Yogandhra-2026 : ఏపీలో యోగాసనాల రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. ఎక్కడ చేసుకోవాలి?

ఏపీలో యోగాంధ్ర - 2026 రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవంలోపు కోటి మందితో యోగాసనాలు వేయించడమే లక్ష్యంగా ఆరోగ్య శాఖ టార్గెట్ పెట్టుకుంది.

Published on: Jun 6, 2026, 12:56:50 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా "యోగాంధ్ర – 2026" కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా జూన్ 6 నుండి రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది.

యోగాంధ్ర 2026
యోగాంధ్ర 2026

జూన్ 7 నుండి జూన్ 20 వరకు రాష్ట్రంలోని మొత్తం 28 జిల్లాల్లో సుమారు ఒక కోటి మందితో యోగాసనాలు వేయించడమే లక్ష్యంగా ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ మెగా ఈవెంట్‌పై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఇప్పటికే అధికారులతో ఉన్నత స్థాయి వర్చువల్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

జూన్ 21న జరగబోయే 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని 28 జిల్లాల్లో 56 ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఆసక్తి గల వారు రాష్ట్రంలోని అన్ని గ్రామ/వార్డు సచివాలయాలలో తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. ఇక్కడే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వీటి పర్యవేక్షణ కోసం ఆయుష్ విభాగానికి చెందిన అధికారులను ఒక్కో జిల్లాకు ఒకరి చొప్పున నోడల్ ఆఫీసర్లుగా నియమించారు.

ఈ భారీ కార్యక్రమం కోసం ఏకంగా 5,600 మంది యోగా మాస్టర్ ట్రైనర్లను రంగంలోకి దించారు. ఒక్కో మాస్టర్ ట్రైనర్ జిల్లా కేంద్రాలు, మండల స్థాయిల్లో కనీసం 50 మందికి మూడు రోజుల పాటు యోగాసనాల్లో శిక్షణ ఇస్తారు.

జూన్ 21న అమరావతిలో రాష్ట్ర స్థాయి ప్రధాన యోగా కార్యక్రమం జరగనుంది. ఈ లోపు జిల్లాల్లో జరిగే ఏర్పాట్లను పర్యవేక్షించడానికి మంగళగిరిలోని వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయంలో వివిధ విభాగాలకు చెందిన 30 మంది అధికారులతో ఒక స్పెషల్ వార్ రూమ్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయడం విశేషం. జూన్ 7 నుంచి 20వ తేదీ వరకు యోగా కార్యాక్రమలు జరుగుతాయి.

యోగాసనాలు కొన్ని ప్రముఖ పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాల్లో కూడా జరగనున్నాయి. జూన్ 7 నుండి ప్రారంభమయ్యే ప్రముఖ ప్రదేశాల్లో శ్రీ సత్యసాయి జిల్లాలోని చారిత్రక లేపాక్షి ఆలయం, కృష్ణా జిల్లాలోని మంగినపూడి బీచ్, తిరుపతిలోని ఎస్వీ జూ పార్కింగ్ ప్రదేశం ఉంది. వైఎస్ఆర్ కడప జిల్లాలోని ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలో కూడా యోగాసనాలు జరుగుతాయి. జూన్ 8న నిర్వహించే ప్రాంతాలు చూసుకుంటే.. గుంటూరు జిల్లాలోని ఉండవల్లి గుహలు, కాకినాడ జిల్లాలోని అన్నవరం దేవస్థానం, కర్నూలులోని హరిత రాక్ గార్డెన్, నంద్యాల జిల్లాలోని శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయ ప్రాంగణంలో జరగనుంది. అంతేకాదు రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రదేశాల్లో కూడా యోగాసనాలు నిర్వహిస్తారు.

అదేవిధంగా జూన్ 8వ తేదీన అన్నమయ్య జిల్లాలోని అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బంది.. తూర్పుగోదావరి జిల్లా కేంద్ర కారాగారంలోని ఖైదీలు కూడా ఈ యోగాసనాల కార్యక్రమంలో భాగస్వాములు కానున్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More