Tirumala Brahmotsavam Garuda Seva : తిరుమల క్షేత్రంలో అత్యంత వైభవంగా జరుగుతున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ప్రముఖ ఘట్టమైన గరుడసేవకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఉత్సవాల్లో భాగంగా సెప్టెంబర్ 19వ తేదీన జరగనున్న గరుడసేవ రోజున భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ… ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ఆ రోజు ఉదయం 3 గంటల నుంచే భక్తులను స్వామి పుష్కరిణిలోకి అనుమతించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఉదయం 3 గంటల నుంచే…

సాధారణ రోజుల్లో ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి భక్తులు పుష్కరిణిలో పవిత్ర స్నానాలు ఆచరించేందుకు అవకాశం ఉంటుంది. అయితే, బ్రహ్మోత్సవాల్లోనే అత్యంత పవిత్రంగా భావించే గరుడసేవ నాడు దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు తిరుమలకు తరలివస్తారు. ఈ క్రమంలో పుష్కరిణి వద్ద భక్తుల క్యూలైన్లు పెరిగి ఎలాంటి తొక్కిసలాట లేదా అసౌకర్యం కలగకుండా ఉండేందుకు మూడు గంటల ముందే… అంటే ఉదయం 3 గంటలకే పుష్కరిణి ద్వారాలను తెరవాలని టీటీడీ నిర్ణయించింది.
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సమయంలో పుష్కరిణిలో స్నానమాచరించి స్వామివారిని దర్శించుకోవడం మహా పుణ్యఫలంగా భక్తులు భావిస్తారు. గరుడసేవ వేళ భక్తుల రాకను సమర్థవంతంగా నియంత్రించేందుకు, ప్రతి ఒక్కరికీ సురక్షితంగా పుష్కరిణి స్నాన భాగ్యం కల్పించేందుకు ఎలక్ట్రికల్, ఇంజినీరింగ్, సెక్యూరిటీ విభాగాలు ప్రత్యేక క్యూలైన్లు, భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నాయి. భక్తులు టీటీడీ సిబ్బంది సూచనలను పాటించి స్వామివారి కృపకు పాత్రులు కావాలని అధికారులు కోరారు.
వైభవంగా బ్రహ్మోత్సవాలు…
మరోవైపు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. నాలుగో రోజైన శుక్రవారం(ఇవాళ) ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు కల్పవృక్ష వాహనంపై గోవుల గోపన్న అలంకారంలో భక్తులను కటాక్షించారు. తిరుమాడ వీధుల్లో అంగరంగ వైభవంగా సాగిన వాహనసేవలో పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.