తిరుమల క్షేత్రంలోని ప్రముఖ పుణ్యతీర్థం జపాలి శ్రీ ఆంజనేయస్వామి ఆలయం వద్ద ఉన్న నీటి కొళాయిలలో తెల్లటి నీరు వస్తోందంటూ గత కొన్ని రోజులుగా సామాజిక మాధ్యమాల్లో రకరకాల ప్రచారాలు జోరందుకున్నాయి. ఈ నీటి రంగును చూసి భక్తుల్లో పలు అనుమానాలు, ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) దీనిపై పూర్తిస్థాయిలో స్పందించి అధికారిక వివరణ ఇచ్చింది.
టీటీడీ వివరణ….

సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న వీడియోలను నిశితంగా పరిశీలిస్తే, కొళాయి నుంచి నీరు విడుదలైన కొన్ని సెకన్ల వ్యవధిలోనే అది మళ్లీ తన సహజమైన పారదర్శక రూపాన్ని సంతరించుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. పైప్లైన్లలో అధిక నీటి ఒత్తిడి (వాటర్ ప్రెజర్) ఉండటం వల్ల నీటిలో సూక్ష్మమైన గాలి బుడగలు (ఎయిర్ బబుల్స్) ఏర్పడతాయని నీటిపారుదల, సాంకేతిక నిపుణులు వెల్లడించారు. ఈ గాలి బుడగల కారణంగానే నీరు తాత్కాలికంగా తెల్లటి నురుగులా కనిపిస్తుందే తప్ప…. అందులో ఎలాంటి రసాయనిక దోషం లేదని వివరించారు.
భక్తుల నమ్మకాన్ని, ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని టీటీడీ తక్షణమే రంగంలోకి దిగింది. జపాలి వద్ద లభించే ఈ నీటి నమూనాలను సేకరించి తిరుమలలోని 'టీటీడీ ఫుడ్ అండ్ వాటర్ అనాలసిస్ ల్యాబ్'కు పంపించింది. అక్కడ అధునాతన పద్ధతుల్లో శాస్త్రీయంగా పరీక్షలు నిర్వహించారు. ల్యాబ్ పరీక్షల ఫలితాల్లో ఆ నీరు వంద శాతం స్వచ్ఛమైనదని, తాగడానికి మరియు వినియోగానికి పూర్తిగా సురక్షితమని నిపుణులు ధ్రువీకరించారు.
పరీక్షించిన నీటిలో ఎలాంటి దుర్వాసన లేదు. నీటి అడుగున ఎలాంటి వ్యర్థాలు లేదా అవశేషాలు (సెడిమెంట్) చేరడం లేదని, ప్రమాదకరమైన మలినాలు ఏమీ లేవని ఫుడ్ అండ్ వాటర్ అనాలసిస్ ల్యాబ్ నిపుణులు స్పష్టం చేశారు. నీటి ప్రవాహ వేగం వల్ల తాత్కాలికంగా ఏర్పడే గాలి బుడగలే ఈ మార్పునకు ఏకైక కారణమని తేల్చిచెప్పారు.
కాబట్టి శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు…. జపాలి తీర్థాన్ని సందర్శించే స్వామివారి సేవకులు ఎలాంటి అపోహలకు, ఆందోళనలకు లోనుకావద్దని టీటీడీ విజ్ఞప్తి చేసింది. నిజానిజాలు తెలుసుకోకుండా సామాజిక మాధ్యమాల్లో ప్రచారమవుతున్న అసత్య సమాచారాన్ని, వదంతులను అస్సలు నమ్మవద్దని కోరింది.
{{/usCountry}}కాబట్టి శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు…. జపాలి తీర్థాన్ని సందర్శించే స్వామివారి సేవకులు ఎలాంటి అపోహలకు, ఆందోళనలకు లోనుకావద్దని టీటీడీ విజ్ఞప్తి చేసింది. నిజానిజాలు తెలుసుకోకుండా సామాజిక మాధ్యమాల్లో ప్రచారమవుతున్న అసత్య సమాచారాన్ని, వదంతులను అస్సలు నమ్మవద్దని కోరింది.
{{/usCountry}}