...
...
Next Story

YS Jagan : రెడ్ బుక్ పాలనకు రోజులు దగ్గరపడ్డాయి... చంద్రబాబుకు సినిమా చూపిస్తాం - వైఎస్ జగన్

చంద్రబాబుకు భయపడే రోజులు పోయాయని.. కార్యకర్తలెవరూ భయపడవద్దని వైసీపీ అధినేత జగన్ పిలుపునిచ్చారు. రెడ్ బుక్ పాలనకు రోజులు దగ్గరపడ్డాయని…ఆ తర్వాత చంద్రబాబుకు రోజు సినిమా చూపిస్తామని వ్యాఖ్యానించారు.

Published on: Mar 26, 2026 08:43 AM IST
Advertisement

సీఎం చంద్రబాబు నాయుడుపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. రెడ్ బుక్ పాలనకు రోజులు దగ్గరపడ్డాయని.. ఆ తర్వాత చంద్రబాబుకు రోజూ సినిమా చూపిస్తామని వ్యాఖ్యానించారు. అద్దంకి నియోజకవర్గం నేతలతో బుధవారం సమావేశమైన జగన్.. ఈ సందర్భంగా మాట్లాడారు.

సినిమా చూపిస్తాం - జగన్ వార్నింగ్

వైఎస్ జగన్
వైఎస్ జగన్

ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర ప్రారంభిస్తానని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. కూటమి పాలనలో ఇప్పటికే రెండేళ్లు పూర్తి అయ్యాయని చెప్పారు. చంద్రబాబుకు మిగిలింది మరో మూడేళ్లు మాత్రమేనని… ఏడాదిన్నర తర్వాత తాను పాదయాత్ర చేపడతానని పేర్కొన్నారు. పార్టీ మొత్తం రంగంలోకి దిగుతుందని… చంద్రబాబుకు భయపడే రోజులు పోయాయన్నారు.

“ఇప్పటికే రెండేళ్లు గడిచాయి. ఇంకా మిగిలింది మూడేళ్లు. అందులో చివరి ఏడాదిన్నర నేను పాదయాత్రలో ఉంటాను. దాంతో మొత్తం పార్టీ ప్రజల కోసం నేరుగా రంగంలోకి దిగుతుంది. అప్పుడు చంద్రబాబుకు సినిమా చూపిస్తాం. కాగా, చంద్రబాబు చేసే రెడ్‌బుక్‌ పాలన, అన్యాయాలకు టైమ్‌ దగ్గరకొచ్చిందని, ఇంకా వాటి గురించి భయపడాల్సిన అవసరం లేదు” అని వైఎస్ జగన్‌ స్పష్టం చేశారు.

అనకాపల్లి జిల్లాలో ఆర్సెలర్‌ మిట్టల్‌ స్టీల్‌ ప్లాంట్‌కు పునాదులు పడింది 2022లోనే జగన్ గుర్తు చేశారు. కానీ క్రెడిట్ కోసం ఇప్పుడు చంద్రబాబు వెంపర్లాడుతున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు మారడని.. క్రెడిట్ యావ చావదంటూ విమర్శించారు. ఆర్సెనాల్‌ మిట్టల్‌ స్టీల్‌ కంపెనీ గురించి అంతగా ప్రచారం చేసుకుంటున్న సీఎం చంద్రబాబు… అదే నక్కపల్లిలోని బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ ప్రాజెక్ట్‌ గురించి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. అసలు ఆ ప్రాజెక్టు ఏమైందని నిలదీశారు.

కార్యకర్తలకు ప్రాధాన్యం ఇస్తాం - జగన్

వైసీపీ హయాంలో దాదాపు రూ.3.31 లక్షల కోట్ల అప్పు చేస్తే, అందులో రూ.2.73 లక్షల కోట్లు, డీబీటీ ద్వారా అక్కచెల్లెమ్మల ఖాతాలకు నేరుగా బదిలీ చేశామని జగన్ చెప్పారు. కానీ రెండేళ్లు కూడా కాకముందే చంద్రబాబు చేసిన మొత్తం అప్పులు రూ.3.37 లక్షల కోట్లు దాటాయన్నారు.

మరోవైపు అధిక ధరలకు పీపీఏలతో అవినీతికి పాల్పడుతున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మనం యూనిట్‌ విద్యుత్‌ రూ.2.49కే పీపీఏ చేసుకుంటే, ఇప్పుడు రూ.4.60కి చేసుకుంటున్నారని ఎత్తి చూపారు. అమరావతిలో చదరపు అడుగు నిర్మాణానికి రూ.11 వేలు ఖర్చు చేస్తున్నారని… బెంగళూరు, హైదరాబాద్‌ వంటి మహానగరాల్లో చదరపు అడుగు నిర్మాణానికి రూ.4 వేలతో ఫైవ్‌స్టార్‌ లెవెల్‌లో కట్టొచ్చని తెలిపారు. కానీ ఇక్కడ ఏకంగా అదే చదరపు అడుగు నిర్మాణానికి రూ.11 వేలు ఖర్చు చేస్తున్నారని చెప్పుకొచ్చారు.

చంద్రబాబు ప్రభుత్వంలో అసలు పరిపాలన అనేది లేదు. అన్ని వ్యవస్థలు కుప్పకూలాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ లేక, పిల్లలు చదువులకు దూరం అవుతున్నారు. బకాయిలతో కలిపి ఈ ఏడాది విద్యాదీవెన, వసతి దీవెనకు సుమారు రూ.10 వేల కోట్లు కావాలి. కానీ ఈ ఏడాది బడ్జెట్‌లో పెట్టింది రూ.2,600 కోట్లు మాత్రమే. ఆరోగ్యశ్రీకి రూ.3,150 కోట్లు బకాయి పెట్టారు. దీంతో నెట్‌వర్క్‌ ఆస్పత్రులు పథకంలో వైద్యం చేయడం లేదు” అని జగన్ విమర్శించారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe