Batwara 1947 Teaser: ట్రైన్లలో శవాల దిబ్బలు.. ఏరులై పారిన రక్తం.. దేశ విభజన వేళ ఊచకోత.. 'బట్వారా 1947' టీజర్ ఎలా ఉందంటే?
Batwara 1947 Teaser: బాలీవుడ్లో దేశ విభజన వేళ జరిగిన మారణ హోమంపై మరో మూవీ వస్తోంది. బట్వారా 1947 పేరుతో వస్తున్న ఈ సినిమాలో సన్నీ డియోల్ లీడ్ రోల్లో నటిస్తున్నాడు. ప్రీతి జింటా ఇదే మూవీతో కమ్బ్యాక్ ఇస్తోంది. తాజాగా మూవీ టీజర్ రిలీజైంది.
Batwara 1947 Teaser: బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడానికి ఇద్దరు దిగ్గజాలు చేతులు కలిపారు. 'గదర్ 2' సినిమాతో సంచలనం సృష్టించిన యాక్షన్ కింగ్ సన్నీ డియోల్ హీరోగా, మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ నిర్మాణంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ హిస్టారికల్ యాక్షన్ డ్రామా 'బట్వారా 1947' (గతంలో లాహోర్ 1947) అఫీషియల్ టీజర్ గురువారం (జూన్ 18) ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.

దేశ విభజన నేపథ్యంలో సాగే ఒక ఎమోషనల్, వైలెంట్ కథాంశంతో డైరెక్టర్ రాజ్కుమార్ సంతోషి ఈ చిత్రాన్ని అద్భుతంగా ఆవిష్కరించినట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది. 1 నిమిషం 5 సెకన్ల నిడివి గల ఈ టీజర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
గుండెల్ని పిండేసే విజువల్స్.. ఆమిర్ ఖాన్ వాయిస్ ఓవర్
ఈ బట్వారా 1947 మూవీ టీజర్ ఆమిర్ ఖాన్ పవర్ఫుల్ వాయిస్ ఓవర్తో ప్రారంభమవుతుంది. భారతదేశానికి 200 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత స్వాతంత్య్రం ఎలా వచ్చింది? అదే సమయంలో దేశ విభజన వల్ల జరిగిన ఘోరమైన మారణహోమం ఎలాంటి గాయాలను మిగిల్చింది అనేది ఆమిర్ తన వాయిస్తో వివరిస్తుంటే బ్యాక్గ్రౌండ్లో వచ్చే విజువల్స్ ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి.
మతం పేరుతో సాగిన నరమేధం, రైలు పైన, వీధుల్లో గుట్టలుగా పడి ఉన్న శవాల దిబ్బలను టీజర్లో చూపించారు. సీనియర్ నటి షబానా అజ్మీ అల్లర్ల మధ్య తీవ్ర ఆవేదనతో "అంతా ఆ దేవుడి ఇష్టప్రకారమే జరుగుతుంది" అని చెప్పే డైలాగ్ కన్నీళ్లు తెప్పిస్తుంది.
యాక్షన్ మోడ్లో సన్నీ డియోల్.. ప్రీతీ జింటా కమ్బ్యాక్
రైల్వే ప్లాట్ఫామ్ పై సన్నీ డియోల్ పరుగెత్తుతూ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ ప్రీతీ జింటా, అలీ ఫజల్ పాత్రలకు సంబంధించిన గ్లింప్స్ను కూడా టీజర్లో రివీల్ చేశారు.
"ద్వేషం, భయం రాజ్యమేలుతున్న కాలంలో.. అతను ధైర్యాన్ని ఎంచుకున్నాడు" అనే క్యాప్షన్తో టీజర్ ముగుస్తుంది. సన్నీ డియోల్ ఈ టీజర్ను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ, "దేశ విభజన మనుషుల మధ్య గీతలు గీసినప్పుడు, అతను భయాన్ని కాకుండా ధైర్యాన్ని ఎంచుకున్నాడు. ఆగస్ట్ 14న థియేటర్లలో కలుద్దాం" అంటూ రాసుకొచ్చారు.
30 ఏళ్ల తర్వాత క్రేజీ కాంబినేషన్ రిపీట్!
'బట్వారా 1947' సినిమాకు బాలీవుడ్లో ఎనలేని క్రేజ్ ఉండటానికి ప్రధాన కారణం ఈ మూవీ కాంబినేషన్. సన్నీ డియోల్, డైరెక్టర్ రాజ్కుమార్ సంతోషి కాంబినేషన్లో 1996లో వచ్చిన 'ఘాతక్' ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే.
మళ్లీ దాదాపు మూడు దశాబ్దాల తర్వాత వీరిద్దరూ కలిసి చేస్తున్న సినిమా ఇది. అలాగే 1994లో వచ్చిన క్లాసిక్ కామెడీ ఫిల్మ్ 'అందాజ్ అప్నా అప్నా' తర్వాత డైరెక్టర్ రాజ్కుమార్ సంతోషితో ఆమిర్ ఖాన్ అసోసియేట్ అయిన ప్రాజెక్ట్ కూడా ఇదే కావడం విశేషం. ఈ చిత్రంలో సన్నీ డియోల్ కుమారుడు కరణ్ డియోల్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు.
బట్వారా 1947 మూవీ హైలైట్స్
నటీనటులు: సన్నీ డియోల్, ప్రీతీ జింటా, షబానా అజ్మీ, అలీ ఫజల్, కరణ్ డియోల్, అభిమన్యు సింగ్
దర్శకుడు: రాజ్కుమార్ సంతోషి
నిర్మాత: ఆమిర్ ఖాన్ (ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్)
సంగీతం: ఏఆర్ రెహమాన్
సాహిత్యం: జావేద్ అక్తర్
విడుదల తేదీ: ఆగస్ట్ 14 (Partition Day)
బట్వారా 1947 అసలు కథేంటంటే?
సినీ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సినిమా ప్రముఖ రచయిత అస్గర్ వజహత్ రాసిన 'జిస్ లాహోర్ నై దేఖ్యా, ఓ జామ్యాయ్ ని' అనే నాటకం ఆధారంగా తెరకెక్కినట్లు టాక్ వినిపిస్తోంది. దేశ విభజన సమయంలో లక్నో నుండి లాహోర్కు వలస వెళ్ళిన ఒక ముస్లిం కుటుంబానికి, అక్కడ హిందువులు ఖాళీ చేసి వెళ్లిన ఒక పెద్ద హవేలీ (భవనం) కేటాయిస్తారు.
అయితే ఆ ఇంటికి వెళ్లిన తర్వాత వారికి ఒక షాకింగ్ నిజం తెలుస్తుంది. ఆ హిందూ కుటుంబానికి చెందిన ఒక వృద్ధురాలు ఆ ఇల్లు వదిలి వెళ్ళడానికి నిరాకరిస్తూ అక్కడే ఉండిపోతుంది. ఆ తర్వాత ఆ ఇంట్లో ఎలాంటి డ్రామా జరిగింది? ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అనే ఆసక్తికరమైన పాయింట్ చుట్టూ ఈ కథ తిరగనుందని సమాచారం.
ఈ సినిమాతో ప్రీతీ జింటా చాలా ఏళ్ల తర్వాత మళ్లీ సిల్వర్ స్క్రీన్ పైకి గ్రాండ్ కమ్బ్యాక్ ఇస్తోంది. ఆమె చివరిగా 2018లో వచ్చిన 'భయ్యాజీ సూపర్హిట్' సినిమాలో కనిపించింది. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ అద్భుతమైన మ్యూజిక్, జావేద్ అక్తర్ లిరిక్స్ ఈ సినిమాకు అదనపు బలాన్ని ఇవ్వనున్నాయి. స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఆగస్ట్ 14న విడుదల కాబోతున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను తిరగరాస్తుందో చూడాలి.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


