ఐశ్వర్య రాజేష్ తెలుగు కామెడీ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. వెరైటీ టైటిల్తో వస్తున్న సిరీస్.. ఇక్కడ చూసేయండి
ఐశ్వర్య రాజేష్ ఇప్పుడో తెలుగు కామెడీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ చేస్తోంది. జియోహాట్స్టార్ లో రానున్న ఈ సిరీస్ ఎంతగానో ఆసక్తి రేపుతోంది. ఆ ఓటీటీలో వచ్చే ఏడాది ఎన్నో కొత్త తెలుగు సినిమాలు, సిరీస్ రానుండగా.. అందులో ఇదీ ఒకటి.
డిజిటల్ ప్లాట్ఫామ్ జియోహాట్స్టార్ దక్షిణాది కంటెంట్పై ప్రత్యేక దృష్టి సారించింది. వరుసగా క్రేజీ ప్రాజెక్టులను లైన్లో పెడుతోంది. అందులో భాగంగానే తాజాగా 'మూడు లాంతర్లు' (Moodu Lantharlu) అనే ఆసక్తికరమైన వెబ్ సిరీస్ను ప్రకటించింది. ఇందులో విశేషమేమిటంటే 'సంక్రాంతికి వస్తున్నాం' ఫేమ్, విలక్షణ నటి ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్ర పోషిస్తుండటం సిరీస్పై ఆసక్తిని పెంచుతోంది.

ఎన్టీఆర్ 'మద్యపాన నిషేధం' నాటి కథ
ఈ వెబ్ సిరీస్ కథాంశం చాలా భిన్నంగా ఉండబోతోంది. ఇది 90వ దశకం ఆరంభంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నేపథ్యంలో సాగుతుంది. అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం విధించిన సంగతి తెలిసిందే.
ఆ సమయంలో ఒక చిన్న పట్టణంలో మందు దొరక్క జనం పడే పాట్లు, మందు కోసం వారు చేసే సాహసాలు, దాని చుట్టూ అల్లుకున్న గమ్మత్తైన పరిస్థితులే ఈ 'మూడు లాంతర్లు' కథ. ఓటీటీలో తనదైన మార్క్ వేసిన నటుడు కార్తీక్ రత్నం ఇందులో హీరోగా నటిస్తున్నాడు.
కామెడీ థ్రిల్లర్ వెబ్ సిరీస్
ఈ మూడు లాంథర్లు వెబ్ సిరీస్కు వి.వి. గోపాలకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సిరీస్ గురించి ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ ఆశ్చర్యం వ్యక్తం చేసింది.
"నేను ఈ కథ విన్నప్పుడు నిజంగా ఆశ్చర్యపోయాను. ఓటీటీ స్పేస్ కోసం ఇలాంటి ఒక కాన్సెప్ట్ను ఎలా ఊహించారా అనిపించింది. ఈ సిరీస్లో కావాల్సినంత కామెడీ, థ్రిల్లర్ ఎలిమెంట్స్, టెన్షన్ ఉన్నాయి. ఇది కచ్చితంగా నా కెరీర్లో ఉత్తమమైన ప్రాజెక్టుల్లో ఒకటిగా నిలుస్తుంది" అని ఐశ్వర్య తెలిపింది.
ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ వెబ్ సిరీస్ విడుదల తేదీని జియోహాట్స్టార్ త్వరలోనే ప్రకటించనుంది. సీరియస్ పాత్రలే కాకుండా ఇలాంటి కామెడీ థ్రిల్లర్లో ఐశ్వర్యను చూడటం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుందని మేకర్స్ భావిస్తున్నారు.
జియోహాట్స్టార్ దూకుడు
సౌత్ అన్బౌండ్ పేరుతో జియోహాట్స్టార్ ఓటీటీ మెగా ఈవెంట్ కు ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఈవెంట్లోనే జియోహాట్స్టార్లో 2026లో రాబోతున్న 40 సినిమాలు, సిరీస్ లు, షోల టైటిల్స్ ను రివీల్ చేశారు. మంగళవారం అంటే డిసెంబర్ 9న చెన్నైలో ఈ ఈవెంట్ జరిగింది. జియోహాట్స్టార్ సౌత్ అన్బౌండ్ ఈవెంట్ కు లెజెండరీ స్టార్లు వచ్చారు. తెలుగులో సేవ్ ద టైగర్స్ సీజన్ 3ని కూడా ఆ ఓటీటీ అనౌన్స్ చేసింది.

E-Paper












