జనవరిలో తిరుమలకు వచ్చే భక్తులకు ఏ ఆలయాల్లో ఎలాంటి ఉత్సవాలు ఉన్నాయో తెలుసుకుని వస్తే బెటర్. తదనుగుణంగా ప్లాన్ చేసుకుంటే.. తిరుపతిలోనూ ఆలయాలను సందర్శించుకోవచ్చు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జనవరి నెలలో జరుగనున్న విశేష ఉత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. ఆ వివరాలు చూద్దాం..
- జనవరి 1న రోహిణి నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు రుక్మిణి, సత్యభామ సమేత శ్రీపార్థసారధి స్వామి వారు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షిస్తారు.
- జనవరి 2, 23వ తేదీల్లో శుక్రవారం సాయంత్రం 6 గంటలకు శ్రీ ఆండాళ్ అమ్మవారు ఆలయ మాడ వీధుల్లో భక్తులను అనుగ్రహిస్తారు.
- జనవరి 3న పౌర్ణమి గరుడసేవ
- జనవరి 5న శ్రీ గోవిందరాజస్వామివారు రామచంద్రతీర్థ కట్టకు వేంచేపు.
- జనవరి 7 నుండి 13వ తేదీ వరకు శ్రీ ఆండాల్ అమ్మవారి నీరాటోత్సవం.
- జనవరి 14న భోగి తేరు.
- జనవరి 15న మకర సంక్రాంతి.
- జనవరి 16న గోదా కల్యాణం
- జనవరి 17న కనుమ పండుగ సందర్భంగా పార్వేటి ఉత్సవం.
- జనవరి 18 నుండి ఫిబ్రవరి 10వ తేదీ వరకు అధ్యయనోత్సవాలు
- జనవరి 20న శ్రవణా నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు ఉభయనాంచారులతో కలిసి శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి నాలుగు మాడ వీధుల్లో భక్తులను అనుగ్రహిస్తారు.
- జనవరి 25న రథసప్తమి.
- జనవరి 27 నుండి ఫిబ్రవరి 1వ తేదీ వరకు తెప్పోత్సవాలు.
వైకుంఠ ద్వార దర్శనాలు

మరోవైపు వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి టీటీడీ ఏర్పాట్ల చేసింది. డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేది నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శనాల కోసం పగడ్బంది ఏర్పాట్లు చేశారు. రెండు నెలలుగా అధికార యంత్రాంగం తనిఖీలు నిర్వహించి ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, భద్రతా ఏర్పాట్లు, అన్న ప్రసాదాలు, వసతి, క్యూ లైన్ల నిర్వహణ, పార్కింగ్ సౌకర్యాలపై ప్రణాళికలు సిద్ధం చేశారని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ చెప్పారు.
డిసెంబర్ 30న వైకుంఠ ఏకాదశి, 31న వైకుంఠ ద్వాదశి, జనవరి 1వ తేదీలకు సామాన్య భక్తులకు ఈ-డిప్ విధానం ద్వారా దర్శన టోకెన్లు కేటాయించారు. భక్తులందరికీ అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఐదు రోజుల పాటు ఈ-డిప్ రిజిస్ట్రేషన్ కు అవకాశం ఇచ్చారు. దాదాపు 24 లక్షల మంది భక్తులు ఈ-డిప్ కు రిజిస్ట్రేషన్ చేసుకోగా మొదటి మూడు రోజులకు 1.89 లక్షల భక్తులను ఈ-డిప్ ద్వారా ఎంపిక చేసి టోకెన్లు కేటాయించారు.
ఈ మూడు రోజులకు టోకెన్లు పొందిన భక్తులకు నిర్దేశిత తేది, సమయాన్ని కేటాయించారు. ఆ సమయం ప్రకారమే భక్తులు దర్శనానికి వస్తే ఎలాంటి ఇబ్బంది కలగకుండా రెండు గంటల్లోనే స్వామివారి దర్శనం కలుగుతుంది.