పాకిస్థాన్ జైలులో ప్రేమ! కలిసేందుకు బార్డర్ దాటుతుండగా విశాఖ వాసి అరెస్ట్!
విశాఖకు చెందిన ప్రశాంత్ అనే వ్యక్తిని పాకిస్థాన్ సరిహద్దు వద్ద అరెస్ట్ చేశారు. అయితే తన ప్రియురాలిని కలిసేందుకు వెళ్తున్నట్టుగా అతడు చెప్పాడు.
ఆంధ్రప్రదేశ్కు చెందిన వ్యక్తి శుక్రవారం రాజస్థాన్లోని బికనీర్ సెక్టార్లోని పాక్ సరిహద్దు సమీపంలో పట్టుబడ్డాడు. యువకుడు పాకిస్థాన్లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తుండగా దొరికాడు. నిందితుడిని ప్రశాంత్ వేడంగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అతను విశాఖపట్నం నివాసి. పాకిస్థాన్లో నివసిస్తున్న తన ప్రియురాలిని కలవడానికి సరిహద్దు దాటడానికి ప్రయత్నిస్తున్నానని భద్రతా సంస్థలకు చెప్పాడు. గతంలో కూడా ప్రశాంత్ ఒకసారి పాకిస్థాన్లోకి సరిహద్దు దాటి వెళ్ళాడు.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, డిసెంబర్ 5 మధ్యాహ్నం ప్రశాంత్ వేడం ఖజువాలాలో బస్సు దిగి అంతర్జాతీయ సరిహద్దు వైపు నడవడం ప్రారంభించాడు. ఆ తర్వాత అనుమానాస్పద ప్రవర్తనను చూసిన సరిహద్దు గార్డులు అతన్ని ఆపారు. కొద్దిసేపు విచారించిన తర్వాత అతన్ని ఖజువాలా పోలీస్ స్టేషన్కు అప్పగించారు. ప్రశాంత్ అనే ఈ వ్యక్తి పాకిస్థాన్కు వెళ్లడానికి ప్రయత్నించినట్లు అంగీకరించాడని, సరిహద్దు దాటడానికి సులభమైన మార్గాన్ని వెతుకుతున్నాడని ఖజువాలా ఎస్హెచ్ఓ హర్పాల్ సింగ్ తెలిపారు. ఈ విషయంలో సమాచారం అందిన వెంటనే, ఆర్మీ ఇంటెలిజెన్స్ అతన్ని అరెస్టు చేసింది. ఇప్పుడు ఆర్మీ, భద్రతా సంస్థలు కలిసి అతన్ని విచారిస్తున్నాయని ఎస్హెచ్ఓ చెప్పారు.
ప్రాథమిక దర్యాప్తులో ప్రశాంత్ 2017లో బికనీర్లోని కర్ణి పోస్ట్ ద్వారా కూడా పాకిస్థాన్లోకి చొరబడ్డాడనని చెప్పుకొచ్చాడు. ఆ సమయంలో అతన్ని పాకిస్థాన్ సైన్యం అరెస్టు చేసి 2021 వరకు పాకిస్థాన్ కస్టడీలో ఉంచిందని ప్రశాంత్ తెలిపాడు. తరువాత అతన్ని అట్టారి సరిహద్దు ద్వారా భారతదేశానికి తిరిగి పంపించారని వెల్లడించాడు. ప్రియురాలి కోసం మళ్ళీ పాకిస్థాన్లోకి వెళ్లడానికి ప్రయత్నించానని ప్రశాంత్ చెప్పుకొచ్చాడు. అయితే అతడి మాటలు మాత్రం అనుమానాస్పదంగా ఉన్నాయి.
ఇండియన్ ఎక్స్ప్రెస్ ప్రకారం.. ప్రశాంత్ పాకిస్థాన్ జైలులో ఉన్నప్పుడు వేరే సెల్లో అక్కడే ఒక మహిళతో ప్రేమలో పడ్డానని చెబుతున్నాడని ఎస్హెచ్ఓ సింగ్ తెలిపారు. ప్రశాంత్ అదే మహిళను కలవడానికి పాకిస్థాన్కు తిరిగి వెళ్తున్నానని పోలీసులకు చెప్పాడు. అతను ఇప్పటికీ ఆ అమ్మాయితో టచ్లో ఉన్నాడా లేదా అనేది స్పష్టంగా లేదు. అస్సలు ప్రేమ కథ ఉందా లేదా అనేది కూడా క్లారిటీ రావాల్సి ఉంది.
ఖాజువాలా పోలీస్ ఆఫీసర్ అమర్జిత్ చావ్లా మాట్లాడుతూ.. విచారణ సమయంలో ప్రశాంత్ రావల్పిండిలో నివసించే తన ప్రియురాలిని కలవడానికి పాకిస్థాన్ వెళ్తున్నానని చెప్పాడన్నారు. అయితే 10 సంవత్సరాల క్రితం సోషల్ మీడియాలో కలుసుకున్నట్టుగా కూడా ఓసారి చెప్పాడు. దీంతో ఏది సరైన విషయం అనేదానిపై సందేహాలు నెలకొన్నాయి.
విశాఖలోని ప్రశాంత్ కుటుంబానికి సమాచారం అందించారు పోలీసులు. అతని సోదరుడు ఖజువాలాకు వెళ్లాడు. ప్రశాంత్కు కొన్ని మానసిక సమస్యలు ఉన్నాయని సోదరుడు చెబుతున్నాడు. ప్రశాంత్ బి.టెక్ గ్రాడ్యుయేట్ అని, గతంలో చైనా, ఆఫ్రికాలో పనిచేశాడని తెలుస్తోంది. ప్రశాంత్ను ఇప్పుడు ఖజువాలాలోని ఒక సేఫ్ హౌస్లో ఉంచినట్లు పోలీసులు తెలిపారు. అక్కడ వివిధ నిఘా సంస్థలు అతడిని ప్రశ్నిస్తున్నాయి. ప్రశాంత్ గూఢచర్యంలో పాల్గొన్నాడా లేదా అనే దానిపై దర్యాప్తు జరుగుతోంది.














