...
...
Next Story

తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు : ఈనెల 22న అంకురార్పణ - విశేషాలివే..!

Tirupati Govindaraja Swamy Brahmotsavam 2026 : తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు మే 23 నుండి 31 వరకు వైభవంగా జరగనున్నాయి. మే 22న శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించనున్నారు. ఆలయ విశేషాలు, ఉచిత అన్నప్రసాదాలు, నిత్య సేవల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి…

Published on: May 21, 2026, 15:31:31 IST
Advertisement

Tirupati Govindaraja Swamy Brahmotsavam 2026 : కలియుగ వైకుంఠమైన తిరుపతి నగర నడిబొడ్డున వెలసిన చారిత్రక ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం. శిల్పకళ, భక్తి, ఆగమ సంప్రదాయాల సమ్మేళనంగా విరాజిల్లుతున్న ఈ దివ్యక్షేత్రంలో ఈ ఏడాది వార్షిక బ్రహ్మోత్సవాల సంబరం మొదలుకానుంది. మే 23 నుండి 31వ తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు అత్యంత వైభవంగా జరగనున్న ఈ బ్రహ్మోత్సవాలకు మే 22న శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మే 22వ తేదీ సాయంత్రం 5.30 గంటల నుండి రాత్రి 8 గంటల మధ్య ఈ అంకురార్పణ మహోత్సవం శాస్త్రోక్తంగా జరగనుంది.

ప్రత్యేక పూజలు….

తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు

బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందు రోజున నిర్వహించే అంకురార్పణకు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మే 22న ఉదయం సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి, తోమాల సేవ, సహస్రనామార్చన సేవలను అర్చకులు శాస్త్రోక్తంగా పూర్తి చేస్తారు. అనంతరం సాయంత్రం వేళ సేనాధిపతి ఉత్సవం, గంగుండ్ర మండపంలో ఆస్థానం, యాగశాలలో శాస్త్రోక్త అంకురార్పణ కార్యక్రమాలను వైఖానస ఆగమయుక్తంగా నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా సాగాలని కోరుతూ ఈ పుణ్యకార్యాన్ని నిర్వహించడం సంప్రదాయం.

పురాణాల ప్రకారం….. శ్రీ మహా విష్ణువు భూలోకంలో శ్రీనివాసుడిగా అవతరించి తిరుమల కొండలపై నివసించే సమయంలో, పద్మావతి అమ్మవారి వివాహ మహోత్సవం నిమిత్తం కుబేరుని వద్ద నుండి పెద్ద మొత్తంలో ధనాన్ని అప్పుగా తీసుకున్నారు. ఆ విధంగా తీసుకున్న సొమ్మును, బంగారాన్ని జాగ్రత్తగా కొలిచి భద్రపరిచే బాధ్యతను శ్రీనివాసుడు తన అన్నయ్య అయిన శ్రీ గోవిందరాజ స్వామివారికి అప్పగించారు. కుబేరుడి ధనాన్ని రాత్రింబగళ్లు కొలుస్తూ అలసిపోయిన స్వామివారు, ఆ కొలిచే పాత్రను (మరకాల్) తలకింద పెట్టుకుని, ఆదిశేషునిపై శయనించారు. ఈ దివ్య రూపంలోనే స్వామివారు ఇక్కడ భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ ఆలయాన్ని దర్శించుకున్న భక్తులకు అప్పుల బాధల నుండి విముక్తి (రుణ విమోచనం) లభిస్తుందని… మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక ఆనందం కలుగుతాయని భక్తుల బలమైన విశ్వాసం.

గర్భాలయంలో అద్భుత దృశ్యం…

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ప్రతిరోజూ తెల్లవారుజామున 5 గంటలకు సుప్రభాత సేవతో నిత్య కార్యక్రమాలు ప్రారంభమవుతాయి.

  • ఉదయం 5.30 గంటలకు: విశ్వరూప దర్శనం
  • ఉదయం 6.30 గంటలకు: తోమాల సేవ
  • ఉదయం 7.30 గంటలకు: అర్చన
  • ఉదయం 8.00 గంటలకు: అర్చనానంతర దర్శనం (సర్వదర్శనం ప్రారంభం)
  • రాత్రి 8.30 గంటలకు: ఏకాంత సేవతో ఆనాటి నిత్య పూజలు ముగుస్తాయి.

ఉచిత అన్నప్రసాదాలు…

ఆలయానికి వచ్చే భక్తుల ఆకలి తీర్చేందుకు టీటీడీ అద్భుతమైన అన్నప్రసాద వితరణ చేస్తోంది. ప్రతిరోజూ ఉదయం 10.30 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు చక్కెర పొంగలి, అన్నం, సాంబారు, రసం, కూర, పచ్చడి, మజ్జిగతో కూడిన రుచికరమైన భోజనాన్ని భక్తులకు వడ్డిస్తున్నారు. ఆలయం సమీపంలోని పాత మ్యూజియం భవనంలో ఈ ఉచిత అన్నప్రసాద వితరణ నిరంతరాయంగా సాగుతోంది. దీనికి తోడు, భక్తుల సౌకర్యార్థం సాయంత్రం వేళల్లో కూడా సాంబారు అన్నం, పెరుగు అన్నాన్ని రాత్రి 6.30 గంటల నుండి 9 గంటల వరకు పంపిణీ చేస్తున్నారు.

ఆలయంలోకి ప్రవేశించే భక్తులకు మొదటగా దర్శనమిచ్చే ఏడు అంతస్తుల మహారాజగోపురం విజయనగర శిల్పకళా వైభవానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. స్థానిక పాలకుడైన మట్ల అనంతరాజు నిర్మించిన ఈ గోపురం ద్రావిడ, విజయనగర నిర్మాణ శైలుల అద్భుత సమ్మేళనం. ఆలయంలో మూడు అంతస్తులతో నిర్మించిన పడి కావిలి గోపురం, మహాద్వార గోపురం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుండగా…. స్వామివారి విమాన గోపురం బంగారు తాపడంతో నిగనిగలాడుతూ దివ్య కాంతులను విరజిమ్ముతోంది.

ఆలయంలో దాదాపు 70 సంవత్సరాల క్రితం ప్రతిష్టించిన పాత ధ్వజస్తంభం స్థానంలో 2018 ఏప్రిల్ 7న నూతన ధ్వజస్తంభాన్ని శాస్త్రోక్తంగా ప్రతిష్టించారు. అనంతరం ఏప్రిల్ 12న వైఖానస ఆగమోక్తంగా మహాసంప్రోక్షణ నిర్వహించారు. అలాగే.. ఆలయ విమాన గోపురానికి 100 కిలోల అపరంజి బంగారంతో తాపడం చేసే పనులను టీటీడీ ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఈ పనులను నూతన టెక్నాలజీతో పూర్తి చేసి, విమాన గోపుర మహాసంప్రోక్షణను అత్యంత వైభవంగా నిర్వహించారు.

శ్రీ గోవిందరాజస్వామి ఆలయ ప్రాంగణంలో ఒకే చోట మహావిష్ణువుకు సంబంధించిన మూడు భిన్నమైన రూపాలను దర్శించుకోవచ్చు. ఇక్కడ శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి నిల్చున్న రూపంలో (స్థానక రూపం), శ్రీ పార్థసారథి స్వామివారు కూర్చున్న రూపంలో (ఆసీన రూపం), శ్రీ గోవిందరాజ స్వామివారు పడుకున్న రూపంలో (శయన రూపం) దర్శనమిస్తారు. ఒకే ఆలయ ప్రాంగణంలో నిల్చున్న, కూర్చున్న, శయనించిన రూపాల్లో విష్ణుమూర్తి కొలువై ఉండటం ప్రపంచంలోనే అత్యంత అరుదైన విశేషం.

ప్రధాన ఆలయంతో పాటు ప్రాంగణంలో వెలసిన శ్రీ ఆండాళ్ అమ్మవారు, శ్రీ పుండరీకవల్లి అమ్మవారు, సుదర్శన చక్రత్తాళ్వార్ సన్నిధులు, వైష్ణవ ఆచార్యులైన భగవద్రామానుజాచార్యులు, తిరుమలనంబి, అనంతాళ్వారుల ఉప ఆలయాలు భక్తులకు పరిపూర్ణ ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తాయి. ఆలయంలోని ధ్వజారోహణ మండపం, మహామండపం, అర్ధమండపం, అంతరాలయం, బుగ్గ మండపాలు, రాములవారి మండపం, వాహన మండపం మరియు ఉత్సవ మండపాలు అద్భుత శిల్ప సంపదతో పర్యాటకులను సైతం ఆకట్టుకుంటున్నాయి.

ఆలయానికి ఎదురుగా సుమారు 2.5 ఎకరాల విస్తీర్ణంలో పెద్ద పుష్కరిణి (కోనేరు) ఉంది. ప్రతి ఏడాది ఇక్కడ నిర్వహించే ఏడు రోజుల తెప్పోత్సవాలు కనులపండువగా సాగుతాయి. విద్యుద్దీపాలతో అలంకరించిన తెప్పపై స్వామివారు విహరిస్తుంటే చూసేందుకు రెండు కళ్లూ చాలవు. రామాయణ, మహాభారత, భాగవత ఘట్టాల శిల్పాలతో అలరారుతున్న ఈ మహాక్షేత్రం తిరుపతి ఆధ్యాత్మిక వైభవానికి మకుటాయమానంగా నిలుస్తోంది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe