...
...
Next Story

టీటీడీ : రథ సప్తమికి సప్త వాహన సేవలను తిలకించిన సుమారు 3 లక్షల మంది భక్తులు

రథ సప్తమి రోజున మూడు లక్షల మందికిపైగా భక్తులు శ్రీవారి వాహన సేవలు తిలకించారు. చంద్ర ప్రభ వాహన సేవతో సప్త వాహన సేవలు ముగిశాయి.

Published on: Jan 26, 2026, 11:44:20 IST
Advertisement

రథ సప్తమి పవిత్రమైన రోజున తిరుమలలో స్వామివారు వాహన సేవలు భక్తుల కన్నుల విందు చేశాయి. సూర్యప్రభ, చిన శేష, గరుడ, హనుమంత వాహనాలను వీక్షించి, మధ్యమధ్యలో చక్రస్నానం, ఆహ్లాదకరమైన సాయంత్రం వేళలో కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహన సేవలను భక్తులు తిలకించారు.

తిరుమల రథసప్తమి
తిరుమల రథసప్తమి

దైవిక వరాలను ఇచ్చే వృక్షం అయిన కల్పవృక్షంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప దేవుడి దివ్య వైభవాన్ని చూసి భక్తులు మంత్రముగ్ధులయ్యారు. ఆ తర్వాత సర్వభూపాల వాహనంపై ముగ్గురు దేవతల రాజ దర్శనం జరిగింది. రాత్రి 8 గంటల నుండి 9 గంటల మధ్య చంద్ర ప్రభ వాహన సేవతో సప్త వాహన సేవలు ముగిశాయి.

రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమలలో మూడు లక్షల మందికి పైగా భక్తులు శ్రీవారి వాహన సేవలు తిలకించారని టీటీడీ ఛైర్మన్ బీ.ఆర్.నాయుడు తెలియజేశారు. రథ సప్తమి వేడుకల సందర్భంగా ఛైర్మన్.. టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్‌తో కలిసి మాడ వీధుల్లోని గ్యాలరీలను పరిశీలించి, భక్తులతో మాట్లాడి అభిప్రాయాలు తెలుసుకున్నారు.

టీటీడీ అధికారులు, విజిలెన్స్ విభాగం, జిల్లా పోలీసుల సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేయడంతో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వేడుకలను విజయవంతం చేసినట్లు టీటీడీ ఛైర్మన్ చెప్పారు. అధికారులు, సిబ్బంది, పోలీసులు, జిల్లా యంత్రాంగం, శ్రీవారి సేవకులు, భక్తులందరికీ ఛైర్మన్ కృతజ్ఞతలు తెలిపారు.

భక్తులకు టీటీడీ సాంబార్ రైస్, టమాటా రైస్, పెరుగు అన్నం, బాదం మిల్క్ తదితర 14 రకాల అన్నప్రసాదాలను నిరంతరంగా అందించింది. ఇందుకోసం ప్రత్యేకంగా 2,000 మంది సేవకులను అన్నప్రసాద వితరణకు, 750 మందిని తాగునీటి సరఫరాకు, మరో 250 మందిని భక్తుల రద్దీ నియంత్రణకు నియమించారు.

రథ సప్తమి ముఖ్యాంశాలు

  • మూడు లక్షల మందికిపైగా భక్తులు వాహన సేవలను తిలకించారు.
  • గ్యాలరీల్లోని భక్తులకు 14 రకాల అన్నప్రసాదాలు పంపిణీ
  • గ్యాలరీల్లో మొబైల్ వాటర్ డ్రమ్స్ తో నిరంతరం తాగునీటి సరఫరా
  • మాడ వీధుల్లోని గ్యాలరీల్లో భక్తులకు ఎండకు, వర్షానికి ఇబ్బంది కలగకుండా పందిళ్లు ఏర్పాటు
  • సుమారు 2,500 మంది టీటీడీ విజిలెన్స్ సిబ్బంది, పోలీసులు, 3,500 మంది శ్రీవారి సేవకులు.. భక్తులకు సేవలు
  • 56 కళారూపాల్లో 1,000 మందికిపైగా కళాకారులు కళారూపాలు ప్రదర్శన
  • భక్తుల కోసం నిరంతర మొబైల్ వైద్య సేవలు
  • సెక్టోరల్ అధికారులు, డిప్యూటేషన్ సిబ్బంది 24 గంటల పాటు సౌకర్యాలను పర్యవేక్షణ

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks