...
...
Next Story

APL 2026 : మంగళగిరిలో ఆంధ్రా ప్రీమియర్ లీగ్.. రామ్ చరణ్ చేతుల మీదుగా ఏపీఎల్ 2026 ట్రోఫీ ఆవిష్కరణ!

APL 2026 : ఏపీ రాజధాని అమరావతిలో ఏపీఎల్ సందడి నెలకొంది. మంగళగిరిలోని స్టేడియంలో జరిగిన మ్యాచ్‌ల ప్రారంభ వేడుకకు గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ హాజరయ్యారు.

Published on: Jun 24, 2026, 22:10:02 IST
Advertisement

ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతమైన అమరావతిలో క్రికెట్ పండుగ వాతావరణం నెలకొంది. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఏసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ‘ఆంధ్రా ప్రీమియర్ లీగ్’ (APL) చివరి దశ మ్యాచ్‌లు అత్యంత ఉత్సాహంగా సాగుతున్నాయి. జూన్ 24 సాయంత్రం జరిగిన హోరాహోరీ పోరులో భీమవరం బుల్స్, క్యాపిటల్ అమరావతి రాయల్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన క్యాపిటల్ అమరావతి రాయల్స్ జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకుంది.

ఏపీఎల్ 2026
ఏపీఎల్ 2026

ఏపీఎల్ చివరి దశ మ్యాచ్‌ల ప్రారంభ వేడుకలకు టాలీవుడ్ ప్రముఖ కథానాయకుడు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు. టోర్నీ అధికారిక ట్రోఫీతో పాటు జెర్సీలను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ.. 'యువ క్రికెటర్లు తమ ప్రతిభను నిరూపించుకోవడానికి ఆంధ్రా ప్రీమియర్ లీగ్ ఒక అద్భుతమైన వేదిక. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో దాగున్న యువ క్రికెట్ నైపుణ్యాలను వెలికితీసేందుకు ఏసీఏ తీసుకున్న ఈ చొరవ అభినందనీయం.' అని పేర్కొంటూ ఆటగాళ్లకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్(ACA) అధ్యక్షుడు కేశినేని శివనాథ్ (చిన్ని), కార్యదర్శి సానా సతీశ్, స్థానిక ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సహా పలువురు ప్రముఖులు పాల్గొని క్రీడాకారులను ఉత్సాహపరిచారు.

షెడ్యూల్

మంగళగిరి ఇంటర్నేషనల్ స్టేడియంలో జూన్ 24 నుంచి నాలుగు రోజుల పాటు లీగ్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ప్రతిరోజూ మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో డబుల్ హెడర్ మ్యాచ్‌లు ఉంటాయి.

జూన్ 27: గ్రూప్/లీగ్ దశ మ్యాచ్‌లు ముగుస్తాయి.

జూన్ 28: టాప్ 4 జట్ల మధ్య ప్లేఆఫ్స్ పోరు ప్రారంభమవుతుంది.

ఈ టోర్నీలో మొత్తం ఏడు (7) జట్లు టైటిల్ కోసం తలపడుతున్నాయి. ప్రస్తుత సమీకరణాల ప్రకారం.. భీమవరం బుల్స్ జట్టు ఆడిన 6 మ్యాచ్‌లలో 8 పాయింట్లు సాధించి టేబుల్ టాపర్‌గా అగ్రస్థానంలో దూసుకుపోతోంది. లీగ్ దశ ముగిసే సమయానికి పాయింట్ల పట్టికలో మొదటి నాలుగు స్థానాల్లో నిలిచే జట్లు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తాయి. ఐపీఎల్ (IPL) తరహాలోనే ఈ మ్యాచ్‌లకు కూడా స్థానిక క్రికెట్ అభిమానుల నుంచి భారీ స్పందన లభిస్తోంది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe