17 లక్షల కిలోల కల్తీ నెయ్యి తయారు చేశారని సిట్ తెలిపింది. ఇందులో 59 లక్షలకుపైగా కిలోలను అగ్‌మార్క్‌ స్పెషల్‌ గ్రేడ్‌ ఆవు నెయ్యి ముసుగులో టీటీడీకి సరఫరా చేసినట్టుగా గుర్తించింది. దీనితో రూ. రూ.234.51 కోట్ల నిధులు దుర్వినియోగం చేశారని పేర్కొంది.

కెమికల్స్‌తో నెయ్యి

భోలేబాబా డెయిరీ ప్రతినిధులు పొమిల్‌ జైన్, విపిన్‌ జైన్‌లు కల్తీ నెయ్యి తయారీ కోసం కుట్రు చేశారు. అనుబంధ సంస్థలు అయిన హర్షా ట్రేడింగ్‌ కంపెనీ, హర్షా ఫ్రెష్‌ డెయిరీ ఫుడ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ద్వారా కల్తీ నెయ్యి తయారీ మెుదలుపెట్టారు. ఇందుకోసం కోల్‌కతాలోని బుడ్జే బుడ్జే రిఫైనరీస్‌ లిమిటెడ్, ఇతర సంస్థల ద్వారా పామ్‌ కెర్నెల్‌ ఆయిల్, రిఫైన్డ్‌ పామాయిల్, రిఫైన్డ్‌ పామోలిన్‌ ఆయిల్‌ కొన్నారు. అరిస్టో కెమికల్స్‌ నుంచి లాక్టిక్‌ యాసిడ్‌, సుగంధ్‌ ఆయిల్స్‌ అండ్‌ కెమికల్స్, శివాన్షి ట్రేడింగ్‌ కంపెనీ, జీఆర్‌ ఇంప్లెక్స్‌ నుంచి ఎసిటిక్‌ యాసిడ్‌ ఎస్టర్, మోనోగ్లిసరైడ్స్‌ వంటి రసాయనాలు తీసుకొచ్చారు. దీనిద్వారా కల్తీ నెయ్యి తయారు చేశారు.

కొవ్వులు కనిపించలేదు!

పాలు, వెన్నలాంటివి సేకరించకుండానే.. పామాయిల్, పామ్‌ కెర్నెల్‌ ఆయిల్, పామాలిన్‌ ఆయిల్‌ నెయ్యితో కలిపి రసాయనాలు జోడించినట్టుగా తెలిసింది. ఇలా కల్తీ నెయ్యిని తయారు చేశారని ఛార్జ్‌షీట్‌లో సిట్ పేర్కొంది. టీటీడీ సరఫరా చేసిన నెయ్యిలో పామాయిల్, పామ్ కెర్నెల్ ఆయిల్ ఉందని, నెయ్యి పరిమాణం చాలా తక్కువగా ఉందని ఎన్‌డీడీబీ పేర్కొంది. ఈ నమూనాల్లో బుట్యరిక్ యాసిడ్ నిర్దేశిత ప్రమాణంకంటే తక్కువగా ఉందని, కొవ్వులు కనిపించలేదని స్పష్టం చేసింది. జంతువుల కొవ్వు ఉండే అవకాశాలు తక్కువ అని వెల్లడించింది.

మరో కీలకమైన విషయం ఏంటంటే.. భోలేబాబా ఓరోగానిక్‌ డెయిరీ, హర్షా ఫ్రెష్‌ డెయిరీ ప్రైవేట్‌ లిమిటెడ్ టీటీడీ నెయ్యి టెండర్లలో పాల్గొనే అర్హత లేదని సీబీఐ తెలిపింది. నకిలీ పత్రాలతోనే టీటీడీ టెండర్లలో పాల్గొన్నట్టుగా తెలిపింది.

వైవీ సుబ్బారెడ్డి పీఏ లంచం

టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పీఏ చిన్నప్పన్న అధికారాన్ని దుర్వినియోగం చేసినట్టుగా సిట్ గుర్తించింది. కిలోకు రూ.25 చొప్పున లంచం డిమాండ్ చేయడంతో సరఫరాదారులు నిరాకరించారు. దీని కారణంగా టెండర్ అర్హతను ప్రభావితం చేసినట్టుగా తెలిసింది. మరో సంస్థకు అధిక రేట్‌కు టెండర్ ఇప్పించి.. రూ.50లక్షల లంచం తీసుకున్నట్టుగా ఛార్జ్‌షీట్‌లో వివరించింది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More